Sunday 31 December 2023

ఇది హిందూ జాతి

 

హిందూ నేషన్-3

                                                

      భారతదేశం నా మాతృభూమి.భారతీయులందరూ నా సహోదరులు.నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం.దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.”

     చైనా యుద్ధకాలంలో  మన తెలుగువాడు పైడిమర్రి వెంకట సుబ్బారావు రాయగా కేంద్ర విద్యా మండలి సమ్మతించి 1964 నుంచీ దేశమంతటా విద్యార్థుల చేత చేయిస్తున్న  జాతీయ ప్రతిజ్ఞ ఇది. ప్రతి పాఠ్య పుస్తకం తెరవగానే  కనపడుతుంది. తరతరాలుగా పాఠశాల దశ నుంచే ఇలా ప్రతిజ్ఞ చేయిస్తున్నాము కదా ? భారతీయులందరూ నా సహోదరులు అన్న అభిమానం దేశవాసుల్లో ఎంతవరకూ కలిగించ గలిగాము? “నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను , సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపదకు గర్వపడుతున్నాను.” అని 140 కోట్ల జనాభాలో ఎంతమంది గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరు? స్వతంత్ర భారతికి 75 ఏళ్ళు నిండిన తరవాతైనా “ఇది నా దేశం ; నా జాతి” అన్న అత్మీయ భావన మన జాతీయులు అనుకుంటున్న అన్ని వర్గాల వారిలో నాటుకునేట్టు చెయ్యగలిగామా? చెయ్యలేకపోతే అసలు లోపం ఎక్కడుంది?

      ఇంతకీ ఏది మన జాతి? ఏమిటి మన జాతీయత?

      ఈ మాటంటే – “ఓస్! అది కూడా తెలియదా? మనది భారత జాతి. మనం భారత జాతీయులం” అని బడి పిల్లవాడు కూడా ఠక్కున చెపుతాడు. ఔనా? నిజమేనా?

      చదువుల నుంచి కొలువుల దాకా..

       ఆధార్ కార్డు, గాస్ కనెక్షన్ ల  నుంచి  బ్యాంకు ఎకౌంటు ,పాస్ పోర్టు ల వరకూ...

      ఏ అవసరానికి   ఏ ఫారం నింపాలన్నా మన ‘నేషనాలిటీ’ ఏమిటో తప్పనిసరిగా పేర్కొనాలి. ఎవరైనా తడుముకోకుండా దానికి “ఇండియన్” అని బదులిస్తారు. పాతకాలంలో అయితే చేతితో రాయవలసి వచ్చేది. ఆన్ లైన్లూ, డ్రాప్ డౌన్లూ వచ్చాక “ఇండియన్” ఆప్షన్ ఎంచుకోవటం మినహా పౌరులకు గత్యంతరం లేదు. భారత పౌరులుగా నమోదు అయిన వారు ప్రతి ఒక్కరినీ భారత జాతీయులుగా పరిగణించటం కరెక్టేనా? పౌరసత్వానికీ , జాతీయతకూ తేడా లేదా? రెండూ ఒకటేనా?

      అసలు జాతీయత అంటే ఏది? జాతి అని దేనిని అంటాం?

      ఈ సందర్భంలో ముందుగా ఒక వివరణ ఇవ్వాలి. చాలా ఇంగ్లిషు మాటలకు తెలుగులో సరైన సమానార్థక పదాలు లేవు. వాడుకలోకి వచ్చిన చాలా పదాలు స్థూలంగా విషయాన్ని పోల్చుకోవటానికే తప్ప మూలంలో ఉద్దేశించిన భావాన్ని కచ్చితంగా convey చెయ్యలేవు. ఉదాహరణకు ఇంగ్లిషులో nation వేరు. race వేరు. రెండిటినీ మనం “జాతి” అనే  అంటాం. ఇంచుమించు ‘నేషన్’కు దగ్గరగా “రాష్ట్ర” అనే సంస్కృత పదం లేకపోలేదు. ‘నేషనల్’ ను హిందీలో ‘రాష్ట్రీయ” గా వ్యవహరించటం తెలిసిందే. కానీ ‘రాష్ట్రం’ అంటే ‘state’ అని మనభాషలో ముద్రపడింది. ‘Hindu Rashtra’ అంటే  ‘హిందూ నేషన్’ అని ఉత్తరాదివారికి చప్పున  అర్థమవుతుంది . కాని- భారత రిపబ్లిక్ లో ఇప్పుడున్న 29 రాష్ట్రాలకు తోడు కొత్తగా ‘హిందూ రాష్ట్రం’ అనేది కోరుతున్నారేమోనని తెలుగువారు కొంతమందైనా  పొరపడగలరు. ఈ ఇబ్బందుల దృష్ట్యా ఒరిజినల్ అర్థం స్ఫురింపజేయటం కోసం ‘అవసరమనుకున్నప్పుడు ‘నేషన్’, ‘రేస్’ వంటి ఆంగ్లపదాలనే ప్రస్తుతానికి మనం ఉపయోగిద్దాం.

      సాధారణంగా ప్రపంచ పటంలో కనపడే దేశాలను “నేషన్స్” అని కూడా వ్యవహరించటం కద్దు. దాన్ని బట్టి ఒక దేశం, లేదా భూఖండం , దానికి ప్రపంచ పటంలో స్థానం ఉండటమే ‘నేషన్” అనిపించుకోవటానికి అర్హత అని చాలామంది భావిస్తారు. నిర్దిష్టమైన సరిహద్దుల నడుమ తనకంటూ ప్రత్యేక భూభాగం ఏ నేషన్ కైనా తప్పక అవసరమే. అలాగని సొంత గడ్డ మాత్రమే ‘నేషన్’ కు ఏకైక ప్రాతిపదిక కాదు. మట్టి ఎంత ముఖ్యమో మనుషులు కూడా అంతే ముఖ్యం. సొంత నేలపై నివసించి , ఆ నేలను ప్రేమించి , అక్కడ ఉన్నవారితో అత్మీయానుబంధం పెంచుకుని , కష్టసుఖాలలో కలిసిమెలిసి పాలుపంచుకునేవారు ...  ఇతరజాతులకు లేని, తమకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతకు, ఉమ్మడి వారసత్వానికి , విలక్షణ సంస్కృతికి   గర్వపడే వారు మాత్రమే ఆ నేలతల్లి బిడ్డలు, ఆ జాతి (నేషన్) కి  వారసులు, హక్కుదారులు అయిన జాతీయులు అనబడతారు.

     అంటే ఏ జాతికైనా తనకంటూ నిర్దిష్టమైన భూఖండం ఉండాలి . అందులో చిరకాలంగా నివసిస్తున్న ప్రజల నడుమ ఏదో ఒక సమానాంశం, ఒక ఉమ్మడి అనుబంధం  ఉండి ఉండాలి. ఆ ఏక సూత్రత జాతి(Race)పరమైనది కావచ్చు. మతానికి సంబంధించినది కావచ్చు. లేదా భాష రీత్యా కావచ్చు. ఇతరేతరమైన విభేదాలు, వైరుధ్యాలు ఎన్నిఉన్నా ఎమోషనల్ గా అందరినీ దగ్గర చేసే  సాంస్కృతిక , సామాజిక బంధం ఎదో ఒకటి ఉండాలి. చారిత్రక ప్రస్థానంలో .  దీర్ఘకాలం కలసి నడిచాము ;  విజయాలను , పరాజయాలను కలిసి అనుభవించాము ; తీపి, చేదు  జ్ఞాపకాలను  కలిసి పంచుకుంటున్నాము - అన్న ఆత్మీయభావం వారి నడుమ ఉండాలి.    మాతృభూమి పట్ల భక్తి, దాని  చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ,విశ్వాసాలు, ఆదర్శాలు  అంటే గౌరవం వారికి పరిపూర్ణంగా  ఉండాలి. తాము ఆ నేల తల్లి సంతానమన్న, ఘన సంస్కృతికి వారసులమన్న మమకారం వారికి సహజంగా కలగాలి . జాతి అభ్యున్నతికి కలిసి పాటుపడాలన్న సంఘీభావం వారికి ఉండాలి.

      ఈ లక్షణాలన్నీ హిందూ జాతికి ఉన్నాయి.  ప్రపంచంలో మహా మేధావులెందరో అంగీకరించిన , ఈ నాటికీ దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ అనుసరిస్తున్న ఏ  కొలమానం ప్రకారం చూసినా  హిందువులు వారికి వారే ప్రత్యేక జాతి అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. 

      దేశ విభజనకు ముందు ముస్లిం లీగు లేవనెత్తిన పాకిస్తాన్ డిమాండు మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సమయాన 1946లో మహమ్మదాలీ జిన్నాను ‘ఎందువల్ల మీరు పాకిస్తాన్ కావాలంటున్నారో’ చెప్పగలరా?’ అని ఎవరో సవాలు చేశారు. ‘చెపుతాను ఐదే ఐదు మాటల్లో! ‘We Muslims are a nation’ అని జిన్నా ప్రసిద్ధమైన జవాబు ఇచ్చాడు. అతడి వాదం లో పస ఎంతన్న వివరాలలోకి ఇక్కడ వెళ్ళనవసరం లేదు. కానీ అందులో ‘ముస్లింలు’ అన్న పదం స్థానంలో ‘హిందువులు’ అని మార్చి మనం కూడా ఐదే ఐదు మాటల్లో ‘We Hindus are a nation’ అని   గర్వంగా , ధైర్యంగా ,అచంచల ఆత్మవిశ్వాసంతో లోకానికి చాటగలం. చాటాలి కూడా.     

      ఉత్తర దిశన హిమాలయాలు. మిగిలిన మూడు దిక్కులా మూడు సముద్రాలు . వాటి నడుమ దేవుడు ఏరికోరి ప్రత్యేకంగా అమర్చిపెట్టినట్టు మనది ప్రత్యేక దేశం . ప్రకృతి ప్రసాదం వలె ఇంత సహజసిద్ధమైన ఎల్లలు కలిగిన దేశాలు ప్రపంచంలో అరుదు. నివసించే భూమి ఎలా ప్రకృతి వరమో  , ఈ జాతి చరిత్ర , దాని సాంస్కృతిక భూమిక అంతే ఘనమైనవి.

       తెలిసీ తెలియని విదేశీ మిషనరీలూ , వారి కిరాయి చరిత్రకారులూ , మెకాలే మానస పుత్రులైన కొక్కిరాయి మేధావులూ , జాతివ్యతిరేక జాతీయ నాయకులూ, వారి తైతక్కల తైనాతీలూ తరాల తరబడి బొంకులాడుతున్నట్టు –

      ఈ దేశం అడ్డదిడ్డపు నానాజాతి సమితి కాదు. విదేశీ దురాక్రమణ దారుల విహారభూమి అసలు కాదు. విదేశీ అవశేషాల , విజాతీయ శక్తుల ఇష్టారాజ్యం అంతకంటే కాదు. ఇది ప్రపంచంలోకెల్లా పురాతనమైన హైందవ జాతి. అది లోకానికి విద్య, విజ్ఞానాల వెలుగు పంచిన దివ్యధాత్రి. దానికున్నది మానవ నాగరికతకు మకుటాయమానమైన సంస్కృతి. మనకు తెలిసినంతలో పది వేల ఏళ్లకు పైనుంచీ అవిచ్ఛిన్నం గా వర్ధిల్లుతూ ,ప్రపంచమంతటా విస్తరించి , సమస్త మానవాళికి సంస్కారాన్ని, సమభావనను, సామరస్యాన్ని, పరమత సహనాన్ని బోధించిన  ఘనచరిత్ర దానికున్నది. కల్పాలూ, మన్వంతరాలూ , మహాయుగాల లెక్కన అనాదిగా , అవ్యాహతంగా ఈ నాటి వరకూ విలసిల్లుతున్న అమోఘ చైతన్య వాహినికి  కాస్తాకూస్తా కాదు ... కనీసం శతకోటి వారసులు!! అనంత జీవన ప్రస్థానంలో చవిచూసిన ఎన్నో దిగ్విజయాల , ఘోర పరాజయాల జ్ఞాపకాలు హిందూ జాతికి ఉద్వేగం కలిగిస్తాయి. ఉత్తేజం రగిలిస్తాయి.  ప్రపంచంలో తమకు మాత్రమే ప్రత్యేకమైన ఉత్తమ విలువలు, మహోన్నత ఆదర్శాలు , మత భేదాలకు అతీతమైన ధార్మిక మూల బంధాలు, సున్నితమైన సెంటిమెంట్లు హిందూ జాతిని విశ్వమంతటిలో విలక్షణంగా , అనితర సాధ్యంగా నిలబెడతాయి. మునుముందుకు నడిపిస్తాయి. లోకంలోని మరే జాతితో, దేశంలోని మరే సమూహంతో, ఇంకే సముదాయంతో పోల్చలేని, కలపలేని, ఇంకే గాటనా కట్ట సాధ్యం కాని జాతి హిందూ జాతి. దాని ప్రాణం , ప్రణవం సనాతన ధర్మం . అదే దాని జీవన విధానం .

     అనుమానం అక్కర్లేదు. హైందవం మతమే! కాని  దేశంలోని అనేకానేక మత సముదాయాలలో అదీ ఒకటి కానే కాదు. అమాం బాపతు మతాల పద్దులో దాన్నీ చేర్చటం కంటే దుర్మార్గం మరొకటి ఉండదు. దేశంలో నూటికి 70 మందికి ప్రాతినిథ్యం వహించే హైందవం మతపరంగా దేశానికి మహారాణి. నిస్సందేహంగా ప్రపంచంలోకెల్లా అత్యుత్కృష్టమైన , మహోదాత్తమైన మతం .

      మతం మాత్రమే కాదు . హైందవం భారతావనికి , దానికి ప్రాణశక్తి లాంటి సనాతన ధర్మానికి సంపూర్ణ హక్కుదారు అయిన జాతి కూడా! అలాగే మతాలకు, తెగలకు , భావధారలకు, రాజకీయ ,సామాజిక దృక్కోణాలకు అతీతంగా మొత్తం దేశానికి బాధ్యతవహించే ధార్మిక శక్తి కూడా!!



      ఈ సత్యాన్ని ఆధునిక కాలంలో అందరికంటే ముందు గ్రహించిన మహనీయుడు స్వామి వివేకానంద. హైందవ యథార్థ తత్వాన్ని ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. కాబట్టే మతానికి , దేశానికి , జాతికి పర్యాయపదంగా , సమానార్థకంగా ఆయన చారిత్రాత్మక ప్రబోధాల్లో హిందూ పదాన్ని ధారాళంగా వాడాడు. చికాగోలో 1893 సెప్టెంబరు 11న ప్రపంచ మతాల సమ్మేళనం లో చేసిన చిరస్మరణీయ ప్రసంగంలో వివేకానంద స్వామి పలికిన ఈ మాటలను మచ్చుకు చూడండి:

      I thank you in the name of the mother of religions, and I thank you in the name of millions and millions of Hindu people of all classes and sects… I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance....I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth.

      (మతాల మహామాత పేరుమీద మీకు నా ధన్యవాదాలు. అన్ని తరగతులకు, అన్ని తెగలకు చెందిన కోటానుకోట్ల హిందూ ప్రజల తరఫున నా ధన్యవాదాలు ... ప్రపంచానికి పరమత సహనాన్ని, సార్వజనీన ఆమోదాన్ని బోధించిన   మతానికి చెందినందుకు నేను గర్విస్తున్నాను...భూమి మీది అన్ని మతాలకు, అన్ని జాతులకు సంబంధించిన పీడితులకు, శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన  జాతికి చెందినవాడిని అయినందుకు నేను గర్వపడుతున్నాను.)

     మా ప్రజలు హిందువులు , మాది హిందూ జాతి , మాది హిందూ మతం అని ఐదు నిమిషాల క్లుప్త ప్రసంగంలో ముచ్చటగా మూడే మూడు వాక్యాల్లో ప్రపంచ వేదిక మీద చాటిన మహాపురుషుడు , మహా ద్రష్ట స్వామి వివేకానంద. ‘హిందూ ప్రజలు’ అన్నాడు కాబట్టి హిందూ మతాన్ని అనుసరించే ఒక వర్గం ప్రజలను మాత్రమే వివేకానందుడు ఉద్దేశించాడేమో? భారతీయులందరూ అన్న అర్థంలోనే ఆయన ‘హిందూ’ పదాన్ని వాడాడని ఎలా చెప్పగలం? అలాగే స్వామీజీ దృష్టిలో ‘జాతి’ అంటే హిందూ జాతే అని ఎందుకు అనుకోవాలి ? ముస్లిములూ , క్రైస్తవులూ, ఇతర మతాలవారూ , మరియు హిందువులతో కూడిన కలగూరగంపనే ఆయన ‘జాతి’ అని పేర్కొని ఉండొచ్చు కదా?

      పాయింటే! సంకర సెక్యులరిజం దుష్ప్రభావం వల్ల మతి చెడ్డ మేధావులకు అలా అనిపించటం సానుభూతితో అర్థం చేసుకోదగ్గదే. కాని ఆ సందేహమూ తర్కానికి నిలబడదు. జీవించినది కొద్దికాలమే అయినా ఎన్నో జీవితకాలాలకు సరిపడిన మహా కార్యాలను అనితర సాధ్యంగా నెరవేర్చిన వివేకానంద స్వామి దేశ దేశాల్లో ప్రభంజనంలా సాగించిన హిందూ ధర్మ ప్రచారంలో , దేశవాసులకు చెర్నాకోలతో కొట్టినట్టు చేసిన ప్రబోధాలలో ‘హిందూ జాతి పునరుత్థానం”, ‘హిందూ జాతి పునరుజ్జీవనం’ , ‘హిందూ జాతి జాగృతి’  గురించి పలుమార్లు ప్రస్తావించాడు. ‘హిందువుల జాతీయ దృక్పథం’ , ‘హిందువుల జాతీయ సంప్రదాయాలు’ , ‘హిందువుల జాతీయ సారస్వతం’,  ‘హిందువుల జాతీయ వైభవం’ , ‘హిందువుల జాతీయ చైతన్యం’ , ‘హిందువుల జాతి లక్షణాలు’ , ‘హిందువుల జాతీయ విధిలిఖితం’  (destiny) , ‘హిందువుల జాతీయ నౌక’ , ‘హిందూ జాతీయ పరమార్థం’ వగైరా ప్రస్తావనలు స్వామీజీ మాటల్లో , రాతల్లో విరివిగా కనపడతాయి.

      జాతీయ జీవనానికి మూలకందమైన ధర్మాన్ని విడనాడలేదు కాబట్టే వెయ్యి ఏళ్ల బానిసత్వం తరవాత కూడా హిందూ జాతి ఇంకా బతికి ఉన్నదని వివేకానందులు ఒక చోట అంటారు. హిందూ మతం, ‘సనాతన ధర్మం హిందూ జాతీయతకు ఆత్మ .దానిని ఎవరూ నాశనం చెయ్యలేక పోయారు కనుకే  హిందూ జాతి ఇప్పటిదాకా మనగలిగింది’ అని ఇంకో సందర్భంలో చెపుతారు. ప్రపంచచరిత్రలో వేరొక జాతికి చెందిన భూమిని ఎన్నడూ ఆక్రమించని వారు హిందువులు మాత్రమే’ అంటారు వేరొకమారు. ఆయన దృష్టిలో హిందూ మతం, హిందూ నేషన్ , హిందూ రేస్ (Race) , ఇండియా అన్నీ ఒక్కటే. అన్నీ సమానార్థకాలే. అందుకే వివేకానంద చాలాచోట్ల ‘ఇండియా’, ‘హిందూ’ పదాలను ఒకే వాక్యంలో పర్యాయపదాలుగా ఉపయోగించేవాడు. ఉదాహరణకు 1899 మార్చి లో  ‘Modern India’ శీర్షికతో ఆయన రాసిన పత్రికా వ్యాసం ముగింపులో సుప్రసిద్ధమైన ఈ వాక్యాలను గమనించండి:

      Oh India! Forget not that the ideal of thy womanhood is Sita, Savitri, Damayanti; forget not that the God thou worshippest is the great ascetic of ascetics, the all-renouncing Shankara, the lord of Uma; ... forget not that thy social order is but the reflex of the infinite Mahamaya; forget not that the lower classes, the ignorant, the poor, the illiterate, the cobbler, the sweeper, are thy flesh and blood, thy brothers. Thou brave one, be bold, take courage, be proud that thou art an Indian (Bhāratavāsī), and proudly proclaim, “I am an Indian, every Indian is my brother. Say, the ignorant Indian, the poor and destitute Indian, the Brahmin Indian, the Pariah Indian is my brother.” Thou, too, clad with a rag round thy loins proudly proclaim at the top of thy voice: ”The Indian is my brother, the Indian is my life. India’s gods and goddesses are my God. India’s society is the cradle of my infancy, the pleasure-garden of my youth, the sacred heaven, the Varanasi of my old age,  Say brother,The soil of India is my highest heaven, the good of India is my good,” and repeat and pray day and night, ”O Gaurinath, O Jagdambe, bestow manliness unto me! O thou Mother of Strength, take away my weakness, take away my unmanliness, and make me a Man!”

[Complete Works of Swami Vivekananda , vol.4, pp.479-480]

      (ఓ ఇండియా! నీ స్త్రీత్వానికి ఆదర్శం సీత, సావిత్రి, దమయంతి అన్న సంగతి మరచిపోకు. నువ్వు పూజించే దేవుడు సన్యాసులలోకెల్లా మహా సన్యాసి, అన్నీ వదిలిపెట్టిన ఉమానాథ శంకరుడు అన్న విషయం మరవకు. నీ సాంఘిక వ్యవస్థ అనంత మహామాయ ప్రతిబింబమని మరచిపోకు. దిగువ తరగతులవారు, అజ్ఞానులు, పేదలు, అక్షరజ్ఞానం లేనివారు , చెప్పులు కుట్టేవారు, వీధులు ఊడ్చేవారు నీ రక్తంలో రక్తం. మాంసంలో మాంసం . వారు నీ సోదరులు. ఓ ధైర్య శాలీ! ధీమాగా ధైర్యం చూపు. భారతవాసి అయినందుకు గర్వించు. “నేను భారతీయుడిని. ప్రతి భారతీయుడు నా సోదరుడు. పామర భారతీయుడు, పేద భారతీయుడు, దరిద్ర భారతీయుడు, బ్రాహ్మణ భారతీయుడు, చండాల భారతీయుడు నా సహోదరుల”ని  సగర్వంగా చాటు. నడుముకు గుడ్డపీలికే కట్టుకుంటేనేమి – గొంతెత్తి గర్వంగా ప్రకటించు : “భారతీయుడు నా సహోదరుడు . భారతీయత నా జీవితం . ఇండియా దేవీ దేవతలే నా దైవం. భారత సమాజమే నా పసితనపు ఊయల. నా యౌవన నందనవనం. పవిత్ర స్వర్గం. నా వార్ధక్యపు వారణాసి.” చెప్పు సోదరా! “ఇండియా నేల  నా పరంధామం . ఇండియా హితమే నా హితం” అని  మళ్ళీ చెప్పు. “ఓ! గౌరీనాథా! ఓ జగదంబా! నాకు మగటిమి ప్రసాదించండి. ఓ శక్తి మాతా! నా బలహీనతను తొలగించు! నా నపుంసకత్వాన్ని తొలగించు. నన్ను మనీషిని చెయ్యి   అని పగలూ రాత్రీ ప్రార్థించు.” )  

     పైన ఉటంకించిన పాసేజి లో వివేకానంద స్వామి ‘ఇండియా’ పదాన్ని 5 సార్లు , ‘ఇండియన్’ పదాన్ని 8 సార్లు ఉపయోగించాడు. ‘హిందూ’ అనే పదం ఎక్కడా లేదు.  కానీ ఆయన చెప్పిందంతా హిందువుల గురించే. చేసిన అద్భుత ప్రబోధం మొత్తమూ  హిందువులను  ఉద్దేశించే! అలా ఎలా చెప్పగలమంటారా? ఈ దేశంలో సీతను, సావిత్రిని, దమయంతిని స్త్రీత్వానికి ఆదర్శంగా పరిగణించేవారు హిందువులు కాక ఇంకెవరు? ఉమానాథ శంకరుడి సర్వ పరిత్యాగ తత్వాన్ని , మహామాయ అనంతత్వాన్ని సమర్చించేవారు హిందువులు కాకపొతే వేరెవరు? అలాగే దేవీ దేవతలందరినీ దైవంగా ఎడారి మతాలవారు పూజిస్తారా? తురకలకూ , కిరస్తానీలకూ ముసలితనంలో వారణాసి గుర్తుకొస్తుందా?!

       విజాతీయ , విధర్మ మతాలకు చెందినవారు అందరినీ కలగలిపి స్వామీజీ ఆ బోధ చేసి ఉంటే ‘ప్రతి హిందువు, ప్రతి ముసల్మాను , ప్రతి క్రైస్తవుడు నా సహోదరులేనని సగర్వంగా ప్రకటించు’ అని ఏదో ఒక చోట తప్పక పేర్కొనేవాడు . కాని ఆయన పరాయి మతాల ఊసే ఎత్తలేదు.  హిందూ సామాజిక వ్యవస్థ అగ్రాసనం వేసిన బ్రాహ్మణుడినీ, అట్టడుగుకు నెట్టిన చండాలుడినీ సహోదరుల వరసలో పక్కపక్కన పేర్కొనటాన్నిబట్టే... హిందూ సమాజంలో దారుణ దుర్వివక్షకు  గురి అయిన చర్మకారులను , సఫాయి పనివారిని ప్రత్యేకంగా ప్రస్తావించటం చూస్తేనే స్వామీజీ చెప్పిందంతా హిందువులను ఉద్దేశించే అని మెడ మీద తల ఉన్న ఏ మానవుడికైనా అర్థమవుతుంది.   ‘హిందువులు’ , ‘హిందూ మతం’ , హిందూ సమాజం’ , హిందూ మతం’  లాంటి  విశేషణాలు పై ఉపదేశంలో  ప్రత్యేకంగా ఎక్కడా ఎందుకు లేదంటే- అసలు అలాంటి అవసరమే లేదు కాబట్టి! స్వామి వివేకానంద దృష్టిలో ‘ఇండియా’ అంటే హిందూ దేశమే కాబట్టి. ‘ఇండియన్’ అంటే హైందవ  జాతీయుడే , హైందవ విశ్వాసాలను, విలువలను గౌరవించే వాడే కాబట్టి.

     ఇండియాను, భారతీయతను ఇంత స్పష్టంగా , స్ఫుటంగా అర్థం చేసుకుని , అంత నిష్కర్షగా  దివ్య ప్రబోధం చేశాడు కాబట్టే వివేకానంద స్వామి హిందూ జాతికి ప్రాతః స్మరణీయుడు.



                                    ……………………………………………………….


                                                  ................

Saturday 30 December 2023

మనది హిందూ దేశం

 

హిందూ నేషన్-2

 


          

నమో హిందుమాతా

సుజాతా నమో జగన్మాతా  || నమో||

అమోఘ దివ్య మహిమ సమేతా

అఖండ వర భారత ఖండ మాతా ||నమో||

వింధ్య హిమాద్రులె వేణీభరముగ

గంగా యమునలె కంఠ హారముగ

ఘన గోదావరి  కటిసూత్రంబుగ

కనులకు పండువ ఘటించు మాతా ||నమో ||

గోలుకొండ నీ రత్నకోశమట

కోహినూరు నీ జడలో పువ్వట

తాజ్ మహలు నీ దివ్య భవనమట

ఆహాహా నీ భాగ్యము మాతా

నమో హిందుమాతా సుజాతా నమో జగన్మాతా

      స్వాతంత్ర్య మనబడేది రావటానికి ముందు...  వచ్చాక చాలా సంవత్సరాలవరకు కూడా  తెలుగు నాట బడికి వెళ్ళగానే పిల్లలచేత పాడించిన ప్రార్థన గీతమిది . భారతమాతను పట్టుకుని హిందు మాత అనిపిస్తారేమిటి అని అప్పట్లో ఎవరూ తగవుకొచ్చే వారు కారు.

        అప్పట్లో ఇండియాను తెలుగులో  “హిందూ దేశం” అనే అనువదించేవారు. “ఇండియన్ హిస్టరీ”ని “హిందూదేశ చరిత్ర” అనే వ్యవహరించే వారు . ఆ అలవాటు చొప్పునే విఖ్యాత చరిత్రకారుడు ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారు 1955 లో రాసిన తన ప్రామాణిక చరిత్ర గ్రంథానికి “హిందూ దేశ చరిత్ర” అని పేరుపెట్టారు. నిక్షేపం లాంటి భారత దేశాన్ని పట్టుకుని “హిందూ దేశం” అంటావేమిటయ్యా , ఈ దేశం హిందూ మతం వారికి మాత్రమే సొంతమా?-అని ఎవరూ ఆయన మీద ఎగిరిపడలేదు.

      1960లలో కూడా మేమందరం ఇండియా అంటే హిందూ దేశం అనే సోషల్ స్టడీస్ పాఠాల్లో చదువుకున్నాం. అది అభ్యంతరం తెలపవలసిన విషయం అన్న ఆలోచన  ఆ కాలాన  ఎవరికీ రాలేదు. ఎందుకంటే  సంకర సెక్యులరిజం అనే రాచపుండు అప్పటికి ఇంకా పుట్టలేదు!

      హైందవం అనేది కేవలం ఒక మతమే కాదు. అది ఈ జాతి జీవన విధానం. మనది హిందూ దేశం, హిందూ జాతి, హిందూ సంస్కృతి, హిందూ సమాజం  అన్న వివేకం 20 వ శతాబ్దం మొదటి పాదం వరకూ మతభేదాలకు అతీతంగాఈ దేశవాసుల్లో అందరికీ ఉండేది. ఆ శతాబ్దంలో పెద్ద ఎత్తున లేచిన మొట్టమొదటి జాతీయ ఉద్యమానికి అదే స్ఫూర్తి.  1905లో బెంగాల్ విభజన కు వ్యతిరేకంగా హిందూ మతస్థులు, మహమ్మదీయ మతస్థులు, క్రైస్తవ మతస్థులు అన్న తేడా లేకుండా మొత్తం  జాతి సింహంలా లేచింది. కోలకతా మహానగరంలో 50 వేల మంది హైందవ దేశభక్తులు ‘వందేమాతరం’ నినాదాలతో కదలి పావన గంగలో పవిత్ర స్నానం చేసి, నుదుట తిలకం ధరించి , చేతిలో భగవద్గీతను పట్టుకుని  కాళీఘాట్ దేవాలయానికి వెళ్ళారు. తెల్ల రాకాసులను తరిమి వేసి భారత మాత దాస్య శృంఖలాలు తెగగొడతామని కాళీమాత ఎదుట సామూహిక శపథం చేశారు. సనాతన ధర్మం వేరు, జాతీయ భావం వేరు అని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. భారత జాతికి సనాతన ధర్మమే చోదక శక్తి అన్న అవగాహన పండితులకూ పామరులకూ సమానంగా ఉండేది.

      ఒక్క “దేశం” అనే అర్థంలోనే కాదు .”జాతి” అర్థంలో కూడా “హిందూ”, “హిందువులు “ అనే పదాలను వెనకటి రోజుల్లో ధారాళంగా ఉపయోగించే వారు. ఇందాక మనం చెప్పుకున్న “స్వదేశీ”, “వందేమాతరం” ఉద్యమం ఉవ్వెత్తున సాగిన కాలాన 1907 ఏప్రిల్ లో జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరంలో వరసగా మూడు రోజులు సభలు పెట్టి ఆంగ్లంలో గొప్ప ప్రసంగాలు చేశారు. ప్రతిరోజూ ఆయన మాట్లాడిన తరువాత, ఆనాటి ప్రసంగ సారాంశాన్ని ప్రఖ్యాత రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు  అనువాదం చేసేవారు. చివరి రోజున పాల్ గారి మాటల ఉత్తేజంతో ఆయనలోని దేశభక్తి ఉప్పొంగి మహాసభలో ఈ ప్రసిద్ధ పద్యం వినిపించారు:

      భరత ఖండంబు చక్కని పాడియావు
      హిందువులు లేగదూడలై  యేడ్చుచుండ
      తెల్లవారను గడుసరి గొల్లవారు
      పితుకుచున్నారు మూతులు  బిగియగట్టి

      “ఆ తేటగీతి  పద్యమును విని సభా సదులు సంతోష పారవశ్యమున బ్రహ్మాండము పగులునట్లు చప్పట్లు కొట్టిరి. ఈ పద్యము అన్ని పత్రికలలోనూ పడెను.  ఈ పద్యమెట్లు ప్రాకి వెళ్ళెనోగాని కృష్ణా నది వంతెన గోడల మీద పెన్సిళ్ళతో వ్రాయబడెను.. అని చిలక మర్తి వారు తన “స్వీయ చరిత్ర”లో రాసుకున్నారు. మొత్తం భారత జాతీయులందరికీ  “హిందువులు” అని ముద్రవేశావేమిటయ్యా ? మేము ‘హిందువులం” ఎలా అవుతాం? – అని హైందవేతర మతాల వారెవరూ మండిపడలేదు. మతాలతో నిమిత్తం లేకుండా భారత జాతీయులందరినీ  “హిందువులు” అని వ్యవహరించటం ఆ కాలాన మామూలే. అదృష్టవశాత్తూ మోహన్ దాస్ గాంధీ గారు అప్పటికింకా దక్షిణాఫ్రికా లోనే ఉన్నారు. కాకినాడ కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో “వందేమాతరం” జాతీయగీతాన్ని పాడటానికి వీల్లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ ఆలీ గారు చిరుబురులాడటం , మహాత్ములవారు అతడికి వంతపాడటం లాంటి జాతీయవైపరీత్యాల దౌర్భాగ్యం మన దేశానికి అప్పటికింకా పట్టలేదు.

      బిపిన్ చంద్ర పాల్ గారు రాజమహేంద్రవరం వచ్చి సభలు చేస్తున్న కాలాన ఇంకో  దేశభక్తుడు ఇంగ్లండులో ఉండి మాతృభూమి విముక్తి కోసం రహస్యంగా విప్లవ కార్యకలాపాలు  సాగిస్తున్నాడు. కర్మంచాలక తెల్లవారికి పట్టుబడ్డాడు. రెండు యావజ్జీవ శిక్షలు అనగా మొత్తం 50 ఏళ్ల కారాగారవాసాన్ని అనుభవించటం కోసం అండమాన్ నరకానికి పంపించబడ్డాడు . అక్కడి సెల్యులార్ జైలులో గాలీ వెలుతురూ లేని ఏకాంత నిర్బంధం గడుపుతూ “అసలు హిందువు అంటే ఎవరు? హిందూ పదం దేనికి సంకేతం ?”  అని తీవ్రంగా ఆలోచించాడు. మేధోమధనంలో తాను గ్రహించిన దానిని జాతిజనులతో పంచుకోవటానికి అక్షర రూపం ఇవ్వదలిచాడు.

      చిత్రహింసల చెరసాలలో రాసుకునేందుకు పెన్నూ పేపరూ దొరకవు. పిసరంత కాగితం ముక్క కనపడ్డా ఖైదీకి దెబ్బలు, సంకెళ్ళు తప్పవు. శతకోటిదరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు ఆ చిక్కుకూ ఒక దారి దొరికింది. సున్నంవేసిన గోడ కాగితమయింది! ముళ్ళు, కోసురాళ్ళు పెన్సిళ్ళు అయ్యాయి!! అలా తెల్ల గోడ మీద అక్షరాలు గిలుకుతూండగా ఒంటరి చీకటి గదిలో ఆ దేశభక్త భావుకుడి మదిలోనుంచి జాలువారిన శ్లోకమిది:

     ఆసింధు సింధు పర్యంతా యస్య భారత భూమికా I

     పిత్రుభూ: పుణ్యభూశ్చైవ స వై హిందురితి స్మృతః I I

     (సింధు నది నుంచి సముద్రాల వరకూ విస్తరించి ఉన్న  భారతవర్షాన్ని తన పితృభూమిగా, పుణ్యభూమిగా తలచేవాడు హిందువు అనబడతాడు)

        “హిందువు” ఎవరు అన్నదానికి  ఇలా సార్వజనీనమయిన , శిరోధార్యమైన తొలి నిర్వచనం ఇచ్చిన చరితార్థుడు  వినాయక్ దామోదర్ సావర్కర్ . లేక  ‘వీర్ సావర్కర్” .


      జైలు గోడమీద ముల్లుతో రాయటమైతే రాశాడు. కాని - రాసినది వెలుగులోకి రావటం ఎలా? రెండు యావజ్జీవ శిక్షలు పడి ప్రవాసం లో మగ్గుతున్నతాను జీవితకాలంలో బయటికి వచ్చే ఆశ లేదు. కనుక త్వరలో విడుదల కానున్న తోటి ఖైదీల చేత గోడమీద రాతలను తలా కాస్త కంఠస్థం చేయించి , వారిద్వారా విడతల వారీగా స్వదేశానికి  చేరవేయించాడు.   అలా 1917-19 మధ్య అండమాన్ నుంచి విడుదల అయిన రాజకీయ ఖైదీల ముఖతః  కొంచెం కొంచెంగా అందిన ఉల్లేఖనాలను సావర్కర్ సహచరులు గుదిగుచ్చి , కొద్దిమంది ప్రముఖులకు రహస్యంగా పంపితే  “హిందూ సంగఠన” వర్గాలలో అది పెద్ద సంచలనమయింది .

       వంచనచేసి భారత దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వంచకులను , క్షమాబిక్ష ప్రార్థనతో తెలివిగా వంచించి  12 ఏళ్ల నిర్బంధం తరవాత ఊహించని రీతిలో


వీర సావర్కర్ 1922లో అండమాన్ చెర నుంచి బయట పడ్డాడు.  ఇండియాకు చేరాడో లేదో   మళ్ళీ జైలు! రత్నగిరి చెరసాలలో  అక్కడి కాంగ్రెస్ రాజకీయ ఖైదీల సౌజన్యంతో కాగితాలూ పెన్సిళ్ళూ సంపాదించి తన మనసులోని భావాలను సావర్కర్ కాగితం మీద పెట్టాడు. అలా రూపు దిద్దుకున్నదే 1923 లో అజ్ఞాత రచయిత పేరిట తొలి వెలుగు చూసిన
“Hindutva : Who Is A Hindu?” . హిందుత్వానికి సంబంధించి అందుబాటులో ఉన్నవాటిలో అదే మొట్టమొదట ఎన్నదగ్గ సిద్ధాంత గ్రంథం.  

       “నమో హిందుమాతా!” అని నోరార స్తుతించి మనది హిందూదేశం అని సగర్వంగా చెప్పుకున్న కాలం నుంచి-  హిందువులమని  చెప్పుకోవటానికి  చాలామంది హిందువులే సిగ్గుపడే దౌర్భాగ్య దుర్గతికి హిందూ సమాజం ఎందుకు , ఎలా దిగజారింది? దేశవాచకమైన , జాతి వాచకమైన” హిందూ” పదం కేవలం ఒక మతానికి ఎందువల్ల , ఎవరి చలవవల్ల పరిమితమైంది? వాస్తవానికి హిందువు ఎవరు? హిందుత్వం అంటే ఏమిటి?

      తరువాయి అధ్యాయాలలో చూద్దాం.



                                          ------------------------------------  

                

Thursday 28 December 2023

ఎందుకొచ్చిన హిందూ?!

                                                                                                                                                                                                                                                                                                                                                                                      
హిందూ నేషన్ -1            

      

 


      

      హిందూ నేషన్ .

      పుస్తకం టైటిలే కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు.

      మనమందరం భారతీయులం. మనది భారత జాతి . మన నేషనాలిటీ ఇండియన్ అని అందరం  అనుకుంటున్నాము కదా! మధ్యలో ఈ హిందూ నేషన్ ఏమిటి?

     హిందూ అనే పదం వాడటం , హిందువులమని పబ్లిగ్గా చెప్పుకోవటం మర్యాదస్తుల లక్షణం కాదు అని హిందూ పుటక పుట్టినవారిలో చాలామంది ఇప్పటికే ఫీలవుతున్నారాయె! ‘హిందూ’ అనే నాటు పదం మాని ‘ఇండిక్’ అనటం ఇప్పుడు చాలామంది మేధావులు అలవాటు చేసుకున్నారాయె! ఒకప్పుడు ‘హిందూ’ , ‘హిందూ’ అని గర్వంగా పలికిన కొన్ని మోతుబరి హైందవ సంస్థలు కూడా సాధ్యమైనంతవరకూ అది మానేసి ‘భారత్’ ,‘భారతీయ’ అనటమే ఈ కాలానికి తగ్గ ఫాషన్ అని నిర్ణయించుకున్నట్టు కనపడుతున్నాయాయె! ఆఖరికి హిందూ మతానికి పెద్దలు, పూజ్యులు, మార్గదర్శకులు అని గుర్తింపు పొందిన మహానుభావులు కూడా ‘హిందూమతమేమిటి? నాన్సెన్స్! హైందవం మతం కాదు. ధర్మం. అది ఒక జీవన విధానం’ అని గంభీరంగా చిన్ముద్ర వేసి జ్ఞానబోధ చేస్తారు. మళ్ళీ ఆ ధర్మం కూడా సనాతనధర్మమే తప్ప హిందూ ధర్మం అనటానికి వీల్లేదని బల్లగుద్ది  వాదిస్తారు.

     తాను మహమ్మదీయుడినని ప్రతి ముసల్మాన్ గర్వంగా ప్రకటించుకుంటాడు. తాను క్రైస్తవుడినని చెప్పుకోవటానికి ఏ క్రైస్తవుడూ సిగ్గుపడడు. కాని హిందూ తల్లిదండ్రులకు పుట్టి, హిందువుగా రికార్డుల్లో నమోదు కాబడి, తద్వారా వచ్చే బెనిఫిట్లు ఏమైనా ఉంటే వాటిని తేరగా అనుభవించేవారు ...  ఇంట్లో హిందూ దేవుళ్ళకు పూజలు,  చాటుగా దండాలు పెట్టుకుని, ఆపద వచ్చినప్పుడు మొక్కులు మొక్కేవారిలో కూడా   చాలామంది తాము హిందువులమని చెప్పుకోవటం నామోషీగా ఫీలవుతారు. ఇస్లాం పట్ల, క్రైస్తవం పట్ల, వాటి ఆచారాలు, విశ్వాసాల పట్ల  ఒళ్ళు దగ్గరపెట్టుకుని బహు గౌరవం కనపరచే విద్యావంతులు, సంస్కారులు, మేధావులు  చాలా మంది హిందూ మతమన్నా. హిందూ దేవుళ్లన్నా , హిందువుల ఆచారాలన్నా , సెంటిమెంట్లన్నా, మత విశ్వాసాలన్నా ఒంటికాలి మీద లేచి నోటికొచ్చినట్టు దుర్భాషలాడతారు. హిందువులుగా చెడబుట్టిన శాల్తీలైతే మరీనూ. హిందూ మతమే ఈ దేశం లో శాంతికీ, భద్రతకూ, మైనారిటీల మనుగడకూ పెద్ద బెడద;  హిందూ మతోన్మాదమే భారత పౌర సమాజానికి పెద్ద ముప్పు- అని ముప్పూటలా తిట్టిపోయనివాడు ఈ దేశంలో మేధావే కాడు. ముస్లిముల టోపీలు, గడ్డాలూ, బురఖాల పట్ల ఎనలేని గౌరవాదరాలు కనపరిచే వారు హిందువుల నుదుట బొట్టును, శిఖనూ, యజ్ఞోపవీతాన్ని ,నామాలను జుగుప్సాకరంగా  హేళన చేస్తారు.

     ఈ రకంగా అన్ని విధాలా నిరాదరణకు గురి అవుతున్న ‘హిందూ’ పదాన్ని ఏకంగా జాతికి జోడించి ‘మనది హిందూ నేషన్’ అనటం హిందువుల్లోనే చాలామంది లౌక్యులకు ఎబ్బెట్టుగా తోచవచ్చు.

     అసలు ‘హిందూ’ అన్న పదమే మన వేదాల్లో గాని , వేదాంగాలలో గాని ఎక్కడా కానరాదు. అది విదేశీయులు నడమంత్రంగా పుట్టించిన మాట.  ఒరిజినల్ గా అది తిట్టుపదం. అరబ్బులో , మరొకరో మనలనూ, మన దేశాన్నీ ఈసడిస్తూ వాడిన మాట .  అలాంటి చెత్త పదం  మనకెందుకు?  మొదటి నుంచీ  వైదిక మతం, వేద సంస్కృతి, ఆర్య నాగరికత,  ఆర్య ధర్మం, ఆర్య లేక వైదిక సంస్కృతి, సనాతన ధర్మం లాంటి పదాలే తప్ప హిందూ మతం, హిందూ ధర్మం అనేవి మహమ్మదీయులు వచ్చి పడేంతవరకూ  మనం ఎరుగం. అదే  ‘భరత భూమి, ‘భరతవర్షం’ , ‘భరత ఖండం’, ‘భరత’ , ‘భారత’, ‘భారతీయ’ పదాలయితే మనకు వేదకాలం నుంచీ వాడుకలో ఉండె ! స్వతంత్రం రావటానికి ముందూ తరవాతా భారతీయ పదాన్నే విరివిగా వాడుతూ వచ్చామాయె! రాజ్యాంగం లో కూడా ‘ఇండియా దటీజ్ భారత్’ అనే రాసుకున్నామాయె! ఇలా అన్ని విధాలా స్థిరమై, అందరికీ ప్రియమైన ‘భారతీయ’ ఎంచక్కా ఉండగా అది కాదని తీరికూర్చుని ‘హిందూ నేషన్’ పితలాటకం తెచ్చిపెట్టటం ఎందుకు? ఈ నేషన్ హిందువులది మాత్రమేనా? ముస్లిములదీ, క్రైస్తవులదీ, మరో మతం వారిదీ కాదా? హిందువులు మాత్రమే తప్ప వేరే మతాలవారెవరూ ఈ దేశంలో ఉండకూడదా? ఉండనివ్వరా? హైందవేతరులు ఇండియన్ రిపబ్లిక్ పౌరులు కారా? వారి పౌరసత్వం లాగెయ్యాలా? దేశం నుంచి గెంటెయ్యాలా? హిందూ మతస్థులకే తప్ప వేరెవరికీ ఈ దేశంలో ఉండే హక్కు లేదా? అలా అనటం ఫాసిజం, నాజీలను మించిన మతోన్మాదం, దురహంకారం కాదా? సభ్య సమాజంలో , నాగరిక ప్రపంచంలో అనవలసిన మాటేనా ఇది?

     ఈ ప్రశ్నలన్నీ నాకు నేనే వేసుకుని అన్నిటికీ దీటైన జవాబులు చెప్పగలననుకున్న తరవాతే ఈ గ్రంథ రచన  మొదలెట్టాను. ఇదీ, దీని తరవాత భాగమూ ప్రశాంతంగా చదివిన జిజ్ఞాసువులెవరికైనా సహేతుకమైన అనుమానాలు నివృత్తి కాగలవని ఆశిస్తున్నాను.

       ఈ గ్రంథ పరంపరకు ఉద్యుక్తమైనది  హైందవం , హిందుత్వం అంటే గిట్టని కుహనా మేధావుల , హిందూ ద్వేషుల  ఎడతెగని సవాళ్ళకు బదులు చెప్పి, హిందూ వ్యతిరేకులతో వాదులాడి  , హిందూ సమాజం లోని ధర్మద్రోహులను కన్విన్స్ చేసేందుకు ఎంతమాత్రం కాదు.  జాతీయ హిందూ సమాజంలో పైన ఉదాహరించిన అమాం బాపతు భ్రష్టులకంటే హిందూమతాన్ని,  హిందూధర్మాన్ని ప్రేమించి , హిందువుగా పుట్టినందుకు గర్వించి , దేశభక్తి, జాతిగర్వం గుండెల నిండా ఉన్న యోగ్యులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా నేటి యువతరంలో హిందుత్వస్ఫూర్తి పరిపూర్ణంగా ఉండి ధర్మవీరుల్లా విజృంభించగల చిచ్చరపిడుగులు అసంఖ్యాకంగా ఉన్నారు. తెలుసుకోవాలని ఉన్నా తెలియజెప్పేవారు దొరకక ... విరోధులు గుప్పించే నిందారోపణలకు ,అసత్య ప్రచారాలకు , అతితెలివి వెటకారాలను ఎలా తిప్పికొట్టాలో తెలియక...  కావలసిన వాస్తవ సమాచారాలు, , చారిత్రక సాక్ష్యాలు  అందుబాటులో లేక-  వారు తికమక పడుతున్నారు. హైందవం అంటే కేవలం మతమన్న దురభిప్రాయం హిందువులలోనే  చాలామందికి   ఉన్నది. హిందుత్వమంటే కేవలం మైనారిటీలతో  సమానమైన మతహక్కుల కోసం కోర్టుల చుట్టూ తిరగటం, అస్తిత్వం నిలుపుకోవటానికి అన్య మతాలవారితో కొట్లాడటం , సోషల్ మీడియాలో వీరాలాపాలు చెయ్యటం , వృథాగా వాదులాడటం అన్న భ్రమలో పలువురు వీర హిందువులే  పడ్డారు.

      మొత్తంగా హిందూ సమాజానికి దాచిపుచ్చుకోవలసిన చీకటి కోణాలు , సిగ్గుపడవలసిన దౌర్బల్యాలు , సమర్థించలేని లొసుగులు , లుకలుకలు చాలా ఉన్నాయన్న దురభిప్రాయం-   హిందూ ద్వేషుల , జాతి వ్యతిరేకుల, వామపక్ష చరిత్రకారుల , విదేశీ తొత్తుల నిరంతర దుష్ప్రచారాల ఫలితంగా-   హిందుత్వ శ్రేణుల్లోనే చాలామందిలో కనిపిస్తుంది. విదేశీయులు అల్లిన అబద్ధాలను ఎండగట్టి,   హిందూ మత ఉజ్జ్వల చరిత్రగురించి , ప్రపంచంలో మరే జాతి సాటి రాలేనంతటి  హిందూ వీరుల శౌర్య పరాక్రమాల గురించి,  హిందూ జాతి పూర్వవైభవం గురించి ,  హిందూ సామాజిక వ్యవస్థ గొప్పతనం గురించి , హిందూ ధర్మ మహౌన్నత్యం గురించి , జాతి గర్వించదగ్గ  సాంస్కృతిక వారసత్వం గురించి నేటి హిందూ యువతకు సరైన అవగాహన కలిగితే  రెట్టించిన ఉత్సాహంతో , మరింత ఆత్మవిశ్వాసంతో కార్యోన్ముఖులై సింహాల్లా పోరాడగలరు. పరమాద్భుతాలే సాధించగలరు. దాదాపు ఒక శతాబ్దకాలంగా జాతికి పట్టిన రాజకీయ గ్రహణాన్ని పటాపంచలు చేయగలరు. హిందూ జాతికి , సిసలైన భారతీయతకు పూర్వ వైభవాన్ని తిరిగి సాధించగలరు. భారతవర్షాన్ని మళ్ళీ విశ్వవిజేతగా , విశ్వగురువుగా , మతకల్లోలిత ప్రపంచాన్ని శాంతి , సుస్థిరతల సురక్షిత తీరానికి చేర్చే ధార్మిక చుక్కానిగా చరితార్థం కావించగలరు.

      ఆ శుభ పరిణామానికి చేతనైన దోహదం చేయాలన్న తలంపే ఈ పుస్తక  రచనకు ప్రేరణ.

     ఇక  ‘భారతీయ’ , ‘హిందూ’ పదాల గుణదోషాలపై  పైన ప్రస్తావించిన వాదాలూ వాదనలకు సంబంధించి  ఒక వివరణ. ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’ అని నోరార కీర్తించే జాతి మనది. భారతభూమితో , భరతవర్షంతో మనకు వేద యుగం నుంచీ ప్రగాఢమైన అనుబంధం ఉంది. ఆ వివరాలు మునుముందు ‘ఒకే దేశం.. ఒకే జాతి’ అద్యాయంలో మీరు చదవబోతున్నారు. ఋగ్వేదం నుంచీ భారత ప్రస్తావన ఉండటం ఎంత కరెక్టో , వేద వేదాంగాలలోగాని , పురాణ వాజ్మయం లో గాని ప్రాచీన గ్రంథాలలో గాని  హిందూ అన్న పదం కనిపించదనటమూ అంతే కరెక్టు. ఆ సంగతి ఒప్పుకోవటానికి భేషజాలు అక్కర్లేదు.

      హిమాలయం సమారంభ యావదిందు సరోవరం |

      తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్ష్యతే||  

      హిమాలయాలు మొదలుకుని దక్షిణ సముద్రం వరకూ విస్తరించినట్టి దైవ నిర్మితమైన దేశాన్ని హిందుస్థానం అంటారన్న బృహస్పతి ఆగమాన్ని కొందరు పెద్దలు ఉటంకిస్తారు .కాని దాని ప్రాచీనత గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగని హిందూ అనేది సింధు నదికి  అరబ్బులు చేసిన అపభ్రంశమనీ , మనగురించి విదేశీయులు  నీచార్థంలో వాడిన తిట్టుపదమని చెప్పటం శుద్ధ తప్పు. తురకలు కాలు మోపటానికి ముందు  వరకూ హిందూ పదం మనం ఎరగమనటం  తప్పున్నర తప్పు.

      ప్రపంచ సారస్వతంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదం లోనే మన భూమినీ , ప్రజలనూ ‘సప్త సింధు’ అని ప్రస్తావించటం కనిపిస్తుంది. సంస్కృత ‘స’ ప్రాకృతంలో, పర్షియన్ తదితర విదేశీ భాషల్లో ‘హ’ గా మారటం కద్దు. ( దాని గురించి మరిన్ని వివరాలు ముందు అధ్యాయాల్లో ఇచ్చాను.) అలా ‘సప్త సింధు’ పలుకుబడిలో ‘హప్త హిందు’ గా మారి దాని నుంచి జాతివాచకంగా ‘హిందు’ పదం  సహజ రీతిలో దేశీయంగా ఉద్భవించిందని, ఆ పదం ద్వారా మనం అనంతరకాలంలో విదేశీయులకు తెలియబడ్డామని భాషావేత్తలు ఏనాడో తేల్చారు. నిజానికి అరబ్బులు, పారశీకుల కంటే చాలా పూర్వమే సింధు నదికి ఆవలి దేశం అన్న గౌరవ అర్థంలో గ్రీకులు INDU పదాన్ని ఉపయోగించారు. సింధు నదిని బట్టి...  సింధు అంటే సముద్రం అనికూడా అర్థం ఉన్నది కాబట్టి ... సముద్ర పరివేష్టితమైన మొత్తం దేశవాసులను  ‘సింధుల’ని పిలవసాగారు.  అదే పోనుపోను హిందువులుగా మారిందని మరొక అభిప్రాయం.  సింధు ప్రాంతంలో నివసించేవారు, వైదిక నాగరికతను అనుసరించేవారు అన్న భౌగోళిక, సాంస్కృతిక అర్థంలోనే జాతి వాచకంగా . గ్రీకులైనా, అరబ్బులైనా , పారశీకులైనా ‘హింద్’ పద ప్రయోగం చేశారన్నది గమనార్హం.

       ఇంగ్లిషు వాళ్ళు తమ సామ్రాజ్య ప్రయోజనాల కోసం , మనకు బుద్ధి మాంద్యం తెచ్చే చేతబడి చేసి ...

     బంగారంలాంటి మన చదువులకు రెండు వందల ఏళ్ల కిందట ‘తెల్ల చెదలు’ పట్టించి , మన బుర్రలు చెడగొట్టిన కారణంగా ....

      1947 ఆగస్టు 15 న మహా భయానక హింస, రక్తప్రవాహాల నడుమ  స్వాతంత్ర్యం అనే పేరిట అధికారపు మార్పిడి మాత్రమే జరిగి , ఆ ‘తెల్ల చెదలే’ నేటికీ మన చడువులనూ, మన బుర్రలనూ పీక్కుతింటున్న పర్యవసానంగా...

       మనం అల్జీమర్స్ రోగుల్లా తయారై మన జాతి మహోజ్వల గత వైభవ చరిత్రను మరచిపోయాము. అందువల్ల మనం దాదాపుగా అందరం   నేడు కలనైనా ఊహించలేని చారిత్రిక అద్భుత సత్యం  ఏమిటంటే-

      ఇవాళ మనం విదేశీయులు , మన దేశానికి, మన జాతికి  పేరు పెట్టేంత తాహతు గలవారు  అని భ్రమ పడుతున్న  గ్రీకులు,  అరబ్బులు , పర్షియన్లు ఎవరో కాదు. వారూ మన దేశం నుంచి వలస వెళ్ళిన మన పూర్వుల సంతతే. వారికి విద్యాబుద్ధులు గరపి నాగరికులను చేసిందీ మనమే. అది ఎలా అన్నది ముందు అధ్యాయాలలో వివరంగా.

      ఒకప్పుడు  ప్రపంచంలో ఎక్కడివారైనా ఏ విద్యకోసమైనా మన దేశానికే రాక తప్పేది కాదు.  పూర్వకాలాన మానవ విజ్ఞానమంతా భారతదేశం  పెట్టిన భిక్షే. అలా మనం చదువు చెప్పిన అరబ్బీ అబ్బీలు మనకు ఏదో తిట్టు పేరు పెడితే అదేదో గొప్ప అయినట్టు దాన్ని మనం తగిలించుకుని తిరగసాగామని చెప్పేవాడు మేధావి కాదు...  శుద్ధ శుంఠ! అరేబియన్లు భూమిమీదికి రావటానికి వేల ఏళ్ల పూర్వమే ప్రాచీన హిందూ దేశం ‘సింధు’ , ‘సప్తసింధు’ పేరిట ప్రపంచానికి సుపరిచితం.

     నిజానికి పూర్వకాలంలో ‘హిందు’ అనేది తిట్టు కాదు . పొగడ్త. ఉదాహరణకు -ప్రాచీన యూదు జాతీయులు బలాన్ని, ప్రతాపాన్ని సూచించే అర్థంలో ‘హిందు’ పదం వాడేవారు. ఇస్లాంకు పూర్వపు అరేబియాలో ‘సో హబ్ మో అలక్క్’ అనే పురాణ గ్రంథంలో ఒక చోట ‘బంధు మిత్రులు పెట్టే హింస ‘హిందూ కత్తి’ వేటు కంటే ప్రాణాంతకమైనదన్న పోలిక ఉన్నది. ప్రాచీన పారశీకుల నానుడిలో ‘హిందూ జవాబు ఇవ్వటం’ అంటే  దిమ్మతిరిగే దెబ్బ కొట్టటం.  పూర్వపు బాబిలోనియన్ల భాషలో  ‘సింధు వస్త్రం’ అంటే మహా నాణ్యమైన వస్త్రం.

     ‘హిందూ’ పదం ఎలా పుట్టింది , ఎప్పుడు పుట్టింది, వేదయుగానికి ముందా తరవాతా అన్నది కాదు. ఒకప్పుడు సింధు దేశాన్ని సూచించిన ‘హిందు’ పదం కాలక్రమంలో దేశ గౌరవానికి , జాతి ప్రతిష్ఠకు, వాటిని నిలబెట్టటానికి ప్రాణాలు బాలి ఇచ్చిన వేలాది , లక్షలాది ధర్మవీరుల పౌరుషానికి, భారతీయ క్షాత్రానికి ప్రతీక గా జాతిజనుల మనస్సులో ముద్రపడి పునీతమైనదన్నదే ఇక్కడ పాయింటు. ఒక హైందవ దేశభక్తుడు వర్ణించినట్టు “సనాతనులు, సత్నామీలు, సిక్కులు, ఆర్యులు, అనార్యులు , మరాఠాలు, మద్రాసీలు , బ్రాహ్మణులు, పంచములు – అందరూ హిందువులుగా భయానక బాధలు పడ్డారు. హిందువులు గానే అద్భత ధర్మవిజయాలు సాధించారు. శత్రువులు మనలను హిందువులుగా ద్వేషించారు. అటోక్ నుంచి కటక్ వరకూ, కాశ్మీరునుంచి కన్యాకుమారి దాకా ప్రజలనూ, జనపదాలనూ, కులాలనూ,తెగలనూ హిందుత్వ బంధమే ఏకం చేసి , వెయ్యి కదనరంగాలలో ధర్మ రక్షణకు ప్రాణాలు ధారవోసేందుకు పురికొల్పింది.”  వందల సంవత్సరాలపాటు హిందూ జాతి సాగించిన స్వాతంత్ర సంగ్రామంలో ఎందరెందరు దేశభక్తుల రక్తంతో,త్యాగంతో, శివాజీ మహారాజ్ వంటి ఎందరు ధర్మవీరుల మహావీరుల శౌర్యంతో, పరాక్రమంతో  హిందూ పదం పునీతమయిందో ఈ వరసలో తరవాతి  పుస్తకంలో మీరు చదువుతారు. ఇంత గొప్ప  వీరుల జాతి ప్రపంచ చరిత్రలో మరొకటి లేదని గర్వపడతారు.

     మహాత్మా గాంధి సైతం మెచ్చిన ప్రసిద్ధ విద్యావేత్త, స్వాతంత్ర్య యోధుడు , కాంగ్రెస్ నాయకుడు  లోక్ నాయక్ ,బాపూజీ  డాక్టర్ మాధవ్ శ్రీహరి Aney గారు ఇలాంటి వాస్తవాలన్నీ జాగ్రత్తగా ఆకళింపు చేసుకున్న మీదట  ఎనభై ఏళ్ల కిందటే ఏమని ధ్రువీకరించారో చూడండి:

     The Hindus are a nation or nationality by themselves. They have a distinctive characteristic culture. They have a common cultural language and a common cultural literature. They have their home-land distinctly marked out on the map from the rest of the world by  natural demarcations. They have developed a corporate sentiment which has enabled them to rise and attain their glorious position more than once during the last thousand years in spite of the invasions and conquests of the barbarous conquering hordes from the North and the West. Hindus in the North and South in spite of superficial difference have common basis for their magnificent architecture, painting, music, dancing and several other fine arts. No sane man can question the proposition that Hindus are a nation.

[ Dr . M.S.Aney in Foreword to We or Our Nationhood defined  By M. S. Golwalkar, pp.23-24]

     ( హిందువులు వారికి వారే  ఒక జాతి . వారిది ఒకే జాతీయత. వారికి విలక్షణమైన సంస్కృతి ఉన్నది. వారి సంస్కృతికి ఒక కామన్ భాష, కామన్ సాహిత్యం  ఉన్నాయి. సహజసిద్ధమైన ఎల్లలతో మిగతా ప్రపంచం నుంచి వేరుగా మాప్ లో  ప్రత్యేకంగా కనపడే  సొంత గడ్డ వారికి  సిద్ధించింది. ఉత్తరం నుంచి పడమర నుంచి ముష్కర మూకలు ఎన్ని దాడులు, ఆక్రమణలు చేసినా తట్టుకుని లేచి మహిమాన్వితమైన స్థితిని సాధించ గలిగిన సమష్టి భావసారూప్యం వారికి ఉన్నది. ఉత్తర, దక్షిణ దేశాల నడుమ పైపైకి  ఎన్ని విభేదాలు కానవచ్చినా శిల్పం, చిత్రలేఖనం , సంగీతం, నాట్యం, వంటి వివిధ లలిత కళల్లో హిందువుల  అద్భుత నైపుణ్యానికి కామన్ ప్రాతిపదిక ఉన్నది..హిందువులు ఒక నేషన్ అనటాన్ని మతి ఉన్నవాడెవడూ ప్రశ్నించలేడు.)

                                             

( నా  "హిందూ నేషన్" గ్రంథం లో  ఇది మొదటి అధ్యాయం. పుస్తకం, దాని అందుబాటు  వివరాలు  కింద )