Wednesday 4 August 2021

మరవలేని మిత్రుడు

 ఎం.వి.ఆర్. శాస్త్రి 

...........................

ఈ ఆదివారం ( 2021 ఆగస్టు 1 న ) కన్నుమూసిన ప్రముఖ కార్మిక నాయకుడు  వి,వి.రామారావు నాకున్న కొద్దిమంది ఆప్తమిత్రుల్లో  ఒకడు. నా ఆలోచనా విధానాన్ని మార్చి , నా మీద ప్రగాఢ ప్రభావం చూపిన ముగ్గురు వ్యక్తుల్లో కాలక్రమాన్ని బట్టి మొదట పేర్కొనవలసినవాడతడు .

1967 లో నా 15 వ ఏట ( రికార్డుల్లో ఒక సంవత్సరం ఎక్కువగా చూపించి) కృష్ణాజిల్లా జగ్గయ్యపేట హైస్కూల్ లో హయ్యర్ సెకండరీ ( 12th class ) పరీక్ష పాసయ్యాక బి.ఎ. నుంచి బి.ఇ. దాకా అగ్రికల్చర్ B.Sc. సహా అన్ని రకాల కోర్సులకు  అప్లై చేస్తే చివరికి నంద్యాల పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగు డిప్లమా ( L.E.E. ) కోర్సు సీటు వచ్చింది.  పల్లెటూరినుంచి పట్నానికి భయంభయంగా వెళ్లాక కాలేజీలో నాకు మొదటిరోజే పరిచయమైన వాడు రామారావు. అతడు సివిల్ ఇంజనీరింగులో ఫైనల్ ఇయర్ స్టూడెంటు. మాదీ కృష్ణా జిల్లానే  అన్నాడు. చూడగానే నచ్చాడు. మంచి మాటకారి. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటు తానేనట. ఆ సంవత్సరం కూడా మళ్ళీ పోటీ చేస్తున్నాడట. నా వోటు అతడికేనని  తను అడగకుండానే డిసైడ్ అయ్యాను.

అప్పట్లోముఖ్యంగా ఇంజనీరింగు, మెడికల్  కాలేజీలలో కొత్తగా చేరినవారికి సీనియర్ల రాగింగు బాధ మహా తీవ్రంగా ఉండేది. నన్నూ ఎంత ఏడిపిస్తారోనని  భయపడ్డాను. ఇక్కడ అలాంటివేమీ ఉండవు . నేను జరగనివ్వను అన్నాడు  రామారావు. దాంతో ఇంకా నచ్చేశాడు.  అతడు అప్పటికే వీర కమ్యూనిస్టు. స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) నాయకుడు. . విద్యార్థి సమస్యలమీద ప్రిన్సిపాల్ తో తెగ కొట్లాడేవాడు. అయినా ప్రిన్సిపాల్ కు అతడంటే మహా ఇష్టం. ఏ కారణం చేతో ఆ ప్రిన్సిపాల్  ను ట్రాన్స్ఫర్ చేస్తే రామారావు  మా చేత సమ్మె చేయించి , హైదరాబాద్ దాకా వెళ్లి  బదిలీని రద్దు చేయించాడు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలో మమ్మల్ని పోలీసులు పట్టుకుపోతే రామారావు  వాళ్ళతో గొడవపడి  , ప్రిన్సిపాల్ ను కూడా పట్టుకొచ్చి అందరినీ విడిపించాడు. (తరవాత కాలంలో  విశాఖ స్టీల్ ప్లాంటు యూనియన్ కి తను  గౌరవాధ్యక్షుడు అయ్యాడు.)

రామారావులో కళలు చాలా ఉన్నాయి. బాగా పాడేవాడు. మంచి నటుడు. కాలేజి యనివర్సరీల్లో నాటకాలు వేసి ప్రైజులు కొట్టేసేవాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం గడగడ అప్పజేప్పేవాడు. మాటలతో అందరినీ కట్టిపడేసేవాడు. నిప్పులాంటి మనిషి .ఎక్కడా నీతి గీత దాటడు.  ఎవరినీ లెక్కచేయడు. పచ్చిబూతులు తప్ప మాట్లాడడు .అది కూడా బహుసొగసుగా! వినటానికి ఇంపుగా! 

వారిది కలిగిన కుటుంబమే. కాని ఏదో మాట పట్టింపు వచ్చి , ఇంటినుంచి వచ్చేశాడు. తండ్రి అంటే  ఇష్టం. అయినా మాటల్లేవు. ఫైనల్ ఇయర్ పాసయ్యాక కూడా నంద్యాలలో  కాలేజీ దగ్గరలో మేమున్న టెక్కె ఏరియాలో మాలాగే అద్దెగదిలో  ఉండేవాడు. డబ్బుకు చాలా ఇబ్బంది పడేవాడు. అయినా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. విప్లవం గురించే మాట్లాడుతూండే వాడు. కాలేజి చదువు అయ్యాక  కమ్యూనిస్టు పార్టీలో హోల్ టైమరుగా పనిచేశాడు. పార్టీవారు అప్పుడప్పడూ చేతిలో పెట్టే కాస్త డబ్బుతోనే కాలం గడిపేవాడు. రాంభట్ల కృష్ణమూర్తి , గజ్జెల మల్లారెడ్డి  లాంటి ఉద్దండులను పట్టుకొచ్చి మాకు పొలిటికల్ క్లాసులు పెట్టించేవాడు. కర్నూల్ జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం కూడా ఒక్కోసారి అతడి రూములోనే జరిగేది.

అదిగో ఆ రోజుల్లోనే రామారావు నాకు నెమ్మదిగా మార్క్సిజం ఎక్కించాడు. నా చేత మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనలు తెగ  చదివించే వాడు. అతడితో పాటు నన్నూ ఆదర్శ లోకాల్లో విహరింప జేసేవాడు. అతడి సావాసం వల్ల నేను కాలేజి ఎగ్గొట్టి కమ్యూనిస్టు కార్యకలాపాల్లో పడటంతో  ప్రిన్సిపాల్ మా ఇంటికి  ఆ శుభ వర్తమానం తెలియపరిచాడు. మా నాన్నకు  తిక్క రేగి ‘ఇకపై నీకు రూపాయి పంపను’ అని ఉత్తరం రాశాడు. ఏమి చెయ్యాలని రామారావును సలహా అడిగాను . ‘ఇది సామాజిక సమస్య కామ్రేడ్. ఎలాగూ రెండేళ్లలో సోషలిష్టు విప్లవం వచ్చి తీరుతుంది . దాంతో ఆందరి సమస్యలూ తీరుతాయి. అప్పటిదాకా నాలాగే ఎలాగోలా అవస్థలు పడు.’ అని అతడు నమ్మకంగా చెప్పాడు. నేనూ అంతే సీరియస్ గా అతడి మాట నమ్మాను. ఆ రోజుల్లో పీడిత తాడిత ప్రజానీకం, గతితార్కిక భౌతిక వాదం, సామ్యవాదం, సమసమాజం తప్ప వేరే ఆలోచన వచ్చేది కాదు. కులమన్నా, మతమన్నా, దేవుడన్నా, ఆచారాలన్నా , ఆరెస్సెస్ అన్నా కంపరం పుట్టేది. ఆరెస్సెస్ లో కలిసిన  నా చిన్ననాటి స్నేహితులతో వాళ్ల సంస్థనూ, హిందూత్వ భావజాలాన్నీ చీల్చి చెండాడుతూ పేజీలకొద్దీ ఉత్తరాలు రాస్తూండేవాడిని , విద్యార్థి దశలో నన్ను అంతలా ప్రభావితం చేసిన రోల్ మోడల్ వేమూరి వెంకట రామారావు.

చదువు అయిపోయాక రామారావుతో కొన్నేళ్ళు సంబంధాలు తెగిపోయాయి. నేను నిరుద్యోగపర్వంలో ఉన్నప్పుడు – మా నాన్న తరఫున ఆంధ్రపత్రిక ఏజెన్సీ చూసుకుంటూ ఉండేవాడిని .  ఒకరోజు  పేపర్ పార్సిల్  రిసీవ్ చేసుకోవటం కోసం బస్ స్టాండులో ఉంటే బెజవాడ నుంచి వచ్చిన బస్సులో  రామారావు కనిపించాడు. బస్సు బయలుదేరేలోపు ఉన్న కాసేపట్లో చాలా కబుర్లు చెప్పాడు. కర్నూలు పార్టీ నాయకులతో సరిపడక వచ్చేశాడట.   పోర్ట్ కార్మిక నాయకుడు భద్రం గారు పిలిస్తే విశాఖపట్నం వెళ్లి అక్కడ యూనియన్ , పార్టీ వ్యవహారాలు  చూస్తున్నాడట. యూనియన్ పనిమీదే ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్నానని చెప్పాడు. మళ్ళీ కొన్నేళ్ళకు అనుకోకుండా విజయవాడలో ప్రజానాట్యమండలి నాటకాలపోటీ సందర్భంగా  కలిశాడు. వైజాగ్ నుంచి తన బృందంతో  నాటకం వేయటానికి వచ్చాడట. అందులో ముఖ్య పాత్ర తనదేనట.

మళ్ళీ నాలుగైదేళ్ళకు 1982లో సితార అవార్డుల ఫంక్షన్ కవర్ చేయటానికి  మొదటిసారి నేను వైజాగ్ వెళ్లాను. రామారావు గుర్తొచ్చి నేనున్న డాల్ఫిన్ హోటల్ నుంచి కాంటాక్ట్ చేశాను. పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేశాడు. ఏదో  ఆందోళనలో అరెస్టు అయ్యాడట. తరవాత హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలిసేవాడు. సోమాజీగూడలో ఈనాడు ఆఫీసు పక్కనే పోర్ట్  గెస్ట్ హౌస్ లో దిగేవాడు. కాలేజీ రోజుల్లో కమ్యూనిస్టు పాఠాలు చెప్పినట్టే  అప్పుడు బతుకు పాఠాలు చాలా బాగా చెప్పేవాడు. అతడి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అప్పటినుంచీ  మరణించేవరకూ రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉండేవాడు. మరణానికి పక్షం రోజుల ముందు  మాట్లాడలేని  స్థితిలో కూడా ఫోన్ చేయించి నా గొంతు విన్నాడు.  

రామారావు మొదట్లో రాజ్ దూత్ మోటర్ సైకిల్ మీద తిరిగేవాడు. కొంతకాలానికి యూనియన్ తనకు కారు కొనిచ్చిందని చెప్పాడు. తరవాత ఎ.ఐ.టి.యు.సి. రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. పోర్ట్ వర్కర్స్ యూనియన్ల సమాఖ్యకు కాబోలు  జాతీయ నాయకుడయ్యాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ ఒకలాగే ఉన్నాడు. జనం మధ్య బతికాడు. లేనివాడి బాగోగులు పట్టించుకున్నాడు. గుప్తదానాలు ఎన్నో చేశాడు. ఎందరినో ఎన్నోవిదాల ఆదుకున్నాడు. పదవులను సొంతలాభానికి వాడుకునే లోకరీతికి భిన్నంగా తన పలుకుబడితో  నిధులు సమీకరించి విశాఖపట్నంలో పార్టీకి పెద్ద భవనం కట్టించాడు. తొలిరోజుల్లో తనను పైకి తెచ్చిన నీలం రాజశేఖర రెడ్డిని గుర్తుపెట్టుకుని ఆ భవనానికి ఆయన పేరు పెట్టాడు. కాలేజి రోజుల్లో సమస్యలపై కొట్లాడికూడా ప్రిన్సిపాల్ కు ఇష్టుడైనట్టే , కార్మికులతరఫున ఎంత గొడవపడ్డా పోర్ట్ చైర్మన్లకు గౌరవపాత్రుడయ్యాడు. ముఖ్యంగా పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు రామారావు ప్రస్తావన వచ్చినప్పుడల్లా తెగ మెచ్చుకునే వాడు.

ఒకసారి నేను మా గురువు సద్గురు శివానందమూర్తిగారిని కలవటానికి భీమిలి  వెళ్ళబోతున్నాను.  వెళుతూ వస్తూ మనం మాట్లాడుకోవచ్చు ;నేనూ వస్తానని రామారావు అన్నాడు. ‘ఈ గురువులు నా ఒంటికి పడరు; నేను లోపలికి రాను ; కారులో వెయిట్ చేస్తాను’ అన్నవాడుకాస్తా తీరా వెళ్ళాక తానూ నా వెంట వచ్చాడు. లోపల గురువుగారు కొంతమందికి ఏదో  చెబుతున్నారు. రామారావెవరో ఆయనకు  తెలియదు. నేనూ వివరాలు చెప్పలేదు. కాని మనవాడిని  చూడగానే ఆయన నడుస్తున్న సంభాషణలో మార్క్స్ ‘కేపిటల్’ ప్రస్తావన తెచ్చారు. మార్క్సిస్టు మూల సిద్ధాంతాన్నీ , భారతీయ తత్త్వాన్నీ చక్కగా సమన్వయం చేశారు. రామారావుకు అది నచ్చింది.బయటికి వచ్చాక ‘ ఆయన చెప్పినదానితో నాకు పేచీ లేదు. అంతా ఒప్పుకుంటాను. కానీ-'  అన్నాడు.

 ఆ ‘కానీ’  దగ్గరే అతడికీ నాకూ తగవు. జీవితకాలమంతా వాదులాడినా అది తెగలేదు. తెగేదీ కాదు. భావజాల పరంగా మేము ఉత్తరదక్షిణ ధృవాలం. అ తేడా మా స్నేహానికి అడ్డురాలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా నా కుశలం , నా కుటుంబ  క్షేమం ఆప్యాయంగా అడిగేవాడు. సొంత అన్నదమ్ములకంటే ఎక్కువగా ఆపేక్ష పడేవాడు.  తన స్నేహితులలో ఎవరికి ఏ మంచి  జరిగినా ఎంతో సంతోష పడేవాడు.  తన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో ,  తన కార్మిక సోదరులనూ అంతే ప్రేమించాడు. ఒకరు వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోకుండా ఆదర్శవంతంగా బతికాడు. ఆచరణ, సమకాలిక పోకడల విషయంలో విభేదించినా నమ్మిన సిద్దాంతానికి కడదాకా కట్టుబడ్డాడు. నలుగురిలో  మంచి పేరు తెచ్చుకుని  మహారాజులా వెళ్ళిపోయాడు.

( ఇక్కడ  కనిపించేది 20 ఏళ్ల కిందట మా ఉభయమిత్రుడు బొలిసెట్టి సత్యనారాయణ గారు, చందు సుబ్బారావుగారు చొరవ తీసుకుని విశాఖపట్నంలో నిర్వహించిన నా ‘కాశ్మీర్ కథ’ గ్రంథావిష్కరణ సభలో నేను,రామారావు ఉన్న  ఫోటో )



                                    --------------------------------------------

Wednesday 2 June 2021

ఎన్నదగిన జర్నలిస్టు

  ఎం.వి.ఆర్.శాస్త్రి 

...................................    

     చిన్న వయసులోనే  కోవిడ్ బారిన పడి  ఈ మధ్యాహ్నం కన్నుమూసిన జర్నలిస్టు వై. శ్రీనివాసరావు విద్వత్తులో , వృత్తి నైపుణ్యంలో సాటిలేని ప్రజ్ణాశాలి. యోగ్యుడు , గుణవంతుడు.



     నేను ఆంధ్రప్రభ డిప్యూటీ ఎడిటర్ గా చేరిన కొత్తలో హైదరాబాద్ బ్యూరోలో రిపోర్టర్ ఉద్యోగం కోసం శ్రీనివాసరావు నాదగ్గరికి వచ్చాడు. చూడగానే నాకు నచ్చాడు. అప్పుడతడు ఆంధ్రపత్రికలో రిపోర్టర్ గా ఉన్నాడు. 

     ఆ సమయాన  కొత్త నియామకాల సంగతి ఆలోచించే స్థితిలో యాజమాన్యం లేదు. ఎందుకంటే ఉన్న ఉద్యోగులు సమ్మె కట్ట బోతున్నారు. సంప్రదింపులు ఫలించలేదు. రాష్ట్రమంతటా ప్రచురణ నిలిచిపోక తప్పదన్న ఆందోళన. 

     కొన్నాళ్లకు ( 1991 మొదటి పాదం లో ) సమ్మె ఉద్ధృతంగా మొదలైంది. హైదరాబాద్, విజయవాడ, విజయనగరం కేంద్రాలలో అన్ని డిపార్ట్మెంటుల వారూ సమ్మె లో చేరారు. ముద్రణ నిలిచిపోయింది. 

     ఆ మూడే కాక ఆంధ్రప్రభకు మద్రాసు , బెంగుళూరుల్లో కూడా ప్రచురణ కేంద్రాలున్నాయి. అక్కడి యూనియన్లు వేరు. అవి సమ్మెలో చేరలేదు. యథావిథిగా పని చేస్తున్నాయి. వాటికి ఆంధ్రప్రదేశ్ వార్తలు కావాలి. ఎప్పటిలాగే వాటిని ఆయా ప్రచురణ కేంద్రాలకు అందేట్టు చూడటం న్యూస్ నెట్వర్క్ చీఫ్ గా నా బాధ్యత. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో , రాజధానిలో నా రిపోర్టర్లందరూ సమ్మెలో ఉన్నారు. ఎవరైనా పని చేస్తామన్నా యూనియన్లు చేయనియ్యవు.   అప్పట్లో ఏడెనిమిది  మంది ఉండే హైదరాబాద్ న్యూస్ బ్యూరో ను ఒక్కడూ లేకుండా పనిచేయించటం ఎలా? మద్రాసు డెస్క్ వారు పిటిఐ , యు ఎన్ ఐ ఏజెన్సీ వార్తలతో కొంతవరకు లాగించగలరు.   కాని ఆ కవరేజి సరిపోదు. వార్తల్లో లోకల్ ఫ్లేవరు ,  బ్యూరోనుంచి ఎక్స్ క్లూజివ్ స్టోరీలు లేకపోతే పేపరు చప్పగా ఉంటుంది. వాటిని సమకూర్చుకోవటం ఎలా?

      పెద్ద చాలెంజి. ఆ సమయాన గుర్తుకొచ్చాడు వై. శ్రీనివాసరావు. పిలిచి , ఏమైనా సాయం పట్టగలవా అని అడిగాను. బిడియంగా నవ్వి , తప్పకుండా చేస్తానన్నాడు. ఎంతమందినైనా ఎంగేజ్ చేయి . కావలసినంత  ఖర్చుపెడదాం. కవరేజ్ బావుండాలి - అన్నాను. అతను అడిగిందల్లా ఒక్కటే - 'డెడ్ లైను ఏమిటి ? వార్తలు ఎక్కడ అందజేయాలి?'  చెప్పాను. 'చాలు;నేను చూసుకుంటాను' అన్నాడు.

     నిజంగానే అంత పనీ ఒంటి చేత్తో చక్కపెట్టాడు. ఏమి చేశాడో , ఎక్కడ తిరిగాడో , ఎలా మేనేజ్ చేశాడో తెలియదు . సాయంత్రం 5 గంటలకల్లా  సొంత దస్తూరీలో  రకరకాల వార్తలు, స్పాట్ రిపోర్టులు , స్పెషల్ స్టోరీలు రాసి పట్టుకొచ్చేవాడు. హడావుడిగా రాసినా వాటిలో అక్షరం కూడా సరిచేయవలసిన అవసరం సాధారణంగా ఉండేది కాదు. 

     అవి మొబైల్ ఫోన్లు , 4 జీ లూ , ఇంటర్నెట్లూ లేని రోజులు. పత్రికా కార్యాలయాల్లో  తెలుగు వార్తలన్నీ రోమన్ స్క్రిప్ట్ లో టెలిప్రింటర్ల ద్వారా పంపబడుతుండేవి. హైదరాబాద్ ఆఫీసుసమ్మెలో ఉన్నది కాబట్టి టెలిప్రింటర్లు అందుబాటులో లేవు. ఫాక్స్ లోనే పంపాలి. ఆ కాలాన ఫాక్స్ సదుపాయమూ ఎక్కడో గాని దొరికేది కాదు. బషీర్ బాగ్ బాబూఖాన్ ఎస్టేట్ దగ్గర ఒక ఫాక్స్ సెంటర్ తో ఏర్పాటు చేసుకున్నాము. రోజూ  సూర్యాస్తమయ సమయానికి కాపీలు అక్కడికి చేర్చేవాళ్లం. శ్రీనివాసరావు దగ్గరుండి వాటిని మద్రాసు పంపించేవాడు. ఆతరవాత కూడా రాత్రి  ముఖ్యమైన పరిణామాలను ఫాక్స్ సెంటరు మూసేంతవరకూ కవర్ చేయాలని చాలా తంటాలు పడేవాడు. మరునాడు మద్రాసు , బెంగుళూరు ఎడిషన్లు పంపిణీ కాగలిగిన చోట్ల పేపరు చదివిన వారు హైదరాబాదులో న్యూస్ బ్యూరో పూర్తి స్థాయిలో పని చేస్తున్నదనుకునేవారు. ఇప్పటికీ చాలా మందికి తెలియని రహస్యమేమిటంటే ఆంధ్రప్రభలో సమ్మె సాగిన ఆ ఆరేడు వారాలపాటూ మొత్తం న్యూస్ బ్యూరో పనిని వై.శ్రీనివాసరావు అనే ఒక పొట్టి జూనియర్ రిపోర్టరు వేరే పత్రికలో కొలువు చేస్తూనే ఒక్క చేత్తో గుంభనంగా చక్కబెట్టాడని. 

     రిస్కు తీసుకుని చాలా కష్ట పడుతున్నాడన్న అభిమానంతో డబ్బు ఇవ్వబోతే శ్రీనివాసరావు తాను ఖర్చు పెట్టినదానికి మించి రూపాయి కూడా ఎక్కువ తీసుకునేవాడు కాదు. సమ్మె మగియగానే అతడిని హైదరాబాద్ బ్యూరోకి స్టాఫ్ రిపోర్టరుగా తీసుకున్నాను. ఏ ఎసైన్ మెంటు ఇచ్చినా వంక లేకుండా చేసేవాడు.అద్భుతమైన ఎక్స్ క్లూజివ్ లు కూపీ లాగేవాడు.  ఏ సబ్జెక్టు ఇచ్చినా ప్రామాణికమైన స్పెషల్ స్టోరీని సొగసుగా , సాధికారికంగా రాసేవాడు. అంత చిన్న జూనియర్ కు అంత ప్రాధాన్యం ఇవ్వటం అప్పటి ఆంధ్రప్రభ ఎడిటర్ దీక్షితులు గారికి మొదట్లో నచ్చేది కాదు. పట్టి పట్టి చూసేకొద్దీ మపవాడి గట్టితనం ఆయనకు కూడా మెల్లిగా బోధ పడింది. 

     1994 చివరిలో నేను నిష్క్రమించాక శ్రీనివాసరావు ఎక్కవకాలం ఆంధ్రప్రభలో  ఇమడలేక పోయాడు. ఆంధ్రభూమి దిన పత్రికకు తీసుకుంటానని చెప్పినా  అతడు ఎందుకో ఇష్టపడలేదు. తరవాత ఏ పత్రికలోనూ కుదురుగా పనిచేసినట్టులేదు. 

     వై. ఎస్. ఆర్.  మంచివాడు ; గుణ వంతుడు ; భేషజాలు లేని స్నేహ శీలి ; ఎవరిగురించీ పరుషంగా మాట్లాడడు. ఎవరి పాండిత్యం పస ఎంతో ఇట్టే పసికట్టినా , ఆ సంగతి అవతలివారికి తెలియకుండా  వినయంగా ఉండేవాడు. ఎప్పుడైనా వారి ప్రస్తావన వస్తే చిన్న నవ్వు నవ్వేవాడు. చాలా అంతర్ముఖుడు. తాత్విక చింతన ఎక్కువ. తన లోతు , చూపు , ఆలోచన  ఏమిటన్నవి ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు. దారి తప్పి మన మధ్యకు వచ్చిన యోగి అనిపించేవాడు. 

     ఇష్టం లేని పనిని అతడి చేత చేయించటం ఎవరి తరమూ కాదు. ఒక సారి తిరుపతి నుంచి వస్తూంటే రైలు కంపార్ట్ మెంటులో అనుకోకుండా శ్రీనివాసరావు తండ్రి నాకు పరిచయమయ్యాడు. " మా వాడికి మీరంటే గురి. ఎలాగైనా చెప్పి పెళ్లి కి ఒప్పించండి " అని ఆయన ఎంతగానో అడిగాడు. నేనూ ప్రయత్నించాను. కాని ఆ బ్రహ్మచారిని మార్చటం నా వల్ల కాలేదు. 

     ఎందరికి ఎంత పరిచయం ఉన్నా ఒక రకంగా శ్రీనివాసరావు అందరికీ అపరిచితుడే . అసాధారణ వ్యక్తిత్వం , బహుముఖ ప్రజ్ఞ , నిజాయతీ , వృత్తి నిబద్దత మూర్తీభవించిన  శ్రీనివాసరావు లేకపోవటం తెలుగు జర్నలిజానికి అది తెలుసుకోలేనంత లోటు.