Monday 19 March 2018

కులం వేరు... వర్ణం వేరు

మనుధర్మం -9

ఎం.వి.ఆర్.శాస్త్రి
......
   కులభూతం హిందూ సమాజానికి శాపం.

   నేటి హిందూ  సమాజం లోని చెడుగులకు దుర్మార్గపు కులవ్యవస్థ మూలం.

    నా కులం ఎక్కువ , నీ కులం తక్కువ అనే కావరమే రోత. సంకుచిత కులదృష్టితో వ్యవహరించటం, కింది కులాల వారిని తొక్కేయ్యాలని చూడటం,  అగ్రవర్ణ దురహంకారంతో దళిత కులస్తులను అంటరానివాళ్ళుగా అవమానించటం, దారుణ వివక్షకు గురి చేయటం అమానుషం . అనాగరికం. నిష్కృతిలేని నేరం .

    కులరక్కసి ని నామరూపాలు లేకుండా నిర్మూలిస్తేగాని హిందూ సమాజం బాగుపడదు.ముందుకు వెళ్ళదు.

     ఇందులో మరో మాటకు తావులేదు. వెయ్యేళ్ళ కింద భగవత్ రామానుజాచార్యుల నుంచి ఇటీవలి స్వామి దయానంద సరస్వతి ,స్వామి వివేకానంద ,స్వామి శ్రద్ధానంద , హెడ్గెవార్ ల వరకూ ఎందరో మహాత్ములు ఘంటాపథంగా చాటిన అక్షరసత్యమిది. మెడమీద తలకాయ, కాస్తంత ఇంగితజ్ఞానం , కొంచెం వివేకం ఉన్న ప్రతివాడూ ఒప్పుకున్న ,ఒప్పుకుని తీరాల్సిన విషయమిది.

      కాని కులవివక్షకు మూలం మనుధర్మం కాదు.  కులమనేది మనువు తెచ్చిపెట్టింది కాదు. ఈ కాలంలో దళిత ఎస్.సి.లూ , వెనకబడిన బి.సి.లు పడుతున్న అగచాట్లకు, తరతరాలుగా అనుభవిస్తున్న క్షోభకూ కారణం మనువాదం కానే కాదు.

      ఇంకా చెప్పాలంటే మనను చికాకు పెడుతున్న,  తలవంపులు తెస్తున్న కులసమస్యకు మనుధర్మం హేతువు కాదు ...  విరుగుడు! ఔను ...  విరుగుడే!!

      భారతదేశ వైభవానికి , ప్రాశస్త్యానికి మూలమైన మతాన్ని, ధర్మాన్ని కుళ్ళ పొడుస్తే గాని ఈ దేశాన్ని లొంగదీయలేమన్న దుర్బుద్ధితో రెండు మూడు శతాబ్దాలకింద ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు , వారి తైనాతీలైన క్రైస్తవ మిషనరీలు పథకం ప్రకారం మొదలెట్టిన దుష్ప్రచారం మన కళ్ళకు మాయపొరలు కమ్మించింది.   పాశ్చాత్య విద్య పేరు చెప్పి మిషనరీ స్కూళ్ళలో , కాలేజీలలో తరాలతరబడి భారతీయుల మెదళ్లలోకి ఎక్కించిన కాలకూట విషం కారణంగా మన ధర్మం, మన సంస్కృతి , మన వారసత్వం ఎంత గొప్పవో మనమే గుర్తించలేక ...  వాటిని చీదరించటమే  ఆధునికతకు , సంస్కారానికి కొలమానమనుకునే దౌర్భాగ్య స్థితి దాపురించింది. సిగ్గుచేటు కులవివక్షకు, దిక్కుమాలిన కుల వ్యవస్థకు మనువే మూలపురుషుడన్న ద్వేషం ఈ మానసిక వైకల్యం లోంచి పుట్టుకొచ్చిందే.

    మనువు, మనుస్మృతి చెప్పింది వర్ణం గురించి !  వర్ణం వేరు. కులం వేరు ! అ రెండిటి మధ్య హిమాలయానికీ , పెంటకుప్పకూ ఉన్నంత తేడా ఉంది. మనుధర్మశాస్త్రం లో పేర్కొన్న వర్ణాన్ని సరిగా అర్థం చేసుకోక ... ఇప్పుడు మనల్ని పీడిస్తున్న కులవ్యవస్థా , మనువు చెప్పే వర్ణ వ్యవస్థా ఒకటేనని పొరపడటం గందరగోళానికి మూలం.

    కులం అనేది పుట్టుకను బట్టి నిర్ణయమవుతుంది. వర్ణం అనేది చేసే పనిని బట్టి, మనిషి గుణాన్ని బట్టి , స్వభావాన్ని బట్టి, సామర్ధ్యాని బట్టి, యోగ్యతను బట్టి నిర్ణయమవుతుంది.

    కులం అనేది మారదు. బ్రాహ్మణుడుగా జన్మనెత్తినవాడు బతికినంతకాలం బ్రాహ్మణుడే! శూద్ర కులం లో పుట్టినవాడు బతికినంతకాలం శూద్రుడే! బ్రాహ్మణ కులంలో చెడబుట్టి, బ్రాహ్మణత్వం ఏ కోశానా లేక , అన్ని అవలక్షణాలూ ఉన్న దూర్తుడుకూడా  బతికినంతకాలం బ్రాహ్మణుడుగానే చెలామణీ కాగలడు. శూద్రుడుగానో, దళితుడుగానో పుట్టి వేదశాస్త్రాలను అభ్యసించి ఉత్తమ వైదిక సంస్కారం అలవరచుకుని నియమబద్దంగా జీవించే గుణవంతుడు బ్రాహ్మణుడిగా గుర్తించబడడు.  ఇది  జన్మ మీద ఆధారపడిన కులవ్యవస్థ లక్షణం.

    వర్ణం అనేది తరగతి ! చేసే  పనిని బట్టి, గుణం బట్టి, యోగ్యతబట్టి నిర్ణయమవుతుంది. దాన్ని మార్చుకోవటం మనిషి చేతుల్లో ఉంది. వర్ణం అంటే రంగు ;  ఆర్యులు తెల్లనివాళ్లు  ; ద్రవిడులు లేక దస్యులు నల్లని వాళ్ళు ; ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులు అలా రంగును బట్టి వర్ణవ్యవస్థను నెలకొల్పారు - అని కొందరు మిడిమిడి జ్ఞానులు అంటారు .అది సరికాదు. వర్ణం అనేది వృణ్ అనే పదం నుంచి వచ్చింది .ఎంచుకోవటం అని దాని అర్థం . 'వర్ణః వృణోతే " ( ఎంచుకోబడేది వర్ణం ) అన్నాడు నిరుక్తకారుడు యాస్కుడు. "చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః " ( గుణాలనుబట్టి, కర్మలనుబట్టి నాలుగు వర్ణాలు నేను సృష్టించాను అని భగవద్గీత  ( 4-18 ) లో భగవానుడు చెప్పింది వర్ణవ్యవస్థకు ప్రమాణం. నాలుగు వర్ణాలు సమాజంలో నాలుగు తరగతులు.


  కులం అనేది  caste system. వర్ణం అనేది class system . వర్ణవ్యవస్థ లో పేర్కొన్న బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య శూద్ర తరగతులే ( classes) అవే  పేర్లతో  కులాలుగా (castes), మళ్ళీ వాటిలోనుంచి ఉపకులాలుగా మన దౌర్భాగ్యం కొద్దీ దాపురించటం వల్ల వర్ణమే కులం అన్న దురభిప్రాయం మనందరికీ కలిగింది.

   ఏ సమాజంలో నైనా ముఖ్యంగా అవసరమయ్యేవి : 1.విద్య 2.పరిపాలన , రక్షణ 3. ఉత్పత్తి, వ్యాపారం 4. శ్రమశక్తి . విద్యను గరిపి జ్ఞాన బోధ చేసేవాడు బ్రాహ్మణుడు : పరిపాలన , రక్షణ బాధ్యత నిర్వర్తించేవాడు క్షత్రియుడు ; వర్తకవాణిజ్యాలు  చేసేవాడు వైశ్యుడు: కాయకష్టం చేసే వాడు శూద్రుడు అని మనపూర్వులు పేర్లు పెట్టారు.

    ఇవి watertight compartments కావు. కావాలనుకుంటే అవసరమైన యోగ్యతను, నైపుణ్యాన్ని సంతరించుకుని ఒక వర్ణం వాడు అంతకంటే పై వర్ణానికి ఎగబాకవచ్చు. ఒక వర్ణంలో చేరినవాడు దానికి కావలసిన యోగ్యతను, సామర్థ్యాన్ని పోగొట్టుకుని భ్రష్టుడైతే దిగువవర్ణానికి నేట్టివేయబడనూ వచ్చు. దీనికి చాలా  దృష్టాంతాలు ఉన్నాయి.

*ఋగ్వేదం 10 వ మండలం లో పాచికల విద్యమీద 34 వ సూక్తం కర్త  కవష ఐలూషుడు దాసీ స్త్రీకి పుట్టాడు. జన్మతః తల్లిది శూద్ర వర్ణం . అయినా అత్యున్నతమైన ఋషిత్వాన్ని పొందాడు. మంత్రద్రష్ట కాగలిగాడు.
* శూద్ర స్త్రీకి జన్మించిన వత్సుడు, చండాల కుటుంబంలో  పుట్టిన మతంగుడు బ్రాహ్మణత్వం పొంది వేద ఋషులు కాగలిగారు.
*తన తండ్రి ఎవరో తల్లికే తెలియని సత్యకాముడు బ్రాహ్మణుడుగా గుర్తింపుపొంది బ్రహ్మవాది ఋషి అయ్యాడు.
*దాసీ కడుపున పుట్టిన విదురుడు కురుసభలో మంత్రిపదవిపొంది గొప్ప ధర్మవేత్తగా  పేరొందాడు.
*క్షత్రియ కుటుంబంలో పుట్టిన విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. మళ్ళీ అదే విశ్వామిత్ర బ్రహ్మర్షి కుమారులు శూద్రులకంటే దిగువకు పతితులయ్యారు.
*క్షత్రియ వంశంలో పుట్టిన రాముడు , యాదవ కుటుంబంలో పుట్టిన కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడి అవతారాలుగా లోకమంతా పూజలందుకున్నారు.
*శ్రీరాముడి వంశకర్త అయిన రఘుమహారాజు కుమారుడు ప్రవృద్ధుడు సంఘబాహ్యుడై రాక్షసత్వం పొందాడు.
*బ్రాహ్మణ  జన్మ ఎత్తిన రావణుడు భ్రష్టుడై రాక్షసుడు అయ్యాడు.
*క్షత్రియుడుగా పుట్టిన త్రిశంకుడు చండాలుడయ్యాడు.

     మహాభారతకాలం దాకా ఉన్నదీ, మనువు ఉద్దేశించిందీ ఇలా  2 way motion కి వీలు ఉన్న  వర్ణమే. వర్ణమనేది పుట్టుకని బట్టి నిర్ణయమయితే బ్రాహ్మణ కులం లో పుట్టినవాడు  తనకు నిర్దిష్టమైన విధులు నిర్వర్తించకపోయినా ...చేసే పనులవల్ల భ్రష్టుడైనా నికృష్టుడైనా -బతికినంతకాలం బ్రాహ్మణుడుగానే గానే మిగిలిపోతాడు. జన్మతః శూద్రుడైనవాడు ఎన్ని ఉత్తమ లక్షణాలను సంతరించుకున్నా ఎదుగుబొదుగులేక శూద్రుడుగానే మిగిలిపోతాడు. అది మనువు మూల సూత్రానికే విరుద్ధం. మనుస్మృతి లో ఉన్నదంతా కిందినుంచి పైకి , పైనుంచి కిందికి మారడానికి వీలుకల్పించే వర్ణవ్యవస్థే .  మచ్చుకు ఈ కింది శ్లోకాలను గమనించండి :

     శూద్రో బ్రాహ్మణతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతాం
     క్షత్రియా జ్జాతమేవం తు విద్యాద్వైశ్యాత్తథైవచ  ( మనుస్మృతి 10 -65 )
     శూద్రుడు బ్రాహ్మణత్వం పొందును . బ్రాహ్మణుడు శూద్రత్వము పొందును. అలాగే క్షత్రియుడికి పుట్టినవాడు, వైశ్యుడికి పుట్టినవాడు చేసే పనులను బట్టి అన్య వర్ణము పొందుదురు 

     న తిష్ఠతి తు యః పూర్వాం నోపాస్తే యశ్చ పశ్చిమాం
     స శూద్రవత్ బహిష్కార్యః సర్వస్మాత్ ద్విజకర్మణః   ( మనుస్మృతి 2 -103 )
      ఉదయము, సాయంత్రం ఎవడు సంధ్యను ఉపాసించడో వాడిని శూద్రుడి వలె అన్ని ద్విజ కర్మల నుండి బహిష్కరించవలెను. 

       యోనధీత్య ద్విజో వేదమన్యత్ర కురుతే శ్రమం 
       స జీవన్నేవ శూద్రత్వమాశు గచ్చతి సాన్వయః  ( మనుస్మృతి 2-168 ) 
        ఎవడు వేదాధ్యయనం చేయక ఇతర శాస్త్రములను ఎన్ని అభ్యసించినా అతడు తన వంశజులతో సహా శూద్రత్వము పొందును. 

     మనువు దృష్టిలో వర్ణమనేది flexible అనడానికి ఇంతకంటే ఉదాహరణలు అక్కరలేదు. అనంతరకాలంలో జాతి ( అంటే  జన్మ ) ని బట్టి కులం అనేది వచ్చిపడ్డాక చాతుర్వర్ణాలలో ఎన్నో కులాలు, ఒక కులంలోనే గోత్రాలను బట్టి ఎన్నో ఉపకులాలు వచ్చిపడ్డాయి. ఆ జాబితా చాంతాడంత ఉంటుంది. మనుస్మృతిలో అలా జన్మనా కులవ్యవస్థ ప్రస్తావన  , ఉపకులాల ఊసు ఎక్కడాలేదు. పైగా ఇంటికి వచ్చిన అతిథి కులగోత్రాలు కనుక్కోకుండా భోజనం పెట్టాలని , అలా కనుక అడిగితే అది  వాంతి చేసుకున్న అన్నాన్ని పెట్టినట్టే అవుతుందని మనువు అంటాడు కింది శ్లోకంలో :

     న భోజనార్థం స్వే విప్రః కులగోత్రే నివేదయేత్ 
     భోజనార్థం హి తే శంసన్ వాంతాశీరుచ్యతే బుధై: ( 3 - 109 )

     కులగోత్రాలతో నిమిత్తం లేకుండా కలిసి భోజనం చేయాలని వేల ఏళ్ళ కిందే బోధించిన మనువును మనల్ని పట్టిన కులపిశాచానికి మూలపురుషుడు అనటం విజ్ఞత కాదు .. అది అన్యాయం ... దుర్మార్గం .

  ఇంకా ఉంది .










5 comments:

  1. ఈ వ్యాస పరంపర చదివి ఐన బొత్తిగా చదువుకు చెడి పోయిన వాళ్ల కళ్ళు తెరుచుకుని శక్తి దేవుడు వాళ్ళు కు ఇవ్వాలి

    ReplyDelete
  2. Kulathathvam ku kaaranam manusmruthi anevallaku sastri gaari rachana chempa pettu....

    ReplyDelete
  3. Kulathathvam ku kaaranam manusmruthi anevallaku sastri gaari rachana chempa pettu....

    ReplyDelete
  4. థాంక్స్ గురువు గారు ....కనీసం నిజం ఏంటో తెలుసుకునే భాగ్యం కలిగింది ....మీ ప్రయత్నాన్నని
    మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను

    ReplyDelete