Thursday 10 September 2020

ఆటకెక్కిన ఆందోళన

 ఎం.వి.ఆర్.శాస్త్రి

....................................

    మన వాళ్లకు ఆవేశం ఎక్కువ. ఆలోచన తక్కువ .

    అంతర్వేది రథాన్ని తగలబెట్టిన కేసును సి.బి.ఐ. కి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయించారన్న వార్త చూసీ చూడగానే హిందూ ప్రముఖులు కొంతమంది ఆనందబాష్పాలు జలజల రాల్చారు. సాక్షాత్తూ అంతర్వేది శ్రీనరసింహస్వామే భక్తులను అనుగ్రహించి , సిబిఐ దర్యాప్తు వేయించినట్టు మరికొంతమంది ఓవరైపోయారు. కొద్దిరోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న హైందవ ప్రతిఘటన ఉద్యమానికి ఇది అద్భుత విజయమైనట్టు ఇంకొందరు సంబరపడ్డారు. మొత్తానికి – జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందువుల ధర్మాగ్రహానికి తలవంచి తోకముడిచిందని అందరూ తేల్చారు. ఇక ఆందోళనతో పనిలేదని తలచి, ఉద్యమాన్ని జమ్మి చెట్టు ఎక్కించి మళ్ళీ ఎవరి వ్యాపకాల్లో వాళ్ళు పడుతున్నారు.

    సర్కారు వారికి కావలసింది కూడా సరిగ్గా ఇదే. అర్జెంటుగా సిబిఐ పాత్రని రంగంలోకి దించింది హిందూ సమాజపు రౌద్రాన్ని శాంతింపచేసి గండంనుంచి బయటపడెందుకే ! సిబిఐ వచ్చి ఊడబొడిచేది ఏమీ లేదు ; తమకు ఇబ్బంది ఏమీ ఉండదు -అని ఏలిన వారికి తెలుసు. ఎటొచ్చీ మన జనాలకే ఆ సంగతి తెలియదు.

    ఉన్నత న్యాయ స్థానాలు  పట్టుబట్టి వెంటపడిన బహుకొద్ది సందర్భాల్లో తప్ప , ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని చికాకు పెట్టగల కేసులో సిబిఐ స్వతంత్రంగా కదలి , సమర్థంగా పనిచేసిన దృష్టాంతం దాని చరిత్రలో ఒక్కటీ లేదు. ఆ పేరు గొప్ప కేంద్ర దర్యాప్తు సంస్థకు అధిపతిగా పనిచేసిన అధికారే అనంతరకాలంలో ఒప్పుకున్నట్టు సిబిఐ అనేది పంజరంలో చిలుక ! కేంద్ర ప్రభువులు కరవమన్న వారిని కరవటం , వదలమన్నవారిని వదలటం , అరవమన్న వారిమీద అరవటం దాని నైజం. ఇది అనేక సందర్భాల్లో ఉన్నత , సర్వోన్నత న్యాయస్థానాలే చివాట్లు పెట్టి మరీ చెప్పిన నిజం.

    అప్పట్లో సెంటర్లో రాజ్యమేలిన ఇటాలియన్ మాత ఉసికొలిపినప్పుడు ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డిని అవినీతి కేసుల్లో సిబిఐ వెంటాడి వేటాడి దుంప తెంచింది . తరవాత సెంటర్ బాసులు దూకుడు తగ్గించమన్నప్పుడు తగ్గించింది.  ఇప్పుడు అంతర్వేది రథం కేసులో కూడా కేంద్రప్రభువులు పిసరంత సంకేతం అందిస్తే చాలు సిబిఐ చెలరేగి సూపర్ స్పీడుతో తడాఖా చూపించగలదు. కానీ ఆంధ్ర రాజకీయాల్లో కొన్నాళ్ళుగా సాగుతున్న చాటుమాటు  సరాగాలను,  బిజెపి ప్రముఖులనబడే కొందరి విచిత్ర విన్యాసాలను, వింత వైఖరులను గమనిస్తే ఈ విషయంలో ఆశ కంటే అనుమానానికే ఆస్కారం ఎక్కువ. రాష్ట్ర రాజధానిని ఎప్పుడైనా ఎన్ని చోట్లకైనా టూరింగు టాకీసులా తరలించ వచ్చునన్న జగన్ సర్కారు వాదనకు తాజాగా సుప్రీం కోర్టులో భారత ప్రభుత్వం వారు పలికిన వత్తాసును గమనించాక కూడా భ్రమలు వదలనివారి కళ్ళను భగవంతుడు కూడా తెరిపించలేడు.



    హిందూ మతం మీద , మతవిశ్వాసాలమీద , సెంటిమెంట్ల మీద , హిందూ దేవాలయ వ్యవస్థ మీద వరసగా ఎన్ని దాడులు జరుగుతున్నా, అంతర్వేది రథ దారుణ దహనానికి  మొత్తం హిందూ సమాజం మండిపడి, సామాన్య భక్తులు, మహిళలు సైతం అసాధారణ రీతిలో ధర్మాగ్రహం వెలిగక్కుతుంటే ఉలకని  పలకని  ముద్దులస్వామి సిబిఐ దర్యాప్తు నిర్ణయాన్ని అందరికంటే ముందు ఎగబడి స్వాగతించటాన్ని బట్టే అర్థం కాలేదా – ఆ నిర్ణయం వెనుక మతలబు ఏమిటో !?

   


Tuesday 8 September 2020

పిచ్చివాళ్ళ స్వర్గం !

ఎం.వి.ఆర్.శాస్త్రి

......................................

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిచ్చోళ్ళ బారిన పడ్డట్టు కనిపిస్తున్నది. ఇంతకుముందు కడప జిల్లా రాజంపేటలో,  నెల్లూరు జిల్లా బిట్రగుంటలో దేవుడిరథాలను పిచ్చివాళ్ళు తగల పెట్టినట్టు పోలీసులు కనిపెట్టారు. తరవాత తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో దేవతా విగ్రహాలనూ పిచ్చివాళ్ళే ధ్వంసం చేశారనీ సర్కారువారు దివ్యదృష్టితో కనుక్కున్నారు. ఇప్పుడు కొత్తగా అంతర్వేది దేవస్థానంలో పవిత్ర రథాన్నీ గుర్తు తెలియని పిచ్చివాళ్ళే పని గట్టుకుని దగ్ధం చేశారనీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ, పోలీసు , మరియు పార్టీ పెద్దలు రెడీమేడ్ నిర్ణయాన్ని జనం మీద రుద్దుతున్నారు. 

అంతర్వేదిలో అర్ధరాత్రి హిందూ వ్యతిరేక పిచ్చి ప్రకోపించ బోతున్నదని ముందేతెలిసి, ఆ ఘోరాన్ని చూడలేక సి. సి. కెమేరాలు చాలా కాలం ముందే కళ్ళు పొడుచుకున్నాయట!! 50 అడుగులపైగా ఎత్తు ఉండే రథశాల  పైన ఎక్కడో ఎవరికీ కనపడని చోట నిద్రపోతున్న తేనెటీగలకు కూడా సరిగ్గా అదే అర్ధరాత్రి పిచ్చి లేచిందట! ఎవరో ప్రభుదాసులను పిలుచుకొచ్చి ఓపొట్టి గడతో తమ పట్టును తగలబెట్టించుకుని ఆ తేనెటీగలు ఆనందంగా ఆత్మాహుతి చేసుకుంటూ తమతో పాటు తాటిచెట్టంత రథాన్ని కూడా కాకతాళీయంగా మంటలలో  మసి చేశాయట! ఈ దేవ రహస్యాన్ని అంజనం వేయకుండానే కనుగొన్న బాధ్యత గల పెద్దలను ఏ పిచ్చాసుపత్రిలో చేర్చాలో వెంటనే తేల్చకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  మునుముందు చాలా ప్రమాదం!ఈ రకమైన పిచ్చి వాగుళ్ళను సహించి ఊరుకుంటే ఆంధ్రప్రదేశ్ త్వరలోనే పిచ్చివాళ్ళ స్వర్గం గా మారిపోవచ్చు. హిందూ మతం మీద,హిందూ దేవస్థానాల మీద , ఎవరి జోలికీ వెళ్ళని హిందువుల విశ్వాసాల మీద,  సెంటిమెంట్లమీద, మనో భావాలమీద పగబట్టి , వరసగా నీచ , నికృష్ట   దాడులకు తెగబడుతున్న వారి ఆగడాలను వెంటనే అణచి వేయకపోతే రాష్ట్రంలో శాంతికి,  ప్రజా భద్రతకు, మత సామరస్యానికీ పెను ముప్పు తప్పదు.  


ఉగ్రనారసింహుడు ఊరుకోడు! 


మహావిష్ణువు అవతారాలన్నిటిలోకీ మహోగ్రమైనది నారసింహావతారం. కోట్లాది హిందువులకు పరమపవిత్ర దివ్యక్షేత్రమైన అంతర్వేదిలో  నరసింహస్వామి దివ్యరథాన్ని దగ్ధం చేసిన వారు, చేయించిన వారు , వారిని ప్రేరేపించినవారు , కాపాడుతున్నవారు , దైవద్రోహంలో పాలు పంచుకునేవారు ఎవరైనా, ఎంతటివారైనా నామరూపాలులేకుండా మాడి మసికావటం తథ్యం.  ఉగ్రనారసింహుడు ఇప్పటికే హిందూ భక్తకోటిని పూనాడు. స్వతహాగాఎవరి జోలికీ వెళ్ళక , అవమానాలను,అపచారాలను మౌనంగా భరించే హిందువులకు ఓరిమి నశించింది. హిందూ సమాజం భగభగమండుతున్నది. ప్రకంపన మొదలైంది. అది మెల్లిగా పెను భూకంపంగా మారుతుంది. సింహం నిద్ర లేచేంతవరకే నక్కల , పిచ్చికుక్కల ఆట !   


శభాష్  పవన్ కల్యాణ్ !! 


ఈ సందర్భంలో ఇంకో ముఖ్య విశేషమేమిటంటే హిందూసమాజం వాణిని , మనోగతాన్ని బలంగా స్ఫుటంగా వినిపించేందుకు తెలుగునాట ఒక గట్టి నాయకుడు  కనపడ్డాడు. అంతర్వేది దురాగతంపై జనసేనాధిపతి , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెలువరించిన ఈ వీడియో రెండు నాల్కల కుహనా లౌకికవాద రాజకీయ గోమాయువులకు దిమ్మతిరిగే చెంపపెట్టు. 


https://youtu.be/SymgUiyTCz8

ఇందులో పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలలో పునరుక్తి లాంటి దోషాలు ఉండవచ్చు. వీటిని ఇంతకంటే బాగా  , ఇంకా దృఢంగా , రసవత్తరంగా ఎందరో పెద్దలు చెప్పి ఉండవచ్చు. కాని సంఘ్ పరివార్ కు , దాని అనుబంధ , సోదర సంస్థలకు వెలుపల ఒక మెయిన్ స్ట్రీమ్ సెక్యులర్ రాజకీయ పార్టీ అధి నాయకుడు ఈ దేశ  రాజకీయాలను పిశాచంలా పట్టిన బూటకపు లౌకికవాదపు బండారాన్ని ఈ స్థాయిలో  బట్టబయలు చేయటం నాకు తెలిసినంతలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఇటీవలి దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇదే మొదలు.  ఇతరమతాలవారికి కించిత్తు అసౌకర్యం కలిగినా గుండెలు బాదుకుని లబలబలాడే రాజకియపార్టీలవారు మెజారిటీ ప్రజల మతవిశ్వాసాలకు , సెంటిమెంట్లకు ఎంతటి అపచారం , విఘాతం జరిగినా ఎందుకు పట్టించుకోరన్న ప్రశ్న మతి తిన్నగా ఉన్నవారందరూ ఎప్పుడూ అడిగేదే . కాని అదే సవాలు  ఒక సెక్యులర్ పార్టీ అధినేత నుంచి వెలువడటం ఇక్కడ విశేషం. దేవీదేవతలకు జరిగే అపచారాలను సహించి ఊరుకొనరాదనీ , ఆ దేవతామూర్తులను ఆరాధించే కోట్లాది హిందువులు , ముఖ్యంగా హైందవ మహిళలు దైవద్రోహుల భరతం పట్టేందుకు వీథుల్లోకి రావాలని హిందూ సంస్థల పరివారానికి చెందని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు పిలుపునివ్వటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం.   లక్షల సంఖ్యలో వీరాభిమానులుండి , ఇంకా అనేక లక్షలమందిని కదిలించగలిగిన   పవర్ స్టార్ ఇంత స్ఫుటంగా, దృఢంగా గళమెత్తటం హిందువుల చిరకాల, నిరంతర  ధర్మ పోరాటానికి  కొత్త దన్ను. 




















Saturday 21 March 2020

Beware of Coronavirus


Dr. Kashyap Panganamamula, M.D. 

Director of Therapeutic Endoscopy .
Penn Presbyterian Medical Center ,
Philadelphia , PA , USA 
Email: kashyap.pang@gmail.com

................

Here are some important facts about Coronavirus  (COVID-19) Pandemic , from medical journals as well as professional  experience :



1.80% of the patients have milder disease and 20% will have severe symptoms/ complications
2. Complications are more likely in people above 65 years age, and People with Lung problems, heart failure or Diabetes . But young people can also develop complications and die
3.Asymptomatic patients can also transmit the infection as the virus is present in the airways and
respiratory secretions and possibly account for lot of community spread
4. The virus can survive on surfaces up to 3 days ( not just 12 hours as was stated in some circulating messages)
5.Most common symptoms are fever, dry cough and Shortness of Breath. Some patients are reporting headache, muscle pains. Up to 48% patients can have Gastrointestinal symptoms – including diarrhea, nausea/ vomiting
6.Patients with milder symptoms can isolate themselves but seek medical attention immediately if they have any breathing problems . If you have mild symptoms, make sure you drink lot of fluids to keep yourself hydrated.
7.Severe symptoms in children are not reported but children can get infected and spread the
infection to others
8.  Medications in combination -Azithromycin and Hydroxychloroquine are being studied for treatment and we will know the results soon.
9.There is no vaccine yet (contrary to some messages circulated recently) but some vaccines are being evaluated in clinical trials.
10.Whether rising temperatures ( summer) will stop or slow the spread of infection or not is not known yet. But if it does then there is a chance that virus will return in the winter unless a vaccine comes out by then.

Precautions: 

1.Most important thing is social distancing – Droplets can spread from coughing and sneezing up to 1 meter . (maximum distance is unknown). Maintain a minimum of 6 feet from each other.

2.Wash hands frequently, after using the bathroom, before eating with soap and water for a minimum of 20 seconds or use an alcohol based hand sanitizer, eat only cooked food. Do not touch face, nose and eyes with your hands

3.Those with symptoms should isolate themselves for 2 weeks and should wear a mask. They should not use the same bath room that is used by patients/ suspected patients until it is properly
cleaned with disinfectants– Patients or those with symptoms should flush the toilet with the lid closed as there is evidence that stool also can transmit the infection and flushing causes stool to
create aerosols that can be inhaled by other people using the bathroom
Hope this information will be helpful to our people.


Monday 16 March 2020

ఇకనైనా మీరు మారరా ?!


డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్

(ఊపిరితిత్తుల వైద్య నిపుణులు

WHO - Corona IPC Observer.)

.............

      2019డిసెంబర్ 31 న్యూఇయర్ వేడుకల్లో మునిగితేలే ప్రజానీకానికి తెలియని విఘాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ డోర్ తట్టింది.

     ఒకటో తారీకు పొద్దున తలుపు తెరిచి చూసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివ్వెర  పోయె నిజాలను
తెలుసుకునే లోపే, కంటి ముందర పిడుగు పడితే ఎలా ఉంటుందో, ప్రపంచ ఆరోగ్య సంస్థ లో నున్న వైద్యులకి,  పరిశోధకులకు, పాలక మండలికి వెన్నులో వణుకు వచ్చింది.

      చైనా ఏది చెప్పినా కూడా రెండుసార్లు ఆలోచించాలని ప్రపంచంలో అందరికీ తెలుసు!! కానీ ఈ సారి మాత్రం చైనా చెప్పిన మాటల్లో  కొంత సత్యం కనబడ్డది.

      చిన్నపాటి జ్వరం, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, వంటి సాధారణమైన ఫ్లూ లక్షణాలు గా ఉన్న  వైరస్ గమనిస్తూ ఉండగానే, మానవాళిని కుదిపేసే, ప్రపంచ జీవనానికి సవాల్ విసిరే ఓ మహమ్మారిగా coronavirus ప్రత్యక్షమైంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

      కొరోనావైరస్ ఎలా వచ్చింది?ఎలా ఉంటుంది? ఎలా నియంత్రణ చేయాలి? అని తెలుసుకునే లోపు, వేల సంఖ్యలో చైనాలో ప్రజలు దీపపు పురుగులు చచ్చినంత సులువుగా చనిపోయారు.

       అక్కడి నుంచి మొదలైన ఈ  కొరోనా వైరస్ మహమ్మారి , చైనాని తన గుప్పిట్లోకి తీసుకొని, సర్వ నాశనం చేసి,  మిగతా ప్రపంచ దేశాలపై కన్నేసింది.

         ఏ ఏ దేశాల్లో అయితే ప్రజలు వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ,అత్యంత నిర్లక్ష్య ధోరణి వహించారో వారిపై     కొరోనావైరస్ పంజా విసిరింది.
            మాకేమీ కాదు, మేము చాలా గట్టి వాళ్లం, మా చుట్టూ మనుషులు, డబ్బు,ధనము, అంతస్తు,  అధికారము, అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, మాకు  కొరోనావైరస్ సోకే అవకాశమే  లేదు, అనుకుని అహంకరించిిన అమెరికా, జర్మనీ, జపాన్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల వారే దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పదుల నుంచి మొదలుకొని, వందలు వేల లెక్కచొప్పున రాలిపోతున్నారు.

        ఇక మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం!
        వ్యాధి వచ్చిన తర్వాత కూడా, వ్యాధితో నేనున్నానని  తెలియకుండా  మాయ లో ఉంచే వ్యాధి coronavirus. ఇది ముక్కు, నోటి ద్వారా శరీరంలో ప్రవేశించి ఊపిరితిత్తుల లోపలికి వెళ్లి, ఊపిరితిత్తుల నాశనం మొదలు  అయ్యేంత వరకూ ...ఇది చాలా సర్వసాధారణమైన లక్షణాలు అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వ్యాధిగా మనము భావించి, వైద్యుడి దగ్గరకు వెళ్లి పరీక్షలు చేయించుకొని,ఖర్మగాలి Corona Virus నిర్ధారణ అయితే..... అప్పటికే మీ శరీరంలో పుష్కలంగా, లక్షల లో కోరనా వైరస్  క్రీములు, వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది.
      అశ్రద్ధ చేసినట్లయితే, Corona వైరస్ సోకిన మనిషి తెలుసుకొని, చికిత్స విధానము కొరకు  వైద్య వ్యవస్థ ని ఆశ్రయించే టప్పటికి, ఈ వైరస్ ఊపిరితిత్తులు నాశనము చేసి, కుళ్లిపోయే నిమోనియా మార్పులు తెచ్చి, శ్వాస ప్రక్రియలో తీవ్ర అంతరాయం  కలిగిస్తుంది, ఆరడుగుల మనిషిని   అరరోజు లో,  ఆరు అడుగుల ఐ సి యు  మంచంపై  జీవచ్ఛవంలా పడేస్తుంది .

        ఊపిరితిత్తుల్లో సాధారణంగా క్షయ వ్యాధి వచ్చినప్పుడు, అశ్రద్ధ  చేసిన రోగులకు ఆరు నెలలకి , ఫైబ్రోసిస్ (fibrosis- Permanent damaged scaring)అనే శాశ్వతమైన మార్పులు ఏవైతే  వస్తాయో... వాటన్నిటినీ Corona virus  15 నుంచి నెల రోజుల  లోపలే తీసుకొని వస్తుందంటే, ఈ వైరసు   ఎంత  ప్రమాదకర మైనదో, దాని విషము మానవ శరీరాన్ని  ఎంత నాశనం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

         ఇంతటి భయంకరమైన Corona Virus పట్ల ఏ మాత్రం అశ్రద్ధ వహించినా  కోలుకోలేని దెబ్బ శరీరముపై పడడం ఖాయం.

       తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1)  రోడ్లపై తిరగకుండా, పనులు సాధ్యమైనంత తగ్గించుకుని ఇంటి పట్టున   ఉండడం అత్యుత్తమం.

2) జ్వరము, దగ్గు,తుమ్ములు,ఒళ్ళు నొప్పులు ఆయాసం,ఈ లక్షణాలు వచ్చి రెండు మూడు రోజుల్లో గనక తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

3) కనీసం నాలుగు గంటలకు ఒకసారి చేతులు ముఖ్యంగా వేలు అరిచెయ్యి శుభ్రంగా సబ్బుతో  కడగడం అవసరం.

4) బయట తిరిగేటప్పుడు సాధ్యమైనంతవరకు  మనిషి - మనిషి  మధ్య మూడు నుంచి ఆరు అడుగుల దూరం ఉండేట్టు ఎవరికి వారు జాగ్రత్త పడగలిగితే ఈ వ్యాధి వ్యాప్తిని చాలావరకు అరికట్ట వచ్చు. (Social Distancing.)

5) పార్కులు, క్లబ్బులు , థియేటర్లు , ఫంక్షన్ హాల్స్ వంటి పబ్లిక్ స్థలాలు, ఆటోలు, బస్సులు,  ట్రైను, ఏరోప్లేన్, వంటి ప్రయాణ మాధ్యమాలు సాధ్యమైనంతవరకు అవాయిడ్ చేయాలి.

6) కుదిరితే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలో, కొత్త వారు ఎవరు వచ్చినా క్షుణ్ణంగా  వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని, వారు  కూడా పరిశుభ్రత నియమావళి పాటించాలి. వారికి గనక పై వ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే నిర్మొహమాటంగా  పరీక్షలు నిర్వహించాలి.

7) పోషకాహారం తినవలసిన అవసరం ఎంతైనా ఉంది. చైనాలో మాంసాహార  మార్కెట్లోనే ఈ వ్యాధి పురుడుపోసుకుంది అని గుర్తుంచుకుని మాంసాహారులు  జాగ్రత్త పడాలి.


       అంతా ప్రభుత్వమే చేస్తుంది గా!!

       అంతా ప్రభుత్వమే చేస్తుందనుకుని, మన బాధ్యత కూడా ప్రభుత్వంపై నెట్టేయడం, కరోనా వ్యాధి కంటే భయంకరమైన ఆలోచన వ్యాధి.  ఎవడి ఇల్లు వాడే జాగ్రత్త పరచుకోవాలి! ఎవరి వొళ్లు వారే కాపాడుకోవాలి!

        తెలిసీ తెలియని వాళ్లు సోషల్ మీడియాలో చేసే పిచ్చి వాగుళ్లకు మోసపోకుండా ,  వైద్యం గురించి ఏమీ తెలియని మహానుభావులు చెప్పే చచ్చుపుచ్చు చిట్కాల మాయలో పడకుండా భిన్నమైన,   Corona virus గురించి వాస్తవాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండక పోతే కొంప కొల్లేరు అవ్వడం ఖాయం!!




Thursday 12 March 2020

బ్రహ్మ చెప్పిన కరోనా మందు!!


ఎం.వి.ఆర్. శాస్త్రి

.......................

     ఇప్పుడు  మొత్తం ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కొత్త మహమ్మారి కరోనా వైరస్. ఈ  ఉపద్రవపు విస్తృతి, తీవ్రత  గురించి  మిత్రుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్  నిన్న రాత్రి వివరిస్తూంటే  నాకు  యోగవాసిష్ఠం లో కర్కటి ఉపాఖ్యానం గుర్తుకొచ్చింది.

     ఇదీ ఆ కథ :

     కర్కటి అని ఓ మహారాక్షసి . దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు. ఇలా కాదు;  భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకే సారి మింగ గలిగితే ఎంత బాగుండు ! అప్పుడు కానీ నాకు కడుపు నిండదు – అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది. ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది. హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు.

     “ ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయం లోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోం చేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు “అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో ‘విషూచిక’ అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువుద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ‘ అని వరమిచ్చాడు. అయితే  దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నాడు. 
     
       అవేమిటంటే :
1.                   1. తినకూడని వాటిని తినేవారిని, చెయ్యకూడని పనులు చేసేవారిని , చెడు ప్రదేశాల్లో ఉండేవారిని , శాస్త్రవ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను  సుబ్బరంగా  హింసించి ఆరగించవచ్చు.
2.      
           2.మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో   పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ ఎస్కేప్ రూట్ ఇచ్చాడు. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికావ్యాధి కోరలనుంచి తప్పించుకోగలరట!
       



   వేల సంవత్సరాల కిందటి  యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి. ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో, పక్క వాటాలోనో  కాపురంపెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. కప్పలు, పాములు తినే చైనా వాళ్ళూ , ఎద్దు మాంసం లేనిదే  ముద్దదిగని తూర్పు, పడమర  దేశాల వాళ్ళూ , మతం పేర రక్తపుటేర్లు పారించిన వాళ్ళూ కరోనా కోరల్లో నజ్జు అవుతున్నారు. వాటికన్ , మక్కా లాంటి క్షేత్రాలే మనిషి జాడలేకుండా మూతపడి , ఇటలీలాంటి దేశాలు మొత్తానికి మొత్తం దిగ్బంధమై , చైనావాళ్ళు పైకి చెప్పుకోలేని ఘోరకలితో గొల్లుమంటూ ప్రపంచమంతటా హాహాకారాలు దద్దరిల్లుతున్నా , ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం చేతులెత్తేసిన స్థితిలో పాత పురాణం లో బ్రహ్మ చెప్పిన ఈ విషూచికా మంత్రమే  రేపు బాధిత జనాలకు తారకమంత్రం అవుతుందేమో?! ఎవరు చెప్పగలరు ? ఈ సంగతి తెలిస్తే ఏ అమెరికా వాడో  ఈ విషూచికా మంత్రానికి అర్జెంటుగా పేటెంటు కొట్టెయ్యడా ?!

ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణు శక్తయే  నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం
ఓం హరహర నయనయ పచపచ మథమథ
ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా 

                   


Thursday 20 February 2020

మనసున్న మహామేధావి

పాత ముచ్చట్లు -7

ఎం.వి.ఆర్ .శాస్త్రి
.............

     (రాంభట్ల కృష్ణమూర్తి  శతజయంతి సంచికకు రాసిన వ్యాసం) 


     జగమెరిగిన మార్క్సిస్టు మహామేధావి ...  ఎన్నో వందల  మంది కమ్యూనిస్టు మేధావులకు  , అభ్యుదయ రచయితలకు స్ఫూర్తిప్రదాత అయిన  రాంభట్ల కృష్ణమూర్తి గారి గురించి నాకు తెలిసింది తక్కువ. ఆయనతో నా సాహచర్యమూ కొద్దిదే. నా మీద  ఆయన ప్రభావం కూడా పెద్దగాలేదు. కాబట్టి శతజయంతి సంచికకు నేనేమి రాయగలనని తటపటాయించాను. కాని మిత్రుడు ఆర్. వి. రామారావుగారు " కాబూలీవాడి" లా  వదలలేదు. చివరి గడువు చివరి రోజున ఈ నాలుగు మాటలు రాయక తప్పలేదు.
    రాంభట్ల గారిని నేను మొదట కలిసింది 1969 లో. నంద్యాల కాలేజి విద్యార్థులకు రాజకీయ తరగతి అధ్యాపకుడిగా ఆయన వచ్చిన సందర్భంలో. అప్పట్లో నేను నంద్యాల గవర్నమెంటు పాలిటెక్నిక్ లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగు రెండో సంవత్సరం విద్యార్థిని. కాలేజీ ఎగ్గొట్టి మరీ - మార్క్సిజం సిద్ధాంత గ్రంథాలను దీక్షగా చదువుతున్న వాడిని. ఏ.ఐఎస్ ఎఫ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్న వాడిని.  మా నాయకుడు కామ్రేడ్ వి.వి.రామారావు. ( అనంతరకాలంలో రాష్ట్ర ఎఐటియుసి అధ్యక్షుడు; విశాఖపట్నం పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు ).  రామారావు సివిల్ ఇంజినీరింగు విద్యార్థిగా ఉంటూ పూర్తికాలం స్టూడెంట్స్ ఫెడరేషన్,  కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంస్థల ఆర్గనైజర్ గా అవస్థలు పడుతూ పనిచేస్తూ నా వంటి కుర్రాళ్ళను ఇన్ స్పైర్ చేస్తూండేవాడు. అప్పట్లో మా  విప్లవ తమకం ఎలాంటిదంటే ... ఓ సారి నాకో పెద్ద సమస్య వచ్చింది. కాలేజి ఎగ్గొడుతున్నానని తెలిసి మండిపడి మా నాన్న నన్ను చదువు మానేసి ఇంటికి రమ్మంటూ తిట్లదండకంతో ఉత్తరం రాశాడు. ఆ సంగతి  రామారావుకు చెబితే -
    " కామ్రేడ్. మహా అయితే ఇంకో రెండేళ్ళు ఇలాంటి తిప్పలు తప్పవు.ఎలాగో వోర్చుకోవాలి. ఆ తర్వాత ఎలాగూ విప్లవం రాక తప్పదు. సోషలిస్టు రాజ్యం వచ్చాక ఎవరికీ ఏ సమస్యా ఉండదు" అన్నాడు ఎంతో నమ్మకంతో. అంతేకదా అని నేనూ నమ్మకంతో నిట్టూర్చాను.
    అలాంటి నెత్తురుమండిన , శక్తులు నిండిన విప్లవ స్వాప్నిక  కాలంలో  నేను రాంభట్ల గారిని మొదటిసారి చూశాను. నంద్యాల లో మేమున్న టెక్కె ప్రాంతంలో  రామారావు రూములో బస చేసి రెండురోజులు   పూర్తిగా ఆయన మాతోనే ఉన్నారు. మార్క్సిజం గురించి, కమ్యూనిస్టు ఆలోచనా విధానం గురించి , చరిత్రను చూడాల్సిన గతితార్కిక  పధ్ధతి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఆది ద్రావిడుల నాగరికతను నాశనం చేసిన ఆర్యుల అజ్ఞానపు ఆనవాళ్లు అంటూ ఆయన వేదాలలోని వృత్రాసుర , త్రిపురాసుర గాథలను వివరిస్తుంటే మేము ఆశ్చర్యంతో నోరువెళ్ళబెట్టాం. నంద్యాల టౌన్ లో జరిగిన  బహిరంగ సమావేశంలో రాంభట్లగారు ఐతరేయ బ్రాహ్మణం నుంచి సంసృతంలో గడగడ కొటేషన్లు ఇస్తూ ఆంధ్రులకూ  , సోవియట్ యూనియన్ లో తాను చూసిన అర్మేనియాకూ ముడిపెట్టిన తీరు మాకు అద్భుతం అనిపించింది. ఇంతటి పాండిత్యం , ఇంతటి మేధాశక్తి నాకు ఏనాటికైనా అబ్బితే ఎంత బాగుండు అనుకుకున్నాను. అటుమీద చాలాకాలం నేను రాంభట్లగారికి ఏకలవ్యశిష్యుడిని.
     కాలేజీ చదువు తరవాత నేను మా ఊరు (కృష్ణా జిల్లా  జగ్గయ్యపేట)  చేరాను. ఉద్యోగం చేసే ఉద్దేశం ఎంతమాత్రమూ లేక , కమ్యూనిస్టుపార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనసాగాను. అందులో భాగంగా జగ్గయ్యపేటలో అభ్యుదయ రచయితల సంఘం శాఖను మొదలెట్టాం. దానికి నేను సెక్రెటరీని . రాంభట్ల గారేమో రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి. మా కొత్త శాఖకు మార్గదర్శనం కోసం 1974లో కాబోలు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయనను కలిసాను. అప్పట్లో చార్మినార్ చౌరస్తా లోని సంగం థియేటర్ దగ్గర ఆయన అన్నగారికి AGE WORKS అని చిన్న ఫేక్టరీ ఉండేది. ఈయనా రోజూ కాసేపు అందులో కూచునే వాడు. అక్కడే నాతొ చాలా గంటలు ఆప్యాయంగా మాట్లాడారు. చిక్కడపల్లి రోడ్ల మీద నాతొ కలిసి నడుస్తూ విలువైన ఎన్నో సూచనలు ఇచ్చారు.
      అప్పట్లోనే జగ్గయ్యపేటలో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ( ఇస్కస్ ) శాఖనుపెట్టదలిచాం. దాని విషయంలో ఒక పేచీ వచ్చింది. ప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు , ఉమ్మడి మద్రాసు రాష్ట్ర, ఆంధ్ర శాసనసభల్లో ప్రముఖ ప్రతిపక్ష నేత అయిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు  గారిది మా ఊరే . పెట్టబోయే ఇస్కస్ కమిటీలో ఎవరుండాలన్న దానిపై ఆయన చెప్పింది  మా కుర్రకారుకి నచ్చలేదు. మేము అన్నదానికి ఆయన ఒప్పుకోలేదు. చిన్నవాళ్ళం కాబట్టి కమ్యూనిస్టుపార్టీ లోతుపాతులు మాకు తెలియవు. మనందరం కలిసి నడుపుకునే సంఘంలో ఈ పెద్దాయన పెత్తనమేమిటి అని చిర్రెత్తింది.
     ఏమి చెయ్యాలి అని అడగటానికి మళ్ళీ హైదరాబాద్ వెళ్లి రాంభట్లగారిని  కలిశాను. ఎందుకంటే ఆ కాలాన ఇస్కస్ కు కూడా  ఆయనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.' ఓస్! దీనికేముంది!  మెంబర్లు అందరూ ఎలా అనుకుంటే అలాగే కానివ్వండి' అని ఆయన చెప్పారు. 'పిల్లలమర్రిగారు ఒప్పుకోరు' అంటే ' రాష్ట్ర కార్యదర్శిని నేను . మీ కమిటీని ఆమోదించాల్సింది నేను' అన్నారు. మా మాటే నెగ్గినందుకు నాకు మహా సంతోషం వేసింది.  'ప్రారంభ సభకు మీరు తప్పక రావాలి ' అన్నాను. ' తప్పక వస్తాను. అన్నీ దగ్గరుండి నడిపిస్తాను ' అని ఆయన భరోసా ఇచ్చారు. అంతటివాడే అభయం ఇచ్చాక ఇంకేమి కావాలి అని ఈల వేస్తూ ఇంటికెళ్ళాను. స్టేట్ సెక్రెటరీనే మాకు అండగా ఉన్నాడన్న పొగరుతో పిల్లలమర్రిగారికి ప్రారంభసభ సంగతి మేము చెప్పనైనా చెప్పలేదు. చెపితే ఎక్కడ చెడగొడతాడోనని భయం.
      అన్నట్టే   రాంభట్ల గారు మా ఊరు వచ్చారు. మా ఇంట్లోనే బస చేశారు.  'మంచి బ్రాహ్మడు .  వేదాలు, పురాణాల గురించి ఎంత చక్కగా చెపుతున్నాడో' అని మా అమ్మ తెగ సంతోషించింది. భోజనం చేశాక ఆయన్ను ఏవో సందేహాలు కూడా అడిగింది ఆ బ్రాహ్మడు చక్కగా సమాధానం చెప్పి మా అమ్మను మెప్పించాడు. ఇక  సభ దగ్గర  కథ అడ్డం తిరిగింది. పిల్లలమర్రిగారు పిలవకపోయినా వచ్చి మొత్తం కార్యక్రమాన్ని తన చేతిలోకి తీసుకుని తాను కోరిన  వాళ్ళతో కమిటీ వేయించారు. ఆయన చెప్పినదానికల్లా రాంభట్ల 'సరే' అన్నారు.  నేను తెల్లబోయాను. 'ఇలా చేశారేమిటి మహానుభావా' అని తరవాత అడిగితే  తేలిగ్గా నవ్వేసి ' ఏం చేస్తాం ? ఆయన పార్టీ రాష్ట్ర కమిటీ మెంబరు. ఆయన ఏరియాలో  ఆయన మాటకు నేను ఎదురు చెప్పకూడదు.' అన్నారు.  నాకు ఇంకా అర్థం కాలేదు. అది గ్రహించి ' అనువుగానప్పుడు పంతానికి పోకూడదు. ఏదో జోక్ వేసి ఇరకాటంనుంచి తప్పించుకోవాలంతే. నన్ను చూసి  నేర్చుకో ' అని నాకు హితబోధ చేసి బస్సెక్కారు.
     ఎన్నో అనుభవాలు అయి కమ్యూనిస్టు తత్త్వం బోధపడ్డాక నేను ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీకి గొడుగు పట్టటం లాంటి విప్లవ కార్యక్రమాలు కట్టిపెట్టి బతుకు తెరువు నిమిత్తం హైదరాబాద్  ఈనాడు దివాణానికి చేరాను. ఆ సమయాన రాంభట్ల గారు ఈనాడుకు ఎడిటర్ ( ఎడ్మినిస్ట్రేషన్ ) గా ఉన్నారు. నేను రామోజీరావుగారికి ఉత్తరం రాయటం, ఆయన నన్ను పిలిపించి మాట్లాడి సెంట్రల్ న్యూస్ బ్యూరో బాధ్యత చూసేపని  ఆఫర్ చెయ్యటం 1978 ఫిబ్రవరి 10 న నేను ఉద్యోగంలో చేరేదాకా ఆయనకు తెలియదు. తెలిశాక చాలా సంతోషించారు. సంపాదకీయం రాయటానికి గజ్జల మల్లారెడ్డిగారు రోజూ ఈనాడు ఆఫీసుకు వస్తుండేవారు. ( అప్పటికింకా ఆయన ఎడిటర్ గా చేరలేదు. ) రాచమల్లు రామచంద్రారెడ్డి గారు ఎడిట్ పేజీకి పనిచేస్తుండే వారు. వీరు, రాంభట్ల సోమాజీగూడ ఈనాడు ఆఫీసు రెండో అంతస్థులో ఒకే కాబిన్లో కూర్చునేవారు. నా సీటు కూడా దాని పక్కనే . ముగ్గురు దిగ్గజాల ముచ్చట్లు వినటం , ఫస్ట్ ఫ్లోర్ లోని కాంటీను కు వారితో కలిసి వెళ్లి మాట్లాడటం గొప్ప అనుభవం.
     రాంభట్లగారు చొరవ తీసుకుని ' మీజాన్ ' లో తన పాత సహచరుడైన బుద్ధవరపు చిన ( బి.సి.) కామరాజు అనే " తూలికాభూషణ్ "ను ఈనాడులో న్యూస్ ఎడిటర్ గా చేర్పించారు. వారిద్దరూ ఆప్తమిత్రులు. వారితోబాటు  డైనింగ్ హాల్ లో మాట్లాడుకుంటూ భోంచేయటం వల్ల తెలుగు పత్రికారంగ పూర్వాపరాల గురించి చాల విషయాలు నాకు తెలిశాయి  .అప్పుడప్పుడూ తిరుమల రామచంద్రగారు వారిని కలవటానికి వస్తుండే వారు. ఆయనా మీజాన్ లో పనిచేసినవాడేనట. ఆయన రాసిన 'నుడి-నానుడి' వెనుక రాంభట్ల హస్తం చాలా  ఉందని ప్రతీతి. నేను అడిగినా రాంభట్లగారు  అసలు గుట్టు విప్పలేదు.
      చేరిన కొద్దికాలానికే కామరాజుగారు ఈనాడునుంచి అలిగి వెళ్ళిపోయారు. రాంభట్ల గారు జోక్యం చేసుకోగలిగి కూడా చేసుకోక నిర్వికారంగా మిన్నకుండిపోయారు. పేరుకు ఎడిటర్  ( ఎడ్మినిస్ట్రేషన్ ) అయినా  సంతకాలు పెట్టటానికి మించి ఆయనకు నిర్ణయాధికారాలు పెద్దగా ఉండేవికావు. ఉన్న కొద్దిపాటి అధికారాన్ని కూడా ఆయన వినియోగించుకునే వాడు కాదు. అంతకుముందు జగ్గయ్యపేటలో నాకు అనుభవమయినట్టే ఈనాడులోనూ  ప్రతి విషయంలో ఆయన తామరాకు మీద నీటిబొట్టు. ఆఫీసు వ్యవహారాల్లో ఆయన ఎల్లప్పుడూ His Master's Voice .
      రామోజీరావుగారు,  రాంభట్లగారు  చాల ఏళ్ల నుంచీ మిత్రులు. ఈనాడు పెట్టక ముందు కూడా అబిడ్స్ లోని మార్గదర్శి ఆఫీసులో పనివేళల తరవాత వారు తరచుగా కలిసి ఆత్మీయంగా ఇంగ్లీషులో మాట్లాడుకునేవారట. యజమాని దగ్గర అంత చనువు ఉన్నదన్న  దర్పాన్ని రాంభట్ల గారు ఎవరిముందూ  కనపరిచేవారుకాదు.  'ఈనాడులో పని చేసినంత కాలమూ ఆఫీస్ బాయ్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ దాకా ఆయన  అందరితోనూ ఒకే విధంగా స్నేహభావం చూపేవారు. అదే సమయంలో తన డిస్టెన్స్ తాను మెయింటైన్ చేసేవారు. ఏ పనిదొంగో ఆయనని ఏ కాంటీన్ లోనో మాటలలోకి దించి హస్కుకొట్టి ఆ తరవాత ఇంచార్జి చేత తిట్లు తిని  పితూరీ చేస్తే ఈ పెద్దాయన 'నీదే తప్పు. అతడలా అనవలసిందే . నువ్వు పడవలసిందే ' అని నిష్కర్షగా చెప్పేవాడు.
      రాంభట్ల గారు మాటలపోగు. రోజూ ఒకటిరెండు సార్లు ఎడిటోరియల్ డెస్క్ కు వచ్చి కూచునే వారు.  ఏ సబెడిటరో రాస్తున్న ఏ వార్తనో పట్టుకుని ఆయన ఎడ్యుకేట్ చేస్తూ పొతే ఎవరికీ సమయం తెలిసేది కాదు. డెడ్ లైన్లు పాటించవలసిన న్యూస్ ఎడిటరుకూ షిఫ్ట్ ఇంచార్జీలకూమాత్రం మహా ఇబ్బందిగా ఉండేది. కాని అవతలివాడు సాక్షాత్తూ ఎడిటరు.  ఏం చేస్తాం అని గొణుక్కునేవాళ్ళు. ఒక సందర్భాన మోఫసిల్ డెస్క్ ఇంచార్జీగా ఉన్న నేనూ , న్యూస్ ఎడిటరు సంతపురి రఘువీరరావు గారూ కలిసి రామోజీరావుగారి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాం. ఆయన నవ్వి , రాంభట్ల గారిని పిలిచి " ఇదుగో రాంభట్లా ! రేపటినుంచి డెస్క్ కి వెళ్ళకు " అన్నారు. ఆయన 'సరే ' అన్నారు. ఏం లాభం ? మర్నాడు యథా ప్రకారం వచ్చి మామూలు కంటే ఎక్కువ సేపు " లాఠీచార్జి " ( అది ఆయన బాధితులు అభిమానంతో పెట్టుకున్న పేరు) చేశాడు. అదీ ఎంత బాగా అంటే - కిందటిరోజు ఫిర్యాదు చేసిన నేను కూడా ఆయన అనర్గళ ప్రసంగాన్ని అత్యాసక్తితో వింటూ కూచున్నాను!
      అప్పట్లో నేను సికందరాబాదు నుంచి సైకిల్ మీద సోమాజీగూడ ఈనాడు ఆఫీసుకు వెళుతుండే వాడిని . రాంభట్ల గారేమో సాయంత్రం సోమాజీగూడ ఆఫీసునుంచి చిక్కడపల్లి లోని తన ఇంటికి ఈవెనింగ్ వాక్ గా నడిచి వెళుతుండే వారు.   సైకిల్ నడిపించుకుంటూ ఆరు కిలోమీటర్లూ ఆయనతో బాటు నేనూ వెళ్ళేవాడిని. ఏ సుమేరియన్ సంస్కృతి గురించో , హనుమంతుడు సంజీవి పర్వతం మోసుకురావటం గురించో, సత్య హరిశ్చంద్రుడి అబద్ధాల గురించో , కంచర్ల గోపన్న పాపాల గురించో ఆయన అపర గిరీశం లా లెక్చరు ఇస్తూ  మింట్ కాంపౌండ్ మీదుగా చకచక నడిచి పోతుంటే వింటున్న నాకు ఒళ్ళు తెలిసేది కాదు.  ఇల్లు చేరాక కూడా సబ్జెక్టు పూర్తికాకపోతే నన్ను  ఆయన ఇంట్లో కూచోబెట్టి ఇంకో అరగంటో గంటో కంటిన్యూ చేసేవారు. విన్నదంతా నెమరు వేసుకుంటూ మళ్ళీ చిక్కడపల్లి నుంచి సికందరాబాదుకు ఇంకో ఆరు కిలోమీటర్లు సైకిలు మీద వెళ్ళేవాడిని. ఆ రకంగా చాల నెలల 'దారి ముచ్చట్ల ' వల్ల  1955 మధ్యంతర ఎన్నికలలో కమ్యూనిస్టు - కాంగ్రెస్ సైద్ధాంతిక సంఘర్షణల వంటి అనేక ఘట్టాలపై రింగ్ సైడ్ వ్యూ నాకు అవగతమయింది. ఆయనే సరదాగా అన్నట్టు -  రాంభట్లతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్!
     రోజువారీ సంపాదకీయాన్ని గజ్జెల మల్లారెడ్డిగారు రాస్తే ఆదివారం ఎడిటోరియల్ రాంభట్ల గారు రాసే వారు. 1980 లో కాబోలు రాంభట్లగారు ఈనాడు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరవాత రామోజీరావుగారు నా చేత అప్పుడప్పుడూ సంపాదకీయాలు, ఎడిట్ పేజి వ్యాసాలు రాయించే వారు. మల్లారెడ్డిగారు 1983లో ఆంధ్రభూమికి వెళ్ళాక రోజువారీ సంపాదకీయాన్ని నేను, వరదచారిగారు, 'సహవాసి' ఉమమహేశ్వరరావు గారిలో ఒకరం రాసేవాళ్ళం. ఆదివారం సంపాదకీయం మాత్రం ఉద్యోగవిరమణ తరవాత కూడా చాలా రోజులు రాంభట్ల గారే రాసేవారు.  బ్రాహ్మలకు పూర్వీకులు మాలలు అని తేలుస్తూ ఎడిటర్ గా ఉండగానే 'కులమతాల మతలబు' శీర్షికతో  ఆయన రాసిన సంపాదకీయానికి బ్రాహ్మణసమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దివాకర్ల వెంకటావధానిగారిలాంటి పెద్దలు వచ్చి రామోజీరావుగారిని కలిసి నిరసన తెలిపారు. ఆ సంపాదకీయానికి పత్రికా ముఖంగా విచారం వ్యక్తపరిచినట్టు నాకు జ్ఞాపకం . కానీ రాంభట్లగారు మాత్రం బెసగలేదు. తాను రాసింది తప్పంటే ఒప్పుకోలేదు.
    నేను రాసిన ఎడిటోరియల్ అయినా ఎడిట్ పేజీ వ్యాసమైనా , స్పెషల్ స్టోరీ అయినా నేరుగా రామోజీరావుగారితోనే చర్చించి ఆయనకే చూపెవాడిని. కాబట్టి ఉద్యోగపరంగా నా రాతల విషయంలో రాంభట్ల ప్రమేయం ఉండేది కాదు. అయినా నేను రాసింది పత్రికలో శ్రద్ధగా చదివి మెచ్చుకోళ్ళనూ చివాట్లనూ ధారాళంగా అందిస్తుండేవారు. 1984ఆఖరులో నేను తీవ్రంగా జబ్బుపడి మూడునెలలు ఇంటిపట్టున ఉన్న సమయాన పోతన భాగవతం , వేయి పడగలు , కథలు -గాథలు  లాంటి గ్రంథాలను విరివిగా చదివాను. ఆ తరవాత డ్యూటిలో చేరి నేను రాసిన మొదటి సంపాదకీయాన్ని చూసి ' శాస్తుల్లూ! బాగా చదివినట్టున్నావు. మాటలు బాగా పిక్కావు' అని తనదైన శైలిలో రాంభట్ల మెచ్చుకున్నారు.
     రాంభట్ల గారు ఒకప్పుడు ప్రసిద్ధ కార్టూనిస్టు. స్వతహాగా ఆర్టిస్టు. ఆయన ఏది రాసినా బొమ్మ గీసినట్టు, శిల్పం చెక్కినట్టు ఉండేది. ఒక్క కొట్టివేత గానీ , హంసపాదు గాని ఉండేదికాదు. ఏ సబ్జెక్టు మీద అయినా ఎంత తక్కువ వ్యవధిలో అయినా అలవోకగా ప్రామాణిక రచనని బహు సొగసుగా ఆయన రాయగలరు. అయినా డిక్టేటర్ గా ఉండటమే ఆయనకు ఇష్టం. ఆదివారం సంపాదకీయం ఆయన చెప్పే పద్ధతికూడా చిత్రంగా ఉండేది. ఉద్యోగవిరమణ తరవాత ఆయన సీటులో నేను కూచునేవాడిని. ప్రతి గురువారం అనుకున్న సమయానికి ఆయన ఠంచన్ గా వచ్చేవారు. వస్తూనే ' శాస్తుల్లూ ! ఉత్తిష్టంతు ' అనేవారు.( ఏ వైదిక కార్యమైనా మొదలెట్టేముందు భూతపిశాచాలను ఆ చోటు నుంచి లేచివెళ్ళమంటూ ' ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏ తే భూమిభారకాః ..' అన్న శ్లోకం చెపుతారు. నన్నూ అలాగే లేచి తన సీటు తనకు ఇవ్వమని గురువుగారి ఆదేశం! నన్ను భూత పిశాచాలతో పోల్చినందుకు నవ్వుకుంటూ నేను లేచాక ఆయన కూచునే సరికి టైపిస్టు వస్తుంది. లేక వస్తాడు . వెంటనే ఆయన కుర్చీలో వెనక్కి వాలి డిక్టేషను మొదలు పెడతారు. ఒక్కోసారి తనకు ఏదీ తట్టకపోతే 'నీకు ఏ సబ్జెక్టు కావాలి ? అని టైపిస్టునో మరోకరినో  అడిగి వారు  ఏది కోరుకుంటే ఆ విషయం మీద  గడగడ డిక్టేట్ చేస్తారు. మధ్యలో నా వంటి వాళ్ళు ఏదైనా అంటే దాని మీద ఒక అర్ద గంట లెక్చరిచ్చి , తాను ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మళ్ళీ ఎత్తుకుంటారు. పూర్తి  అయిన తరవాత   ప్రూఫు కూడా ఆయన చూడరు. తేట తెనుగులో  పొట్టి పొట్టి వాక్యాలే తప్ప దీర్ఘ సమాసాలు, చేంతాడంత వాక్యాలు ఆయన వాడరు. వర్ధమాన జర్నలిస్టులకు , ఔత్సాహిక రచయితలకు రాంభట్ల రచనలు అవశ్య పఠనీయాలు. విశాలాంధ్రలో పనిచేసిన రోజుల్లో అసెంబ్లీ సమావేశాలలో కమ్యూనిస్టు సభ్యుల ప్రసంగాల గురించి వి.హనుమంతరావు గారు ట్రంక్ కాల్ లో ఐదు నిమిషాలలో చెప్పిన దాన్ని తాను ఒక గ్యాలీ మాటరుగా విస్తరించి రాస్తే ఆయా సభ్యులే మహా ఆనందించేవారని రాంభట్లగారు అనేవారు.
    1983 మార్చి 24 న చిక్కడపల్లి కోనసీమ ద్రావిడ సంఘం హాలులో నా పెళ్లి అయింది . అది చిన్న హాలు . దగ్గరి బంధుమిత్రులు, కొలీగ్స్  ని మాత్రమె పిలిచాను. రాంభట్ల గారిని వెళ్లి ఆహ్వానించలేదు. కనీసం కార్డయినా పంపలేదు. అయినా ఆయన నా మీద ప్రేమ కొద్దీ పెళ్ళికి  వచ్చారు.  ' మా శాస్తుల్లు పెళ్లి అని తెలిసింది. నన్ను ఒకరు పిలవాలా? నేనే వచ్చాను' అంటూ అందరితో కలివిడిగా మాట్లాడారు. పెళ్ళికానుకగా నాకో సిగరెట్టిచ్చి సరదాగా తానూ ఒకటి ముట్టించారు.


     దటీజ్ రాంభట్ల ! కపటం, డాంబికం లేని , మల్లెపూవులా స్వచ్చమైన మనసుగల మంచిమనిషి కాబట్టే రాంభట్ల కృష్ణమూర్తి గారంటే అందరికీ ఇష్టం.
     1990 చివరిలో నేను డిప్యూటీ ఎడిటరుగా  ఆంధ్రప్రభకు , అక్కడినుంచి 1994 లో ఎడిటరుగా ఆంధ్రభూమికి వెళ్ళాక రాంభట్లగారితో సాంగత్యం క్రమేణా సన్నగిల్లింది. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. ఒక సారి బర్కత్  పురా లో తాము కొత్తగా కొనుక్కున్న ఫ్లాట్ చూడమని పిలిచి  చాలా సేపు మాట్లాడారు. అదే మా చివరి కలయిక.