Wednesday 17 April 2024

చిన్న ఊరిలో గొప్ప గోపురం

 

గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామచంద్రుని విశిష్ట ఆలయం

దుర్గరాజు స్వాతి , జర్నలిస్టు

ఆంధ్రదేశంలో రామాలయం లేని ఊరు వుండదని నానుడి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న రామాలయం ఏదీ అంటే అందరూ  ఠక్కున చెప్పే పేరు భద్రాచలం. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఆ ఆలయానికి అంతటి ప్రాశస్త్యం వుంది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్ గా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఆంధ్రాలో పురాతనమైన ఒంటిమిట్ట రామాలయం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అయితే ఆ రెండు ప్రధాన ఆలయాలలో లేని విశిష్ట శిల్ప సంపదతో అలరారుతున్న ఓ గొప్ప గోపురం వున్న రామాలయం ఒకటి ఓ చిన్న ఊరిలో ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు. అది కూడా మన ఆంధ్రాలోనే ఉన్నదన్న విషయము మాకు కూడా ఈ మధ్యనే తెలిసి దానిని దర్శించుకుని వచ్చాము. శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా ఆ విశేషాల్ని ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 



    తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడ అనే చిన్న ఊరిలో నెలకొన్న ఆ ఆలయం పేరు శ్రీ కోదండ రామచంద్ర మూర్తి దేవస్థానం.

   ఆలయ పరిధి దృష్ట్యా చూస్తే ఇది చిన్నదే అయినా దాని విశిష్టత అంతా అద్భుత శిల్ప సంపదతో అలరారుతున్న గొప్ప గోపురంలోనే ఇమిడి వుంది. 

       శ్రీరామచంద్రుని చుట్టూ అస్త్ర దేవతలు ప్రదక్షిణ చేయడం; దశరధుడు తన సతులు కౌసల్య,సుమిత్ర, కైకేయిలతో ఇరువైపులా నిలుచుని ఊయలలో నిదురిస్తున్న బాలరాముని ఆనందంగా తిలకించడం; విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుండగా విల్లంబులు ఎక్కుపెట్టి రామలక్ష్మణులు మారీచ, సుబాహులతో యుద్ధం చేయడం; సీతారాముల కళ్యాణం;    అరణ్యవాసంలో రామాలక్షమణులు ఓ వృక్షం కింద సేదదీరడం; సీతాపహరణం, పక్కనే హనుమ ఆశీనుడై వుండగా వానరులంతా రామయ్యకు నమస్కరించడం; అశ్వాలు పూన్చిన రథాన్ని రామ లక్ష్మణులు ఎక్కబోవడం; వారధి నిర్మాణానికి వానర సైన్యం రామ శిలలను మోసుకు రావడం;  రావణ వధానంతరం సీత అగ్ని పరీక్షను ఎదుర్కోవడం; సీతా సమేతంగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు పయనమవడం ఇలా ఎన్నో రామాయణ ఘట్టాలను అద్భుత శిల్పాలుగా చెక్కి గొప్పగా గోపురాన్ని నిర్మించడం ఇక్కడ మనం చూడవచ్చు. కేవలం రామాయణ ఘట్టాలే కాకుండా, నరసింహస్వామి హిరణ్యకశిపును వధించడం, సింహవాహిని కనకదుర్గమ్మ, సప్తాశ్వ రథమారూడుడయిన సూర్యభగవానుడు,   క్షీరసాగర మధనం, గీతోపదేశం వంటి ఇంకా అనేక ఘట్టాలను కూడా ఈ గోపురంపై చక్కగా చెక్కారు. 



కాల ప్రామాణికంగా చూసినా ఈ ఆలయానికి దాదాపు 130 ఏళ్ల చరిత్ర వుంది. కీ.శే. శ్రీ ద్వారపూడి సుబ్బారెడ్డి గారు, రామిరెడ్డి గారు అనే సోదరుల సంకల్పబలంతో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగింది. అదీ 1889లో రామ కోలల ప్రతిష్ఠాపనతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1934లో సీతారామ లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవస్థానంగా నామకరణం చేశారు. తదనంతరం 1948లో 160 అడుగుల ఎత్తులో తూర్పు గోపురం, 1956లో 200 అడుగుల ఎత్తులో పశ్చిమ గోపురం నిర్మించారు. మొత్తం పది అంతస్తులుగా నిర్మించిన ఈ గొప్ప గోపురంలో ప్రతి అంతస్తుకు చేరుకునేలా లోపలివైపు మెట్లను నిర్మించారు. ప్రతి అంతస్తులో ఓ గవాక్షం ఏర్పాటు చేయడంతో భక్తులు ఒక్కో అంతస్తు ఎక్కుతూ అక్కడ నుండి బాహ్య పరిసరాల్నింటినీ చూడవచ్చు. ఒక్కో అంతస్తూ ఎక్కుతున్నకొద్ది మనకు ఇంకా విశాలమయిన పరిధి కనబడుతూ ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది. అంతేకాదు కొన్ని అంతస్తుల్లో మరికొన్ని విశేషాలు కూడా జోడించారు. అందులో  1975లో నిర్మించిన అద్దాల మందిరం ఒకటి వుంది. దీనిని ద్వారంపూడి వారసుడు రామచంద్రారెడ్డి గారు నెలకొల్పారు. అక్కడ నిలుచుని దేవతల విగ్రహాలను ప్రత్యేక భంగిమల్లో చూడడమే గాక మనం కూడా మన రూపాలను వివిధ ఆకృతుల్లో చూసుకుని వినోదించే ఏర్పాటు వుంది. అంటే అవి మ్యాజిక్ అద్దాలు కావడంతో అది మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. అలా ఒక్కో అంతస్తూ ఎక్కుతూ అక్కడ నుంచి కనబడే మేరకు శిల్ప సౌందర్యాలను ఆసక్తిగా తిలకించవచ్చు. 






ఈ ఆలయానికి కొద్దిపాటి భూములే వున్నా అక్కడ పనిచేసే అర్చకులకు ఇతర సిబ్బందికి ధర్మకర్తలే జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్నారు. అంతేకాదు ఇక్కడ నిత్యాన్నదానం కూడా నిర్వహించడం గమనార్హం. 

 ఇక ఆలయ సందర్శన వేళలు ఉదయం 6గంటల నుండి రాత్రి 8 గంటలవరకు వుంటుంది. గోపురం అంతస్తులు ఎక్కి చూసే సమయం మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే. 

ఈ ఆలయానికి సమీపంలోనే సూర్యభగవానుని ఆలయం కూడా వుండడం మరో విశేషం.

 ఇంత విశిష్టతలు వున్న ఆ ఊరిని దర్శించాలనే ఆకాంక్ష మీలో కూడా కలుగుతోంది కదూ. ఇక కదలండి మరి.


          

Thursday 15 February 2024

తెలుగువారి అదృష్టం....‌

  ఎం.వి.ఆర్.శాస్త్రి

   (2005 లో జి.వెంకట రామారావు గారురచించిన " ప్రధానిగా పి.వి." గ్రంథానికి నేను రాసిన ముందుమాట)



     పీవీ నరసింహారావు తెలుగువాడు కావటం తెలుగువారి అదృష్టం ; పీవీ దురదృష్టం.

     ఇటువంటి ప్రజా నాయకుడు ,ఇంతటి పండితుడు, మేధావి,  బహు భాషావేత్త, చెయితిరిగిన రచయిత, సంస్కరణశీలి ,దార్శనికుడు ,విశిష్ట పరిపాలకుడు వేరే రాష్ట్రంలోనో  ,వేరే దేశంలోనో  పుట్టి ఉంటే అక్కడి ప్రజలు నెత్తిన పెట్టుకుని పూజించేవారు .మరి మనమో..? ముఖ్యమంత్రి కావటానికి ముందూ తర్వాతా... ప్రధాని కావటానికి ముందూ తర్వాతా... జీవించి ఉండగా, మరణించిన తర్వాతా... మనమూ మనలను నడిపించే నేతలూ వారిని నడిపించే అధినేతలూ పీవీ పట్ల ఎంత గౌరవం ఎంత ఆదరణ ఎంత కృతజ్ఞత చూపింది మన అంతరాత్మలకు తెలుసు. విపులీకరించవలసిన పనిలేదు.

       ఒక సంవత్సరం కిందట ఇలాంటి పుస్తకాన్ని నేను చూసి ఉంటే -ఎందుకిది ?ఒక ప్రధానమంత్రి ఐదేళ్ల హయాంలో జరిగినవన్నీ ఇప్పుడు నెంబర్ వేయటం దేనికి అనేవాణ్ణి. దీర్ఘకాలం దేశాన్ని, పార్టీని సేవించిన పీవీకి దివంగతుడైన తరువాత దేశ రాజధానిలో లభించిన ఘన నివాళిని , మరవలేని గౌరవ మర్యాదలను గమనించాక నా అభిప్రాయం మారింది. ఔరంగజేబు రోడ్లూ, తుగ్లక్ రోడ్లే తప్ప కృష్ణ దేవరాయల రోడ్డు, రుద్రమదేవి రోడ్డు లాంటివి రాజధాని నగరంలో కలికానికి కూడా కనిపించని దేశంలో...స్వాతంత్రం వచ్చి షష్టిపూర్తి కావస్తున్నా దాక్షిణాత్యుల పట్ల చిన్న చూపు ఉత్తరాది వారికి పోని బాధాకర పరిస్థితుల్లో ... కొద్ది బుద్ధి కలవారి కర్ర పెత్తనాలు ఇప్పటిలాగే సాగితే నెహ్రూ వంశానికి వెలుపలివాడైన నరసింహారావు అనే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపించిన సంగతి కూడా మరుగున పడిపోతుందేమో! ఆ ప్రమాదాన్ని నివారించడానికైనా- పీవీ పరిపాలనలో దేశం ఎలా ఉండేదో ,అప్పటి దేశకాల పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వం ఏమి సాధించిందో, ఏమి సాధించలేకపోయిందో ,ఎందువల్ల సాధించలేకపోయిందో, ఆ పరిపాలన ప్రత్యేకతలు ఏమిటో ఎప్పటికీ గుర్తు పెట్టుకో దగిన విశేషాలు ఏమిటో గ్రంథస్థం అయి తీరాలి. వివిధ నాయకులకు, ఆయా చారిత్రక ఘట్టాలకు సంబంధించి ఇటువంటి గ్రంథాలు ఇంగ్లీషులో బాగానే వచ్చినా, తెలుగులో ఈ మాదిరి రచనలు చాలా తక్కువ. అరుదైన, కష్టమైన ఇలాంటి కార్యానికి పూనుకుని ప్రతిభావంతంగా నిర్వర్తించినందుకు మిత్రులు వెంకట రామారావు గారిని అభినందిస్తున్నాను.

      ఈ సందర్భంలో స్వర్గీయ బుడి సత్యనారాయణ సిద్ధాంతి గారు నాకు గుర్తుకొస్తున్నారు. ప్రధానమంత్రి అయ్యాక నరసింహారావు గారి ఆధికారిక నివాసానికి కుటుంబ పురోహితుడుగా ఆయనే గృహప్రవేశం చేశారట. ఆ ఇంటికి ఏదైనా మార్పులు ,చేర్పులు సూచించబోతే "ఎందుకండీ పండిట్జీ ! ఈ సర్కారు ఎంతో కాలం ఉండదు కదా" అని అక్కడివారు పెదవి విరిచే వారట! నిజమే! రాజీవ్ మరణానంతరం వేరే దారి లేక నాయకుడిగా ఎన్నుకోబడ్డ పి.వి. గారు అదృష్టవశాత్తు ప్రధానమంత్రి అయినా, కనీస మెజారిటీకే గతి లేని ఆయన ఓటి ప్రభుత్వం రాజకీయ పెను తుఫాన్లను, సంక్లిష్ట సమస్యల సుడిగుండాలను తట్టుకొని ఆట్టేకాలం నిలబడుతుందన్న నమ్మకం అప్పట్లో ఎవరికీ లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా సామాన్లు సర్దుకుని హైదరాబాదుకు మకాం మార్చటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న వృద్ధుడు... తనకంటూ వర్గ బలం, వీరాభిమానగణం ఏదీ లేని దుర్బలుడు రాజీవ్ అనంతరపు వెలితిని ఎంత మాత్రం పూరించలేక బొక్క బోర్ల పడతాడనే చాలామంది ఊహించారు. ఎవరికీ ఏ విధమైన ఆశ లేకపోవటమే పీవీకి వరమైంది. అద్భుతాలు సాధించగలడని తారాస్థాయిలో ఆశలు రేపిన రాజీవ్ గాంధీ ఎంత చేసినా తనపై ప్రజలు పెట్టుకున్న ఆశలకు, ఆకాంక్షలకు సరితూగలేక చివరికి భంగపడ్డాడు. ఏమీ చేయ లేడని ముందే ముద్రపడిన పీవీ కొంచెమే చేసినా అదే చాలా ఎక్కువ అనుకునేందుకు జనం సిద్ధంగా ఉన్నందున అధికార స్థానంలో కాలు నిలదొక్కుకోవటం తేలికైంది. బానిస మనస్తత్వానికి పేరు పడ్డ చాలామంది కాంగ్రెస్ నాయకుల్లా కాక స్వతంత్రంగా వ్యవహరించి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ,తన సత్తా ఏమిటో చూపించిన తెలుగు బిడ్డ పీవీ! కరణీకపు ప్రజ్ఞతో మైనారిటీని మెజారిటీగా మార్చుకుని ఐదేళ్ల పూర్తికాలం అధికారం చలాయించిన అపర చాణక్యుడాయన. కొన్ని వ్యక్తిగత, రాజకీయ బలహీనతల వల్ల... కీలక విషయాల్లో అసమర్ధ నిర్వాహకాలవల్ల ...కాంగ్రెస్ పార్టీకి ,ప్రభుత్వానికి స్వతసిద్ధమైన అవలక్షణాల వల్ల ...ఇంకా అనేక అనేక కారణాలవల్ల మళ్లీ ఎన్నికల్లో ప్రజా విశ్వాసం పొందలేక ఆయన అధికార చ్యుతి నందటం వేరే సంగతి. అందుకు పూర్తిగా ఆయన్నే బాధ్యుడిని చేయటమూ సరికాదు. అధికారం కోల్పోయాక కూడా పార్లమెంటు లోపలా వెలుపలా ఆయన గౌరవం తగ్గకపోగా, కొన్ని సందర్భాల్లో ఇనుమడించిన సంగతీ మరచిపోరాదు.

       నరసింహారావు గారు ఇచ్చకాలు గిట్టని మనిషి.ముఖస్తుతులను, ప్రచార భజనలను ఇష్టపడని వ్యక్తి . లోతుగా ఆలోచించి ,సమయానికి ,సందర్భానికి తగ్గట్టు కౌటిల్య తంత్రం రచించుకుని గుంభనంగా తన పని తాను



చేసుకుపోవటమే తప్ప ఫలానా ఘనకార్యాలు, ఘన విజయాలు తపపల్లే సిద్ధించాయని డప్పు కొట్టించుకోవటం ఆయనకు ఇష్టం ఉండదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వైఫల్యాల మాట ఎలా ఉన్నా, ప్రధానమంత్రిగా పీవీ ఘనతలూ తక్కువేమీ కాదని స్పష్టం. బాంబుల పేలుళ్లు, కాల్పులు, ఊచ కోతలు నిత్య కృత్యంగా మారిన పంజాబులో విచ్ఛిన్నకర ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి, మళ్లీ లేవకుండా మట్టు పెట్టగలగటం ఆషామాషీ విషయం కాదు. అలాగే కంఠశోషలిజాన్ని కట్టి పెట్టి ,ఉజ్జ్వల జాతీయ భవితకు ప్రోది చేసిన ఆర్థిక సంస్కరణలూ పీవీ హయాంలోనే దారిన పడ్డాయి. బాబరీ మసీదు కూల్చివేతను నిరోధించలేక పోవడాన్ని అందరూ మాయని మచ్చగా అభిప్రాయ పడుతున్నా... మనను కమ్మిన  మాయ పొరలు తొలగి, నిజమైన చారిత్రక దృష్టితో ,సిసలైన జాతీయ దృక్పథంతో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే పరిణతి కలిగాక పీవీ చేసినదానిని గురించి, చేయలేకపోయిన దానిని గురించి చరిత్ర ఇచ్చే తీర్పు ఏమిటో ఎవరి కెరుక?






Friday 5 January 2024

మనకు స్వతంత్రం రాలేదు

హిందూ నేషన్- 8



      నిజాన్ని అంగీకరించే ధైర్యం ఉండాలే గాని  హిందూ జాతి దీనావస్థకు  మూల కారణం కనపడుతూనే ఉంది. సూక్ష్మంగా చెప్పాలంటే-

      నేతాజీ సుభాస్ చంద్ర బోస్ సింగపూర్ కేంద్రంగా స్వతంత్ర భారత (ప్రవాస) ప్రభుత్వాన్ని 
స్థాపించి, ఆజాద్ హింద్ ఫౌజ్ను కూడగట్టి భారత సరిహద్దులో సాగించిన భీకర సాయుధ సంగ్రామపు 
ప్రకంపనాలకు తాళలేక  తెల్లదొరతనం బెంబేలెత్తి ఆదరాబాదరా సామాన్లు సర్దుకుని ఇండియా నుంచి దౌడు 
తీసింది. ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికన అవిభక్త భారత దేశం లోని  ముస్లిములు  తమది ప్రత్యేకజాతిగా 
అంతర్జాతీయ గుర్తింపు, స్వతంత్ర రాజ్య ప్రతిపత్తి పొందగలిగారు. పాకిస్తాన్ అనే నేషనల్ హోమ్ లాండ్ లో 
ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి తమ మత సిద్ధాంతాలకూ , విశ్వాసాలకూ తగ్గట్టుగా రాజ్యాంగాన్ని తయారుచేసుకుని
 తమ మతాన్నీ ,తమ సంస్కృతినీ  తమకు కావలసినరీతిలో అభివృద్ధి చేసుకోగలిగారు.
      రెండు జాతుల సిద్ధాంతానికి  బ్రిటిష్ కలోనియల్ పాలకులూ , భారత నాయకులూ కూడా
 ఆమోదం తెలిపాక ...దేశాన్ని చీల్చి ముస్లిం రాజ్యాన్ని ముస్లిములకు పంచేశాక మిగిలేది హిందూ రాజ్యమే కదా? 
అక్కడ హిందూ మతానికి, దాని జీవనాడి అయిన సనాతన ధర్మానికీ , హిందువుల  జాతీయ సంస్కృతికీ , 
హిందువులకే కదా ప్రథమ ప్రాధాన్యం, ప్రాముఖ్యం , అత్యంత గౌరవ స్థానం దక్కవలసింది? 
      కాదు. అలా కుదరదు. హిందూ మెజారిటీ స్వతంత్ర దేశంలో హిందువులకు , వారి మత,
 సంస్కృతులకురాజపూజ్యత ,అన్నింటిలో పెద్దపీట ఉండాలనటం మహాపాపం; అనాగరిక, సంకుచిత, 
అప్రజాస్వామిక పాపిష్టి ఆలోచనావిధానం ! పక్కా మతతత్త్వం  ; నీచ ధూర్త మతోన్మాదం ! అలా అయితే
మైనారిటీలు నొచ్చుకుంటారు ;ఇబ్బంది పడతారు.కాబట్టి హిందూ దేశంలో హిందూ మతానికి గౌరవ స్థానం 
కుదరదు. అలాగని మైనారిటీలతో మీరూ సమానం కూడా కాదు. ఎప్పుడూ వారు అన్నివిధాల పైన ఉండ
వలసిందే . మీరు కింద పడిఉండవలసిందే. రాజ్యాంగ రక్షణలు,ప్రత్యేక హక్కులు, విద్యలో, ఉద్యోగాలలో 
ప్రోత్సాహకాలు, స్కాలర్ షిప్పులు ,పెన్షన్లు అన్నీ మత ప్రాతిపదికన మైనారిటీలకు మాత్రమే!  అవన్నీ
 మీకూ కావాలంటే హిందూ మతం వదిలేసి ఏదైనా మైనారిటీ మతంలోకిమారాల్సిందే అని చెప్పకనే
 చెప్పారు  కాంగ్రెసు మార్కు  “పెద్ద మనుషులు” . నెహ్రూ ప్రవక్త పూనికతో అందరూ కలిసి దానికి
 ఇండియన్ బ్రాండ్ “సెక్యులరిజం” అనే పవిత్ర నామం తగిలించారు. 
     అంటే- 1947 లో  అవిభక్త భారత దేశంలోని  ముస్లిం జాతికి స్వాతంత్ర్యం వచ్చింది. హిందూ
 జాతి ఇంకా స్వాతంత్ర్యం పొందలేదు. స్వరాజ్యాన్ని చవిచూడలేదు. 1947 లో ముస్లిముల విషయంలో
 జరిగినట్టు  హిందువులకు ఒక జాతిగా గుర్తింపు దక్కలేదు. సొంత హిందూ రాష్ట్రం అంటూ ఏర్పడలేదు. 
వారి నేషనల్హోమ్ లాండు మీద  వారికి , వారి ధర్మానికి కంట్రోలు ఏదీ చిక్కలేదు.
 ( పుట్టుక రీత్యా, పేరును బట్టి ,తల్లితండ్రులను బట్టి హిందువులైనప్పటికీ , ఆచరణలో హిందూ మత 
ప్రయోజనాలకు బద్ధ వ్యతిరేకంగా నాయకులు, పాలకులు  హిందువులకు పగవాళ్లే తప్ప తమవాళ్ళు కారు
. వారి సోకాల్డ్  సెక్యులర్ ఏలుబడి  హైందవ ధర్మబద్ధ పరిపాలన అనటానికి వీల్లేదు.  
      దారితప్పటం అలా మొదలైంది. కాంగ్రెసు మాయావుల సెక్యులర్ మాయలో పడి లక్ష్యానికి,
 గమ్యానికి చాలా దూరమయ్యాం.  ఆ వైనాలు ఇంకోసారి వివరంగా చెప్పుకుందాం. 
      నెహ్రూ అండ్ కో తమ కళ్ళకు కట్టిన మాయ సెక్యులర్ పట్టీలు  తీసి పారేయనంతవరకూ సెక్యులర్ 
పద్మవ్యూహం నుంచిహిందూ జాతి బయటపడదు. హిందూ వ్యతిరేక రాజ్యాంగ వ్యవస్థను మార్చనంత 
వరకూ బ్రహ్మదేవుడు వచ్చి  ప్రధానమంత్రి కుర్చీలో కూచున్నాపరిస్థితి సమూలంగా మారదు. తామే 
దేశంలోకెల్లా పెద్ద వోటు బ్యాంకు అన్న తెలివిడి , సంఖ్యాబలంతో ఎవరినైనా శాసించి, ఆదేశించి, తమకు  
కావలసిన రీతిలో  రాజ్యవ్యవస్థను  తాము మలుచుకోగలమన్న విశ్వాసం మునుముందు  జాతీయ హిందూ 
సమాజానికి గట్టిపడాలి.  మనుషుల మీద భ్రమలను వదిలించుకుని, అనుభవాలనుంచి  గుణ పాఠం
 నేర్వాలి . మతానికి , ధర్మానికి, దేశానికి  చుట్టుముట్టిన ఆపదల తీవ్రతను గుర్తించి రెండో  
స్వాతంత్ర్య సంగ్రామానికి వ్యూహాత్మకంగా, సంఘటితంగా  ముందుకు సాగితే హిందూ జాతి వేల సంవత్సరాల 
పర్యంతం ,మత సహిష్ణుతతో , సకల జనశ్రేయోదాయకంగా వర్ధిల్లగలిగిన హైందవ రాజ్య వ్యవస్థను దేశంలో 
కాలానుగుణంగా మళ్ళీ ప్రతిష్ఠించగలదు.  నైతిక బలంతో మరోమారు   ప్రపంచాన్ని జయించగలదు. హిందూ
 నేషన్ కీర్తి, ప్రశస్తి ఇండియా దటీజ్ భారత్ కు గర్వకారణం కాగలదు. 
                   “తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః” 


 
 



Thursday 4 January 2024

హైందవమే విశ్వగురువు

 హిందూ నేషన్- 7                      



     ప్రస్తుతం ప్రామాణిక చరిత్ర గ్రంథాలు అని అందరూ అనుకునే వాటిని బట్టి చెప్పాలంటే – ఏ దేశ చరిత్రా ఎక్కువలో ఎక్కువ  5 వేల సంవత్సరాలు దాటదు. అంతకంటే పూర్వం  చరిత్ర లేదా అంటే ఉన్నది. కానీ మరపున పడ్డది. మన లాంటి మనుషుల విషయంలో కొన్ని తరాల లాగే , దేశాల విషయంలో  ఎన్నో శతాబ్దాలు ఇప్పుడు జ్ఞాపకం లేకుండా పోయాయి. లేదా నడమంత్రపు చరిత్రకారుల చేతితో తుడిచివేయబడ్డాయి.

     ఇప్పటికి కనీసం వెయ్యేళ్ళ  కంటే ముందునుంచీ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నవి క్రిస్టియన్, ఇస్లామిక్ మతాలు. ప్రస్తుతం ప్రామాణిక  చరిత్రలుగా చలామణి అవుతున్న వాటిని రాసిన వారు, లేక ప్రభావితం చేసిన వారు ఆ రెండు మతాలకు చెందిన వారే. క్రైస్తవుల దృష్టిలో దేవుని బిడ్డ యేసు రాకడ తరవాతే అసలు చరిత్ర మొదలయింది. అంతకు ముందు ఉన్నవన్నీ పాపిష్టి పాగన్ మతాలే. నామరూపాలు లేకుండా నాశనం చేయాలే తప్ప వాటి గురించి పట్టించుకోకూడదు. అసలు తలవనే కూడదు.

     అలాగే ముసల్మాన్ల దృష్టిలో మహమ్మద్ ప్రవక్త సత్యమతమైన ఇస్లాం ను స్థాపించటానికి ముందు ఉన్నదంతా HEATHEN , కాఫిర్ చరిత్ర . దానిని స్మరించటమే పాపం. ఆనవాళ్ళు మిగలకుండా దానిని సర్వనాశనం చేయటమే దేవుడు మెచ్చే పవిత్ర కర్తవ్యం.

     ఇలా-  అటు క్రైస్తవులూ , అటు మహమ్మదీయులూ చెలరేగి తమ పాలిట పడ్డ దేశాలలో పూర్వ మతాలను, పూర్వ సంస్కృతినీ , పూర్వ చరిత్రలనూ, వాటి ఆనవాళ్లనూ పనిగట్టుకుని క్రూరాతిక్రూరంగా , దారుణాతిదారుణంగా ధ్వంసం చేయటంతో ఎన్నో వేలూ లక్షల సంవత్సరాల ప్రాచీన చరిత్ర అంతరించిపోయింది. క్రైస్తవ ప్రాబల్యానికి పూర్వం ఉన్న నాగరికతను, సంస్కృతిని క్రైస్తవులు...  ఇస్లాం ప్రాభవానికి ముందు ఉండిన నాగరికతను, సంస్కృతిని  మహమ్మదీయులు పగబట్టి మట్టుపెట్టటంతో - ఆ రెండు సోకాల్డ్ మతాలూ పేట్రేగెంత వరకూ - ప్రపంచమంతటా చక్కగా, చల్లగా విలసిల్లిన హిందూ  సంస్కృతి ఒకటుండేదన్న సంగతే ప్రపంచం మరచిపోయింది. అలాంటి  హిందూ నాగరికత ఒకప్పుడు ప్రపంచమంతటా వర్ధిల్లిందని  ఇప్పుడు ఎవరైనా అంటే వారిని మూర్ఖులు, మూఢత్వం జడలు కట్టిన మత ఛాందసవాదులు అని తాటాకులు కట్టటం ఆధునిక మహా మేధావులకు అలవాటు అయింది.

      రెండు వేల ఏళ్ల కిందటి వరకూ ప్రపంచమంతటా విస్తరించి ఉన్నది  హిందూ మతం, హిందూ  సంస్కృతి, ఆర్య నాగరికత ! ప్రపంచమంతటా వినిపించింది సంస్కృత భాష !  ఆ సంగతి దాచిపుచ్చటానికి , వాటి జ్ఞాపకాలను శాశ్వతంగా రూపుమాపటానికి చాలామంది చాలా కష్టపడ్డారు. గుళ్ళు కూల్చారు. దేవతావిగ్రహాలను, ఆలయ శిల్పాలను, అద్భుత కళాఖండాలను ధ్వంసం చేశారు. ప్రాచీన దేవాలయాలను ఆక్రమించి చర్చిలుగా , మసీదులుగా మార్చివేశారు. మహారాజ ప్రాసాదాలను , మహా సమాధులుగా మార్చారు. మెడమీద కత్తి పెట్టి , బలవంతంగా మతం మార్పించి ఆచారాలు, వ్యవహారాలు ... బొట్టు, కట్టు...  వేషం , భాష మార్చేసి మనుషులను  వారి దేశంలో వారినే పరాయివాళ్లను  చేశారు. జాతుల మూలాలు తెంచేశారు. లక్షలాది అపురూప గ్రంథాలను, విజ్ఞాన భాండాగారాలను బూడిద చేశారు. అబద్ధాల చరిత్రలు అల్లారు. తప్పుడు సాక్ష్యాలు బనాయించారు. కుహనా సంస్కృతులు తెచ్చిపెట్టారు.

      కానీ ఎన్ని చేసినా తమ ఆలోచనలలో , తమ ఆచార వ్యవహారాలలో , తమ భాషలో. తమ వాడుకలో హైందవ  సంస్కృతి, వైదిక నాగరికతల ఛాయలను, చిహ్నాలను తొలగించలేకపోయారు. హిందూ మత ద్వేషులు , వైదిక ధర్మానికి బద్ధ శత్రువులు , మహా విజ్ఞాన వంతులమని బోరవిరుచుకునే మహా నాగరికులు కూడా ఇవాళ తమకు తెలియకుండానే హిందూ  సంస్కృతిని అనుసరిస్తున్నారు. హైందవ పద్ధతులనే పాటిస్తున్నారు.

     మచ్చుకో ముచ్చట.

      ప్రపంచంలో ఎక్కడైనా , ఎవరైనా సూర్యోదయాన్ని బట్టే రోజులను లెక్కవేస్తారు . రాత్రి పడుకుని, మళ్ళీ తెల్లవారాకే అది నిన్న, ఇది నేడు అని గుర్తుపెట్టుకుంటారు . అంతేగానీ అర్ధరాత్రి 12 గంటలకు లేచి కాలెండరులో డేటు మార్చుకోరు. కదా? మరి మధ్య రాత్రి గడియారం ముల్లు 12  మీదికి రాగానే తేదీ , రోజు మారే పధ్ధతి ఎందుకు వచ్చింది ?

       జవాబు కోసం బుర్ర బద్దలు కొట్టుకోవలసిన పనీ లేదు. ఇప్పటికి యాభై ఏళ్ల కిందటే విఖ్యాత చరిత్రకారుడు పి.ఎన్.ఓక్ Some Missing Chapters Of World History అనే గ్రంథంలో దీనికి  సహేతుకంగా సమాధానం చెప్పాడు. సారాంశం ఏమిటంటే-

      సూర్యోదయం నుంచి మరునాటి సూర్యోదయం వరకూ రోజును లెక్కగట్టటం అనాదిగా హిందూ దేశ సంప్రదాయం. ‘ఉదయాత్ ఉదయం వారం’ అని మన లెక్క. భారతదేశంలో సుమారుగా 5-30 కి సూర్యోదయం అవుతుంది. కాల గమనంలో మనకంటే ఐదున్నర గంటలు వెనక ఉండే యూరోపియన్ దేశాల్లో ఆ సమయానికి అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఇప్పుడు అమెరికా , ముప్పావు శతాబ్దం కిందటి వరకూ బ్రిటన్ లాగా ప్రాచీనకాలంలో ఇండియాయే ప్రపంచంలో సూపర్ పవర్. విద్యలో, విజ్ఞానంలో , ఆర్ధిక వ్యాపార పారిశ్రామిక రంగాల్లో , సైనిక శక్తిలో భారతదేశం మహా వైభవంగా వెలిగిపోతుండేది. హిందూ సంస్కృతి, వైదిక నాగరికత వివిధ రూపాల్లో, వేరువేరు పేర్లతో ప్రపంచమంతటా వర్దిల్లేవి. విద్య, వాణిజ్య, ఆర్ధిక పరమైన సంబంధాలు, సంపర్కాలు ప్రధానంగా ఇండియాతో కాబట్టి ఇండియా టైమును బట్టే ఇంగ్లాండు వంటి వెనకబడిన యూరోపియన్  దేశాలూ తమ రోజును లెక్కగట్టుకునేవి. ఇండియాలో సగటున సుమారుగా 5-30 కి తిథి , వారం మారుతాయి కాబట్టి తమ లెక్కా దానికి సరిపోయే విధంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఇంగ్లాండ్ వంటి దేశాలు  డే అండ్ డేట్ మార్చుకునేవి.

     ప్రాబల్యం , ప్రభావం ఏ దేశానిది అయితే ఆ దేశ కాలమానాన్ని దానిపై ఆధారపడిన దేశాలు అనుసరించటం ప్రపంచంలో మామూలే. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ చేతికి చిక్కిన పసిఫిక్ రీజియన్ ప్రాంతాల్లో పెత్తనం చెలాయించిన జపనీస్ అధికారులు టోక్యో టైం ప్రకారం గడియారాలు సెట్ చేసి అధికారిక వ్యవహారాలను  ఆ ప్రకారమే జరిపేవారు.  అమెరికా తో వ్యాపార లావాదేవీలు చేసేవారు  అమెరికన్ టైమ్ ప్రకారం పని చేయటం , అమెరికన్ టైమును బట్టి నడవటం ఇప్పటికీ  చూస్తున్నాం. అదే విధంగా పూర్వకాలంలో పాశ్చాత్య దేశాలూ భారత కాలమానాన్ని అనుసరించాయంటే విస్తుపోవలసిన పనిలేదు. అనంతర కాలంలో   బ్రిటిష్ ఆధిపత్యం  కింద దాదాపుగా రెండు శతాబ్దాల పాటు ఉన్నాము కనుక , లండన్ ఇంపీరియల్ రాజధాని కాబట్టి, లండన్ ఆనవాయితీ ప్రకారం మనమూ అర్ధరాత్రి 12 గంటలకు తేదీ మార్చుకోవటానికి అలవాటు పడ్డాం. ఒకప్పుడు మనను బట్టి ఇంగ్లాండ్ నడిచింది; మన టైమును బట్టి తన రోజును వెనక్కి జరుపుకుంది  అన్న సంగతి మరచిపోయి ఇంగ్లిషు దొరల ను చూసి మనమూ మన టైమును వెనక్కి జరుపుకున్నాం. అర్ధరాత్రి దయ్యాలు తిరిగే వేళ ‘గుడ్ మార్నింగ్’  అనటానికీ , ‘హాపీ న్యూయియర్’ కేరింతలు కొట్టటానికీ, బర్త్ డే కేకులు కోసి మళ్ళీ నిద్రపోవటానికీ అలవాటు పడ్డాం.

https://youtu.be/UFHehKAXvpo?si=JoEjK1-8b5qfecGZ

       సరే! ప్రపంచం మరచిపోవచ్చు . గమనించకపోవచ్చు.   జాత్యహంకారాలకొద్దీ , మత దురహంకారాల కొద్దీ భారతీయ గత వైభవాన్ని గుర్తించేందుకు విదేశీయ , దేశీయ ‘థాట్ పోలీసులు’ నిరాకరించవచ్చు . సైంధవుల్లా అడ్డం పడవచ్చు. మరి ఆ పూర్వ ప్రాభవానికీ , ఉజ్జ్వల నాగరికతకూ , మహోన్నత సంస్కృతికీ వారసులమైన మనం ఏమి చేశాం? చరిత్రకూ , సంస్కృతికీ , హెరిటేజ్ కీ అంటూ డిపార్ట్ మెంట్లు తెరిచి , దండిగా ప్రజాధనం ఖర్చుపెట్టే మన ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఏమి వెలగబెట్టాయి? భారత సంస్కృతి, నాగరికత, తాత్వికతల విశ్వ వ్యాప్తి సమగ్ర రూపాన్ని ఆవిష్కరించేటందుకు ఎన్ని ప్రాజెక్టులు పెట్టి అంతర్జాతీయంగా ఎన్ని అధ్యయనాలు, ఎన్ని  పరిశోధనలు చేయించాయి? ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని ఏ మేరకు ప్రభావితం చేశాయి ? భారతీయ సాంస్కృతిక , వైజ్ఞానిక , తాత్విక వారసత్వ ప్రచారానికి సంబంధించి  వెనకటి శతాబ్దాలలో పాశ్చాత్య మేధావులు చేసినదానికి మించి స్వతంత్ర భారత ప్రభుత్వ పూనికతో  ఇన్నేళ్ళలో జరిగిన గొప్ప కృషి ఏమిటి? అసలు ఆ దిశగా ఏ ప్రభుత్వమైనా ప్రపంచ స్థాయిలో ఒక  బృహత్ ప్రణాళికను  చేపట్టిందా? 

       హైందవం ప్రపంచంలోకెల్లా గొప్పమతం, ప్రపంచంలో కెల్లా గొప్పధర్మం, ప్రపంచంలోకెల్లా గొప్ప జీవన విధానం అని,  దేశదేశాల మహాజ్ఞానులు, మహామేధావులు ఎన్నో శతాబ్దాలుగా కొనియాడుతున్నారు. వేద విజ్ఞానం, భారతీయ శాస్త్రం, హైందవ తత్వం, సారస్వతం, సాంస్కృతిక వైభవాల లోయలను, ఎత్తులను లీలగానైనా పోల్చుకోవటానికి పాశ్చాత్య దేశాల్లో విస్తృత పరిశోధనలు, సమగ్ర అధ్యయనాలు తరతరాలుగా సాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు లాంటి ఎన్నో దేశాలు యూనివర్సిటీల్లో హిందూమతాన్ని ఎప్పటినుంచో బోధిస్తున్నారు. దాని తాత్త్విక, వైజ్ఞానిక, శాస్త్ర వారస్వతాల మీద క్షుణ్ణంగా రిసెర్చిలు చేయిస్తున్నారు. మరి అసలయిన భారత దేశం మాటేమిటి?

       తెల్లవాళ్లు ఏలిన కాలంలో కనీసం పాఠశాలల్లో హైందవ ధర్మానికి, హైందవ వీరులకు, హిందూ ఇతిహాస పురాణాలకు సంబంధించిన పాఠాలను అనుమతించేవారు.  హిందూ కాలేజీలను, హిందూ యూనివర్సిటీలను ప్రోత్సహించేవారు. తెల్లవాళ్లు పోయి దేశీయ ప్రభువులు వచ్చాక పరిస్థితి నానాటికీ దిగజారింది. స్వతంత్రం అనబడేది సిద్ధించిన  తరువాత తొలి దశాబ్దాల్లో 'రామాయణ, భారత, భాగవతాల పాఠాలను, హిందూ దేశ పవిత్రతను కొంతలో కొంతైనా పిల్లలకు బోధించనిచ్చేవారు. 1976లో ఇందిరమ్మ 'చేతబడి'తో దిక్కుమాలిన సెక్యులరిజం వచ్చిపడ్డాక ఆ పాఠాలు అటకెక్కాయి.  ఆ తరవాత రూలింగు పార్టీలు , ప్రభుత్వాలు ఎన్ని మారినా  చదువులూ పాఠాలూ మారలేదు. విద్య పట్ల , చరిత్ర పట్ల , విస్మృత చరిత్ర వెలికి తీత, జాతీయ చరిత్ర తిరగ రాత పట్ల పోచుకోలు కబుర్లూ , డొల్ల ప్రగల్భాలే తప్ప  మౌలికంగా మారింది, నికరంగా సాధించింది సున్న. బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాల కోసం మెకాలే పెట్టిన విద్యావిధానమే , భారత జాతీయత పట్ల కలోనియల్ పాలకుల ఆలోచనా విధానమే కాస్మెటిక్ పైపూతలతో నేటికీ నిక్షేపంలా కొనసాగుతున్నాయి.   హిందూ మతం, హిందూ చరిత్ర, విశ్వ వ్యాప్త హిందూ నాగరికత విద్యార్థులకు ఎంతమాత్రమూ నేర్పుకూడని , ప్రభుత్వ పరంగా ప్రోత్సహించకూడని నిషిద్ధ పదార్థాలు అయ్యాయి. దేశంలో వందల సంఖ్యలో ఉన్న యూనివర్సిటీల్లో ఏ ఒక్కదానిలోనూ హిందూ మత, హిందూ సంస్కృతి, హైందవ జాతీయ వారసత్వాల , వేదాలూ వేదశాస్త్రాల  అధ్యయనానికి, రిసెర్చికి  ప్రత్యేక విభాగమంటూ ఉన్నట్టు , సవ్యంగా పనిచేస్తున్నట్టు, వాటి ఉనికి సార్థకమైనట్టు దాఖలాలు లేవు.

        అదేమిటి? అజాదీకి 75 ఏళ్ళు నిండి అమృతోత్సవాలు కూడా అయ్యాయి , మనకో గణతంత్రం , దానికో రాజ్యాంగం తరతరాలుగా పనిచేస్తున్నాయి. ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన వారిలో అందరూ కాకపొతే కొందరైనా నీతి, నిజాయతీ, జాతీయత , నిబద్ధత కలిగిన మహామహులు  ఉన్నారు. హిందుత్వాన్ని, హైందవాన్ని గౌరవించే, ఓన్ చేసుకునే పార్టీలూ గద్దె మీద ఉన్నాయి. అయినా నూటికి 75 మంది హిందువులైన హిందూ దేశంలో హిందూ జాతికి, హిందూ జాతీయతకు, హిందూ మతానికి, హిందూ ధర్మానికీ , హిందూ హెరిటేజ్ కీ దిక్కూ మొక్కూ లేకుండా పోవటానికి కారణమేమిటి?

    [ జవాబు తరువాయి భాగంలో ]


                  ---------------------------------                                    
      

Wednesday 3 January 2024

హిందూ సమాజం 2024

హిందూ నేషన్ – 6

                 




      వైవస్వత మన్వంతరం ; 28వ మహాయుగం; కలియుగం; ప్రథమ పాదం; 2022 CE.

      భరతవర్షం లోని ఖండిత భరతఖండంలో ఇండియా అనే దేశంలో –

      ప్రస్తుత జనాభా 161 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం  ప్రజల్లో 79.8 శాతం హిందువులు. అడ్డూ అదుపూ లేకుండా , ప్రభుత్వాల వత్తాసుతో , నిర్విరామంగా 24X7 విశృంఖలంగా సాగుతున్న కన్వర్షన్ పాతాళహోమాల పర్యవసానంగా ఈ పదకొండేళ్ళలో పై 9.8 శాతం ఎగిరిపోయిందని అనుకున్నా రికార్డుల్లో హిందువులుగా నమోదైన వారు ఇప్పటికీ కనీసం నూటికి 70 మంది ఉంటారనుకోవచ్చు.

     వీళ్ళంతా ఉన్నది ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలో . అక్కడ ఏ వ్యవహారమైనా నడిచేది నెంబర్లను బట్టి.  మెజారిటీ ఉన్నవాడే రాజు. మెజారిటీ కి కావలసింది కనీసం 50 శాతం ప్లస్ వన్. ఎవరికైనా సంఖ్యాబలం 70  శాతం ఉన్నదీ అంటే తిరుగులేని మెజారిటీ. ( ఎలక్షన్లలో ఏ పార్టీకైనా అంత వస్తే landslide మెజారిటీ అంటూ మీడియా వాళ్ళు ఘనంగా బాకా ఊదుతారు.)

      ఆ లెక్కన కనీసం 70 శాతం సంఖ్య ఉన్న హిందువు ఈ దేశానికి మహారాజు కావాలి. భూ ప్రపంచంలోని  ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా అదే రూలు. కాని ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామ్యం అయిన మనం చెప్పుకుంటున్న ఇండియా అనే దేశం లో 70 శాతం మెజారిటీ ఉన్నవాడు రాజు కాదు. బూజు.

     ప్రపంచంలో ఎక్కడైనా ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు ఏ మతానికి చెందినవారైతే ఆ మతానికి రాజపూజ్యత లభిస్తుంది.  ప్రభుత్వం , చట్టాలు, వ్యవస్థలు అన్నీ ఆ మతం ఆచారాలను , విశ్వాసాలను ఎంతో గౌరవిస్తాయి. ఏ విషయంలో అయినా , ఏ వ్యవహారంలో అయినా మెజారిటీ మతానికి మాత్రమే పెద్దపీట వేస్తాయి. మైనారిటీ మతాలను వాటి హద్దుల్లో అవి ఉన్నంతవరకూ సహిస్తాయి. వాటి బతుకు అవి బతకటానికి అవకాశం ఉన్నమేరకు అనుమతిస్తాయి.  ఏ దేశంలో అయినా మైనారిటీ మతాలు  పక్కన ఒదిగి ఉండి మెజారిటీ మతస్థులకు , ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించకుండా ఒళ్ళు దగ్గరపెట్టుకుని మనుగడ సాగిస్తాయి.

      ఇండియాలో అంతా రివర్సు. ఇక్కడ ప్రభుత్వాల , పాలక వ్యవస్థల దృష్టిలో మెజారిటీ మతానికి పూచికపుల్లపాటి విలువ ఉండదు.పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి  పుట్టినిల్లు అయిన  బ్రిటన్ లో 'ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌' ఆధికార మతం. దానికి సంబంధించిన ఇద్దరు ఆర్చిబిషప్పులకు 24 గురు సీనియర్‌ బిషప్పులకు బ్రిటిషు పార్లమెంటు ఎగువ సభ అయిన House of Lords లో ప్రత్యేక స్థానాలు కేటాయిస్తారు. Lords Spiritual అని పిలవబడే వీరు చట్టసభ డిబేట్లలో పాల్గొంటారు. సభ కొలువుదీరగానే ఈ 26 మందిలో ఒకరు ప్రార్థనను నిర్వహిస్తారు బ్రిటన్‌ రాజు లేక రాణి పట్టాభిషేకాన్ని ఆర్చిబిషప్‌ (Archbishop of Canterbury) వెస్ట్ మినిస్టర్‌ అబ్బీ (abbey) లో జరిపిస్తారు. దేవుడి శాసనాల ప్రకారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రొటెస్టంట్‌ మతాన్ని నిలబెడతానని, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌నూ, దాని సిద్ధాంతాన్నీ, పూజా విధానాన్నీ, క్రమశిక్షణను, చర్చ్‌ పరిపాలనను పరిరక్షిస్తానని ఆ సందర్భంలో ప్రమాణం చేయిస్తారు.


      క్రైస్తవం అధికార మతం కాని అమెరికాలో కూడా నూతన అధ్యక్షుడి పదవీ స్వీకారం వంటి వేడుకల్లో క్రైస్తవ మతాచార్యులకు ప్రాముఖ్యం ఇస్తారు.

     ఇండియాలోనో? పార్లమెంట్లో సీట్లు , పాలకుల  ప్రమాణ స్వీకారాల్లో ప్రమేయాల మాట దేవుడెరుగు. మెజారిటీ మతానికి చెందిన పూజ్య ధర్మాచార్యుడు నేరం చేశాడని ఏ నక్క, కుక్క కూసినా అవునా కాదా అన్నది విచారించకుండా, ఆ అభియోగం నిజమని ముందే ఊహించి  ,   కోర్టుల చుట్టూ ఏళ్ళూ పూళ్ళూ తిరిగి నిర్దోషిత్వం నిరూపించుకోవలసిన భారం నిందితుడి మీదే వేసి , క్షణం ఆలస్యం చెయ్యకుండా  ఆగమేఘాలమీద అరెస్టు చేసి రెక్కపుచ్చుకుని  జైల్లో వేస్తారు.  అమానుషంగా అవమానాలకు గురి చేస్తారు. నిర్దోషిగా ఎప్పటికో రుజువు అయ్యేంత వరకు అతడు మహాపాపి ; అతడిలాగే ఆ మతంలోని ధర్మాచార్యులందరూ by default నేరగాళ్లు అయినట్టు మీడియావాళ్ళూ , మెదళ్ళు లేని మేధావులూ పిచ్చి వాగుళ్లు వాగుతుంటారు .

       అదే మైనారిటీ మతానికి చెందిన చిన్నా చితకా మతగురువు మీద ఎంత బలమైన అభియోగం వచ్చినా... సన్యాసినులను, చిన్నపిల్లలను రేప్ చేసినట్టు బాధితులే స్వయంగా ఫిర్యాదు చేసి బలమైన రుజువులూ సాక్ష్యాలూ చూపెట్టినా ... మీడియాలో దానిపై ఎంత గగ్గోలు లేచినా-  పోలీసులు కదలరు.మెదలరు.  గత్యంతరం లేక అరెస్టు చేయవలసి వచ్చినా మహా గౌరవంగా మర్యాదలు చేసి , బయటపడేందుకు శాయశక్తులా సహకరిస్తారు. ఫలానా  మతగురువు ఖూనీలు, దొమ్మీలు చేశాడు, చేయించాడు, ప్రార్థనాస్థలంలో బాంబులు, మారణాయుధాలు దాచిపెట్టాడు, విదేశీ టెర్రరిస్టులకు అశ్రయం ఇచ్చాడు అని ఫిర్యాదులు   ఎంత బలమైన సాక్ష్యాల సహితంగా వచ్చి దానిపై ఎంత వివాదం లేచినా పూజ్య నిందితులుం గారిని అరెస్టు చేయటానికి , ఆ ప్రార్థనాస్థలం దరిదాపులకేసి కన్నెత్తి చూడటానికి ప్రభుత్వాలకు దమ్ములుండవు.

     ప్రజాస్వామ్య సమాజంలో అనేక మతాలు ఉంటాయి.  మతస్వేచ్చ ను అనుమతిస్తూ చట్టాలు ఉంటాయి. రాజ్యాంగ రక్షణలు ఉంటాయి. ఇండియాలోనూ ఉన్నాయి. కాని అవి ఉన్నవి ప్రధానంగా మైనారిటీ మతాల కోసమే  . మెజారిటీ మతానికి   మత హక్కులంటూ ఉండవు . ఆ సంగతి  సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనమే నేటికి 48 ఏళ్ల కిందట  తేల్చి చెప్పింది ఇలా:

      The object of articles 25 to 30 was to preserve the rights of religious and linguistic minorities, to place them on a secure pedestal... These provisions enshrined a befitting pledge to the minorities in the Constitution of the country... It is only  the minorities who need protection. (1974 AIR 1389)
      (25 నుంచి 30 వరకు గల రాజ్యాంగం అధికరణాల ఉద్దేశం మతపరమైన, భాషా పరమైన మైనారిటీల హక్కులను పరిరక్షించి, వారిని పదిలమైన పీఠం మీద ఉంచడమే... దేశ రాజ్యాంగం మైనారిటీలకు చేసిన సముచితమైన బాసను ఈ అధికరణాలు తాపడం చేశాయి... రక్షణ అవసరమైంది మైనారిటీలకు మాత్రమే.)
      దీనికి - అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు కేరళ హైకోర్టు 1978లో ఇచ్చిన ఈ కింది వివరణను కూడా చిత్తగించండి:
      “The real purpose and intendment of Articles 25 and 26 is to guarantee especially to the religious minorities in this country the freedom to profess, practise and propagate their religion, to establish and maintain institutions for religious and charitable purposes, to manage its own affairs in matters of religion.    (AIR 1978 Ker 68) 

       (25, 26 అధికరణాల వెనక అసలు ఉద్దేశం, ఆంతర్యం ముఖ్యంగా దేశంలోని మతపరమైన మైనారిటీలకు కొన్ని గ్యారంటీలు ఇవ్వటమే. వారి మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించడానికి, ఆచరించటానికి, వ్యాప్తి చేయటానికి మతపరమైన, ధార్మికమైన సంస్థలను స్థాపించి, నడుపుకునేందుకు... మతపరంగా వారి వ్యవహారాలను వారే నిర్వహించుకోవటానికి స్వేచ్ఛనిచ్చే గ్యారంటీలవి.)

     చట్టం ముందు అందరూ సమానులే అని ఘోషిస్తుంది భారత రాజ్యాంగం 14వ అధికరణం.
కాని 'ఇండియా దటీజ్‌ భారత్‌'లో పౌరులందరూ సమానులు ఎంతమాత్రం కారు. ఉన్నవి రెండే తరగతులు: 1.ఎక్కువ సమానులు 2. తక్కువ సమానులు. జనాభాలో సుమారు 80 శాతం ఉన్న హిందువులు ఏ ప్రత్యేక హక్కుకూ నోచుకోని తక్కువ సమానులు. నిండా 20 శాతం లేని అన్యమతస్థులేమో సమస్త ప్రత్యేక హక్కులూ ఉన్న ఎక్కువ సమానులు.

       ఎంతసేపూ-  జనాభాలో నిండా ఐదో వంతు లేని మైనారిటీల హక్కులూ రక్షణల సంగతే తప్ప, అసలైన మెజారిటీ గురించి, అది అనుసరించే హిందూమతం గురించి, దాని హక్కుల గురించి రాజ్యాంగంలో ఎక్కడా కనీసం ప్రస్తావనే ఉండదు.  అసలు ''హిందూమతం'' అన్న పదమే మొత్తం రాజ్యాంగంలో ఎక్కడా కనిపించదు. . అలాగే భారత జాతికి ప్రాణ శక్తి అని వివేకానందుడు నుడివిన, అనాదిగా జాతి జీవితాన్ని , రాజ్యంగ వ్యవస్థలను నడిపించిన సనాతనధర్మం ఊసు  మన రాజ్యాంగంలో కళ్ళు పొడుచుకున్నా  కానరాదు.

       దానివల్ల ఏమైంది? మైనారిటీలకేమో రెండు రకాల హక్కులు. వారు జనరల్‌ కేటగిరీలో భారత పౌరులుగానూ న్యాయం కోరవచ్చు. స్పెషల్‌ కేటగిరీలో మైనారిటీలుగానూ కోర్టు లెక్కవచ్చు. ఆ విధంగా డబుల్‌ ధమాకా!  అదే దురదృష్టవంతులైన హిందువులో? వారికి భారత పౌరులుగా మాత్రమే గుర్తింపు. మైనారిటీల్లాగా వారికి స్పెషల్‌ కేటగిరీ ఏదీ లేదు. మెజారిటీ వర్గంగానో, హిందూ మతానికి చెందిన వారిగానో తమ హక్కులకు భంగం కలిగాయని వారు ఎప్పుడూ ఎవరికీ ఫిర్యాదు చేయలేరు. ఎందుకంటే 'హిందూ' అనిగాని, 'మెజారిటీ' పదంగాని రాజ్యాంగంలో ఎక్కడా కనిపించదు.  రాజ్యాంగంలో ఏ అధికరణం కింద మిమ్మల్ని గుర్తించాలి, ఏ క్లాజు ప్రకారం మీకు న్యాయం చేయాలి అని అడిగితే హిందువుల దగ్గర జవాబు లేదు.  మతపరంగా హక్కులన్నీ మైనారిటీలకే! జన సంఖ్యలో 80 శాతం ఉండికూడా హిందువులు తమ దేశంలోనే రాజ్యాంగరీత్యా రెండో తరగతి పౌరులు.  మైనారిటీలకు ఎలాంటి అసౌకర్యం ,  మనస్తాపం కలగకుండా అతి జాగ్రత్త చూపుతూ  అణగిమణగి ఉండటమే మెజారిటీ మతస్థుల ప్రారబ్దం .

            క్రైస్తవులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 126 ఉన్నాయి. వాటిని క్రిస్టియన్‌ దేశాలు అనడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. ముస్లింలు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో 50 ఉన్నాయి. వాటిని ముస్లిం దేశాలు అనడానికి మన మేధావులకు అభ్యంతరం ఉండదు.
     
ప్రపంచంలో మూడవ పెద్ద మతం హైందవం. హిందువులు మెజారిటీ అయిన దేశాలు ప్రపంచంలో మూడే మూడు. 1. భారత్‌, 2. నేపాల్‌ 3. మారిషస్‌. మూడింటిలోకి అతి ముఖ్యమైనదీ, అన్నిటికంటే పెద్దదీ, ప్రపంచంలో హైందవానికి ఏకైక ఆలంబనంగా చెప్పుకోగలిగిందీ భారతదేశం. అయినా దీన్ని హిందూ దేశం అంటే మన మహామేధావులు, రాజకీయ జీవులు చచ్చినా ఒప్పుకోరు! దేశ ప్రజల్లో నూటికి 80 మంది హిందువులే అయినా  ఇది హిందూజాతి కాదట! ఇక్కడున్న జాతీయ సమాజం హిందువులది కాదట! ఈ దేశంలో విలసిల్లేది హిందూ సంస్కృతి కానే కాదట.

       
https://m.facebook.com/story.php?story_fbid=10228192429409085&id=1027311077&mibextid=ZbWKwL
( ‘హిందూ మతాతీత లౌకిక రాజ్య’ అవ్యవస్థ గురించి అదనపు సమాచారం కోసం నేను రాసిన “పెక్యులరిజం’ పుస్తకం చదవండి. )                                           

                                             

Tuesday 2 January 2024

వింత మతం .. భలే ప్రవక్త!

హిందూ నేషన్ -5

                


      మోసాలు చేసి, ద్రోహాలకు పాల్పడి, కుట్రలు పన్ని తెల్లవాళ్ళు మన దేశాన్ని తేరగా కాజేసిన తొలినాళ్ళ ముచ్చట.

      దక్షిణ భారతాన ఈస్ట్ ఇండియా కంపెనీ కొలువులో ఒక యూరోపియన్ ఆఫీసరు ఉండేవాడు. అతడి అసిస్టెంటు ఆఫీసరు నాయుడు అనే స్థానికుడు. తెల్లదొరకు  ఒక ఆర్డర్లీ ఉండేవాడు. అతడు బ్రాహ్మణుడు. ఒకరోజు అధికారి రోడ్డు మీద వెళుతున్నాడు. ఆర్డర్లీ అతడి వెనుకే బహు వినయంగా ఒదిగి నడుస్తున్నాడు. అసిస్టెంటు వారికి ఎదురుపడ్డాడు. పై అధికారిని  విష్ చేసి హుందాగా  షేక్ హాండ్ చేశాడు. వెనుక నిలబడిన ఆర్దర్లీని చూడగానే తలపాగా తీసి కాళ్ళకు దండం పెట్టాడు.

      తెల్లవాడికి ఆశ్చర్యం వేసింది. “నేను నీ సీనియర్ ఆఫీసరును. అయినా నా ఎదుట నిటారుగా నిలబడి కరచాలనం చేశావు. ఇతడు ఆఫ్టరాల్ నా నౌకరు, కానీ నడి వీధిలో మోకరిల్లి ఇతడికి పాదాభివందనం చేశావు. ఏమిటి సంగతి?” అని కుతూహలం కొద్దీ అడిగాడు.

      “మీరు నా పై అధికారే కావచ్చు. కాని మీరు మ్లేచ్ఛులు. ఈయన ఒక ప్యూనే కావచ్చు. కాని మా ప్రజలు ఎన్నో శతాబ్దాలుగా గొప్ప గౌరవభావంతో ఉన్న కులీన వర్గానికి చెందినవాడు. వారి ముందు మోకరిల్లటం నా విధి” అని అసిస్టెంటు ఆఫీసరు బదులిచ్చాడు.

      తెల్ల దొరకు దిమ్మ తిరిగింది. వెంటనే ఆ వైనాన్ని సీమ అధికారులకు రిపోర్టు చేశాడు. ఈ సమాజంలో  అత్యున్నత గౌరవ స్థానంలో ఉన్న బ్రాహ్మణుడిని గెంటేసి ఆ స్థానాన్ని ఎలాగైనా ఇంగ్లీషువాడు ఆక్రమించి అంతకంటే ఎక్కువ గౌరవం పొందితే తప్ప మన సామ్రాజ్యం ఈ దేశంలో ఎక్కువకాలం నిలబడదు – అని అతడు రాసిన లేఖ ఇప్పటికీ లండన్ లోని ఇండియా ఆఫీసులో ఉంది.  సుప్రసిద్ధ విప్లవ నాయకుడు లాలా హర దయాళ్ చెప్పిన ఊసు ఇది.

[Bunch of Thoughts , M.S.Golwalkar, , p.135]

     ఇలాంటి రిపోర్టు లు లండన్ కు ఇంకా చాలా అందాయి. ఈస్టిండియా కంపెనీ ఆఫీసర్లు, గవర్నర్లు, క్రిష్టియన్ మిషనరీలు అనేక ప్రాంతాల నుంచి అనేక విషయాలకు సంబంధించి పంపిన నివేదికలను చూసిన మీదట సీమ దొరలకు ఒక విషయం బాగా అర్థమయింది. భారతీయులకు వారి దేశం మీద, వారి సంస్కృతిమీద, వారి మతం మీద, వారి ధర్మం మీద, దానిని తెలియజెప్పి సరైన దారిలో నడిపించే పురోహిత బ్రాహ్మణ్యం మీద గాఢమైన  భక్తి,  విశ్వాసం ఉన్నాయి. మిగతా పాషండ మతాల్లా భూమిని, ప్రకృతిని భోగ వస్తువులుగా కాక దైవ స్వరూపంగా చూడమని హిందూ మతం నూరిపోస్తున్నది. దేశాన్ని పుణ్యభూమిగా చూడాలన్న మత బోధనుంచే దేశభక్తి , దానిలోంచి జాతీయ భావం,, విదేశీ పాలనపై తిరగబడాలన్న పౌరుషం పుట్టుకొస్తున్నాయి. దానివల్లే ఈ దేశంలో చొరబడినది మొదలు తమకు అడుగడుగునా ప్రతిఘటన ,ఎవరిలో చూసినా తమపట్ల ద్వేషం, జుగుప్స , ప్రాణాలు పోయినా సరే విదేశీ చెరనుంచి మాతృభూమిని విముక్తం చెయ్యాలన్న తెగువ పెల్లుబుకుతున్నాయి. ఇది ఎప్పటికైనా తమ పుట్టిముంచక మానదు . కాబట్టి ఇండియన్ల పొగరుకు , విగరుకు మూలమైన హైందవం మీద, ఈ దేశానికి ప్రాణమైన సనాతన ధర్మం మీద  వేటు వేయ్యాలి.  తమ గతాన్ని, దాని  వైభవాన్ని , తమ సంస్కృతిని, జాతీయ వారసత్వాన్ని  చూసుకుని చెలరేగుతున్న భారతీయుల జాతి గర్వాన్ని అణచివేయ్యాలి.

      అసలు కీలకం బోధ పడ్డాక ఏమి చెయ్యాలో తెలివిమీరిన తెల్లవారికి తెలుసు. ఇక ఆ తరవాత ఇంగ్లిషు చదువుల ద్వారా విషం ఎక్కించారు. ఇంకా అనేక మార్గాల్లో దేశీయుల బుర్రలు చెడగొట్టారు. భారతీయులను వారి దేశంలో వారినే మానసికంగా పరాయి వాళ్ళను చేసేందుకు ఆంగ్లేయులు ఎన్ని నీచాలకు ఒడిగట్టారో  అందరికీ తెలుసు . ఆ వివరాలలోకి ఇక్కడ వెళ్ళనవసరం లేదు. 

     ఇలాంటి కుతంత్రాలు సామ్రాజ్యవాదులకు మామూలే. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిషు మహా సామ్రాజ్యం తన బారిన పడిన అనేకానేక ఆసియా, ఆఫ్రికా దేశాలలోనూ ఇటువంటి పాపిష్టి ఎత్తుగడలకు పాల్పడింది. ఆ దేశాలలోనూ భీకర స్వాతంత్ర్య పోరాటాలు జరిగాయి.  మనలాగే మిగతా దేశాలూ ఎట్టకేలకు విదేశీ పెత్తనం నుంచి విముక్తమయ్యాయి. స్వాతంత్ర్యం పొందాక ఏ దేశానికా దేశం తన జాతీయ మూలాలను పటిష్ఠపరచుకుని, తన  మూల సంస్కృతిని కాపాడుకుని , విదేశీ కశ్మలాన్ని ఊడ్చేసి సంప్రదాయబద్ధంగా ముందుకు సాగింది.

     ఒక్క భారతదేశం తప్ప. ఇక్కడ నమ్ముకున్న జాతీయనాయకులే మాతృభూమిని  చేజేతులా రంపపుకోతకు గురిచేసి జాతిని నట్టేట( కాదు- రక్తపు ఏట్లో)  ముంచారు. అధికారం చేతికందాక జాతీయ వారసత్వాన్ని కాక బ్రిటిష్ వారసత్వాన్నే పుణికి పుచ్చుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాల కోసం తెల్లవారు భారతజాతికి ప్రాణశక్తి అయిన సనాతన ధర్మాన్ని , దానికి ప్రతిరూపమైన హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ జాతీయతను  దెబ్బతియ్యాలని శాయశక్తులా  కుతంత్రాలు పన్నారు. కాంగ్రెసు రాజకీయ ప్రయోజనాల కోసం మనవారనుకున్నవాళ్ళు కూడా అదే దారి పట్టి అదే సనాతనధర్మాన్ని , అదే హిందూ మతాన్ని, అదే హిందూ సంస్కృతిని, జాతీయతను నామరూపాలు లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నారు.

     “నేను విద్య పరంగా ఇంగ్లిషువాడిని. భావపరంగా అంతర్జాతీయుడిని. సంస్కృతిని బట్టి మహమ్మదీయుడిని. పుటకను బట్టి ప్రమాదవశాత్తూ హిందువుని” – అని గర్వంగా, పబ్లిగ్గా ప్రకటించుకున్నవాడు  ప్రమాదవశాత్తూ ( అంటే ప్రజల ఆరాధ్యనాయకుడైన స్వాతంత్ర్య మహావీరుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ విమానానికి జరిగిన ప్రమాద వశాత్తూ) హిందూ దేశానికి, స్వతంత్ర భారతానికి మొదటి ప్రధాని, దౌర్-భాగ్య విధాత అయ్యాడు. తన హైందవ ద్వేషాన్ని అతడేమీ దాచిపుచ్చుకోలేదు. “As long as I am at the helm of affairs, India will not become a Hindu State.” (నేను గద్దె మీద ఉన్నంతవరకూ ఇండియా  హిందూ రాష్ట్రం కాబోదు) అని 1947లో పగ్గాలు చేపట్టిన కొత్తలోనే బహిరంగంగా తొడగొట్టిన హిందూ ద్వేషి మిస్టర్ నెహ్రూ. ఇండియాలో ఉన్నవి హిందూ, ముస్లిం అనే రెండే జాతులు , అవి కలిసి ఉండటం అసంభవం – అన్న జిన్నా ద్విజాతి సిద్ధాంతానికి  కాంగ్రెస్ కూడా  చందా కట్టి , భారతమాతను అడ్డంగా చీల్చి , ముస్లిం జాతికి పాకిస్తాన్ ను పంచి ఇచ్చాక అవశేష దేశం హిందూ జాతికే కదా న్యాయంగా చెందవలసింది? హిందూ దేశంలో హిందూ రాజ్యమే కదా ఉండవలసింది అన్న ఇంగిత జ్ఞానం అతగాడికి లేకపోయింది.   

      హిందూ సంస్కృతి గురించి మాట్లాడటం ఇండియా ప్రయోజనాలను గాయపరుస్తుందని 1949లో ఫరుక్కాబాద్ బహిరంగ సభలో జవాహర్లాల్ నెహ్రూ ఘోషించాడు. “In practice, the individual (Hindu) is more intolerant and more narrowminded than almost any person in any other country.” (ఇంకే దేశంలోని మరే వ్యక్తికన్నా ఈ వ్యక్తి (అంటే హిందువు) ఓర్వలేనివాడు ; సంకుచితమనస్తత్వం కలవాడు ) అని 1953లో కైలాష్ నాథ్ కట్జూ కు రాసిన ఉత్తరంలో ఈ అంతర్జాతీయ షరాబు నిగ్గు తేల్చాడు. “The ideology of Hindu Dharma is completely out of tune with the present times and if it took root in India, it would smash the country to pieces.”( హిందూ ధర్మమనే భావజాలం కాలానికి పనికిరాదు. ఇండియాలో అది వేరూనితే దేశాన్ని ముక్కలు చేస్తుంది ) అని 1951 లో లక్నో యూనివర్సిటీలో చేసిన మహోపన్యాసంలో నెహ్రూ పండిట్జీ సెలవిచ్చాడు

     1901 లో వారణాసిలోని సెంట్రల్ హిందూ కాలేజిలో చేసిన చారిత్రాత్మక ప్రసంగంలో పరాయి దేశానికి చెందిన అనీ బిసెంటమ్మ ఏమన్నదో చూడండి:

     “After a study of some forty years of the great religions of the world, I find none so perfect, none so scientific ,none so philosophic, and none so spiritual as the great religion known by the name of Hinduism.  Make no mistake; without Hinduism, India has no future. Hinduism is the soil into which India’s roots are struck, and torn of that she will inevitably wither, as a tree torn out from its place.”    

    (ప్రపంచంలోని గొప్ప మతాలను నలభై ఏళ్ళు అధ్యయనం చేస్తే హిందూ మతం అంత పర్ఫెక్ట్, దానంత సైంటిఫిక్ , దానంత తాత్వికత, ఆధ్యాత్మికత నిండిన మతం వేరేదీ నాకు కనపడలేదు...  హైందవం లేకుండా ఇండియాకు భవిష్యత్తు లేదు. ఇండియా మొదళ్ళు హిందూ మతం అనే నేలలో పాతుకుని ఉన్నాయి.  హిందూ మతంలో పాతుకున్న వేర్లను పీకేస్తే ఇండియా కూడా నేలనుంచి పీకిన  చెట్టు లాగే వాడిపోతుంది.)

      సంస్కారవంతురాలైన విదేశీ మహిళకు ఇండియా వేర్లు హిందూ మతంలో ఉన్నాయని , ఆ మొదళ్ళు పీకేస్తే ఇండియా మాడిపోతుందని అర్థమయింది. నవభారత నిర్మాతగా ఆకాశానికి ఎత్తబడిన ఇండియా పాలకుడి తెల్లకామెర్ల కంటికేమో హిందూ మతం వేర్లూనితే ఇండియా ముక్కలవటం ఖాయమని తోచింది . అదీ అతడి సంస్కారం!

     రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్ , శ్యాం ప్రసాద్ ముఖర్జీ , పురుషోత్తమ్ దాస్ టాండన్ వంటి విజ్ఞులైన జాతీయ నాయకులు కాలధర్మం చెంది కాంగ్రెసూ  , దేశమూ తన పాపిష్టి వంశానికి హక్కుభుక్తమయ్యాక  నెహ్రూ మరీ బరితెగించాడు.  తాను బనాయించిన  అబద్ధం అత్యద్భుత ఐడియాలజీ అయినట్టు  లెఫ్టిస్టు, కమ్యూనిస్టు మేళగాళ్ళ పక్క వాద్య సహకారంతో దేశమంతటా తాషామర్పా మోగించబట్టాడు. రాజకీయ అవసరార్థం ప్రవక్త అవతారమెత్తి ‘సెక్యులరిజం’ అనే నడమంత్రపు మతాన్ని పుట్టించి, భారత గడ్డపై దాని వేర్లు నాటటానికి  గడ్డపార చేతపట్టాడు.

     ఆ రకంగా నెహ్రూ బ్యాండుమేళం గజ్జె కట్టించిన ‘సెక్యులరిజం’ అనబడు కొత్తమతానికి సిద్ధాంతాల, సువార్తల  హంగూ ఆర్భాటమూ దిట్టంగా అమిరాయి.. జవాహర్ ప్రవక్త సాయించిన పవిత్ర సూత్రాలు స్థూలంగా ఏమిటంటే-

      1 ఇండియా గడ్డ మీద నివసించేవారు యావన్మందినీ కలిపి  ‘ఇండియన్ నేషన్’ అని వ్యవహరింపబడును.

       వివరణ: కొత్త మతం ప్రకారం జాతి అనేది పక్కా రియలెస్టేట్ వ్యవహారం. కల్చర్, గిల్చర్ , సెంటిమెంట్, గింటిమెంట్, ఎమోషన్స్, గిమోషన్స్ జాన్తా నై!  భారత భూతలం మీద నివాసం ఉండటమే  ... వోటర్ కార్డు, రేషన్ కార్డు గట్రా కలిగి ఉండటమే జాతీయతకు ప్రధాన అర్హత. సదరు భారత నివాసులు ఈ దేశ సంస్కృతిని గౌరవిస్తారా, ఇంకేదో విదేశీ సంస్కృతిని అనుసరిస్తారా? ఈ దేశం పట్ల విధేయత , మమకారం కలిగి ఉంటారా, లేక దేశాన్ని, జాతినీ, జాతీయ వారసత్వాన్నీ ఏవగించుకుంటారా అన్నది చూడకూడదు. ఈ దేశం దయ్యాలకొంప, దాని మతం ఒక భూతం, దాని విలువలు, విశ్వాసాలు , సెంటిమెంట్లు , సంస్కారాలు పూచికపుల్ల కంటే హీనం అని ఉమ్మేవారికి కూడా...  ఈ నేలను తల్లిగా ఆరాధించి, దాని సంస్కృతిని , నాగరికతను ప్రేమించి వాటికోసం ప్రాణం ఇచ్చే భూమిపుత్రులతో సమానంగా, ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువగా గౌరవం , ప్రాధాన్యం చచ్చినట్టు  ఇచ్చి తీరాలి. . దీనికి ‘కాంపోజిట్ కల్చర్’, “టెరిటోరియల్ నేషనలిజం’ అని పేరు.

     2. జాతీయులకు జాతీయ గీతం పట్ల, జాతీయ పతాకం పట్ల , జాతీయ వీరుల పట్ల, జాతీయ స్మారకచిహ్నాల పట్ల భక్తి భావం ఉండాలని కంపల్సరీగా  కట్టడి చేయటం పాపం.

      వివరణ: ‘వందే మాతరం’ లక్షలాది స్వాతంత్ర్య అమర వీరుల గొంతులతో పునీతమైనా సరే... చట్టపరంగా దానికి జాతీయగేయం ప్రతిపత్తి ఇచ్చినా సరే- దానిని పాడి తీరాలని ఎవరినీ నిర్బంధించకూడదు. తమ మతవిశ్వాసానికి భంగకరమని భావిస్తే వందేమాతరం పాడటమా, మానటమా, లేక కట్ చేసి పాడటమా అనేది ఆయా మతస్థుల ఇష్టానికి, విజ్ఞతకు వదిలివేయాలి. మన జాతికి కొత్త ప్రవక్తను ప్రసాదించిన మూల దేవుడు మహాత్మా గాంధీ గారు  1923లో ఈ రకమైన రూలింగు ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి. నడమంత్రపు మతం పాత నిబంధనల విషయంలో సందేహం వస్తే మార్గ దర్శనంకోనం మన సెక్యులర్ ఇలవేల్పుల  దివ్యజీవన లీలలను ఉపదేశాలుగా గ్రహించవలెను. అలాగే జాతీయ గీతమైన  జనగణమన పాడటానికి మతవిశ్వాసాల కారణంతో ఏ మైనారిటీ స్కూలు వారైనా , అక్కడి ఏ టీచరైనా నిరాకరిస్తే భారత జాతీయులుగా వారికున్న రాజ్యాంగబద్ధ పౌర స్వేచ్చను వినియోగించటం గానే దానిని  పరిగణించాలి. సినిమా హాల్లో జాతీయగీతాలాపనకు గౌరవ సూచకంగా లేచి నిలబడని వారి పౌర స్వాతంత్ర్యాన్ని గౌరవించాలే తప్ప బలవంతపెట్టకూడదు. జాతీయ పతాకాన్ని లెక్కచేయని వారినీ డిటో డిటో. ఇండియాని తుక్డా తుక్డా చేస్తామని రంకెలేయటం కూడా పౌరస్వేచ్ఛలో భాగమేనని గ్రహించవలయును.

      3 ఇండియా హిందూ దేశం కాదు. హిందూ జాతి కాదు. హైందవం అనేది కేవలం ఒక మతం. దేశంలోని అనేకానేక మతాలలో అదీ ఒకటి. మెజారిటీ మతానికి అంటూ ప్రాధాన్యం  ఏమీ ఉండరాదు. సర్వధర్మ సమభావం , సకల మత సహిష్ణుత మన జాతి ప్రత్యేకత. అన్ని మత సముదాయాలూ కలిస్తేనే  భారతీయ జాతి , లేక ఇండియన్ నేషన్ .

      వివరణ: తమది ఒక నేషన్ అన్న భ్రమ నుంచి  హిందువులు బయటపడాలి. ఇండియా, ఇండియన్, భారత, భారతీయ-లకు అనాదిగా ఉన్న అర్థాలకు కాలం చెల్లిందని గ్రహించాలి. క్రైస్తవులు , మహమ్మదీయులు లాగే హిందువులూ సెక్యులర్ దేశం లోని జస్ట్ ఒక రిలిజియస్ కమ్యూనిటీ. అంతే!

        ఈ రకంగా భారత జాతికి, భారతీయతకు అనూచానంగా స్థిరమైన అర్థాలకు నూకలు చెల్లి, సరికొత్త ‘భారతీయ’ భావన మొలుచుకొచ్చాక,  ‘సెక్యులరిజం’ అధికారిక మతంగా పోలిటీలో పాతుకుపోయాక మారిన విధానానికి  తగ్గట్టు కొన్ని కొంగొత్త ఆలోచనలు, వాటికి తగ్గ సవరణలు, సంస్కరణలు, కట్టుదిట్టాలు అవసరమయ్యాయి. అవేమిటంటే-

       1 ఉన్న బోలెడు మతసముదాయాలలో కెల్లా పెద్దది హిందూ కమ్యూనిటీ అయినందున సహజంగా అది మిగతా కమ్యూనిటీల ఉనికికి ఎల్లప్పుడూ  ప్రమాదకారి !

       2. మిగతా మతాలను హిందూ మతం మింగి వేసే ప్రమాదం ఉన్నది కాబట్టి హిందూ మతాన్ని ఏ మేరకు బలహీనపరిస్తే ఆ మేరకు అన్యమతాలకు, జాతి హితానికి  క్షేమం.

        3. సరికొత్త సెక్యులర్ జాతీయతలో మైనారిటీ మత వర్గాలు సమగ్ర ,అతిముఖ్య భాగం. కాబట్టి హైందవేతర మతాల ప్రయోజనాలను ప్రోత్సహించటమే జాతి కి శ్రేయోదాయకం. దీనికి corollary ఏమిటంటే- హిందూ మత ప్రయోజనాలను  కుంగతీయటమే అన్యమతాలకూ, జాతి అభివృద్ధికి  శ్రేయస్కరం.  హిందువుల అణచివేత జాతీయతకు కీలకం . హిందూ వ్యతిరేకత సెక్యులర్ ఇండియా జాతిలక్షణం.

      4. హిందూ మతానికి మూలం, ప్రాణం సనాతన ధర్మం కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని ఎన్ని విధాల కుళ్ళబొడిస్తే , ఎంతలా అప్రతిష్ఠ పాలు చేస్తే ,ఎంత భ్రష్టు పట్టిస్తే జాతి అభ్యుదయానికి, నేషనల్  ఇంటిగ్రేషన్ కీ , ఇతర మతాల పురోభివృద్ధికీ అంత  మేలు.

      5.సర్వధర్మ సమభావం లేక సర్వమత సమానత్వం మనం ఎంచుకున్న జాతీయ విధానం . కాబట్టి  ప్రత్యేకంగా ఏ ఒక్క మతానికీ , ముఖ్యంగా మెజారిటీ హిందూ మతానికి  జాతీయ జీవనంలో ఏ రకంగానూ  ప్రత్యెక ప్రాముఖ్యం ఉండరాదు. హిందువుల వీరులను జాతీయ వీరులుగా , హిందువుల పండుగలను జాతీయ పండుగలుగా , హైందవ సంస్కర్తలను జాతీయ సంస్కర్తలుగా, హిందూ దేశ చరిత్రను జాతీయ చరిత్రగా పరిగణింపకూడదు. అనేక మతాలలో ఒకటైన హిందూ మతం సంస్కృతిని జాతీయ సంస్కృతిగా గుర్తించరాదు. సర్వమత సమానత్వం ప్రకారం ఇస్లాం, క్రైస్తవ మతాల చరిత్రలను, ఐడియాలజీలను కూడా జాతీయ చరిత్రలో , జాతీయ ఐడియాలజీలో భాగంగానే భావించాలి.

     ప్రపంచంలో ఏ సమాజంలోనూ, ఏ ప్రజాస్వామిక దేశంలోనూ కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ వర్గాన్ని దారుణ వివక్షకు గురిచేసే విధంగా ఇలాంటి ముదనష్టపు ఆలోచనలను రుబ్బి , నికృష్ట విధానాలను పొదిగి  నెహ్రూ ప్రవక్త తయారుచేసిన  ‘సెక్యులరిజం’ అనే మతాన్ని కాలక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఔదలదాల్చాయి. పైన ఉదాహరించిన  అలిఖిత, అప్రకటిత  సెక్యులరిస్టు కమాండ్ మెంట్లను పైకి చెప్పకుండా గుట్టుగా అమలుపరచటమే తమ సెక్యులర్ శీలానికి అగ్ని పరీక్ష అని కాంగ్రెస్, నాన్ కాంగ్రెస్ తేడా లేకుండా కేంద్ర రాష్ట్రాలలో అన్ని సర్కార్లూ భావించటంతో పోనుపోను ఇదే జాతీయ ఏకాభిప్రాయంగా , నేషనల్ పాలిసీగా రాజకీయ జీవుల మనసులలో ముద్రపడి పోయింది . సెక్యులరిజమే మన జాతీయ వారసత్వం , అదే భారత జాతీయతకు ప్రాణం , ప్రణవం అని మిడిమేలపు మీడియాగాళ్లు, అభారతీయ , హిందూ వ్యతిరేక , అమాంబాపతు కుహనా మేధావులు నాన్ స్టాప్ గా ఊదర పెట్టటంతో ఔను కాబోలని అమాయక జనమూ అనేసుకున్నారు. దేవతా వస్త్రాల కథలో లాగా దిగంబరంగా ఊరేగుతున్న సెక్యులరిస్టు రాజుగారి ఒంటిమీద ఉడుపులు లేవని  అంటే తమ పుట్టుకల మూలాలకు ఏమి ముప్పోనన్న భయంతో హిందూ సమాజంలో అన్నీ తెలిసిన పెద్దలు కూడా నోళ్ళు కుట్టేసుకున్నారు. 

      ఇదీ హిందూ దేశానికీ , హిందూ జాతికి, హిందూ జాతీయతకు, హిందూ మతానికి  వచ్చిన అసలు సంకటం. దీని ఫలితాలూ పర్యవసానాలూ వచ్చే అధ్యాయంలో.

      ( అదనపు సమాచారం కోసం Abhas Chatterjee ఉపన్యాస పాఠమైన చిరుపుస్తకం  “The Concept of Hindu Nation” చదవండి. ‘Voice of India’ ప్రచురణ . ప్రతి హిందువు, ప్రతి జాతీయ మేధావి చదివి తీరవలసిన పుస్తకం. )



                                             -------------------------------