Sunday 31 December 2023

ఇది హిందూ జాతి

 

హిందూ నేషన్-3

                                                

      భారతదేశం నా మాతృభూమి.భారతీయులందరూ నా సహోదరులు.నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం.దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.”

     చైనా యుద్ధకాలంలో  మన తెలుగువాడు పైడిమర్రి వెంకట సుబ్బారావు రాయగా కేంద్ర విద్యా మండలి సమ్మతించి 1964 నుంచీ దేశమంతటా విద్యార్థుల చేత చేయిస్తున్న  జాతీయ ప్రతిజ్ఞ ఇది. ప్రతి పాఠ్య పుస్తకం తెరవగానే  కనపడుతుంది. తరతరాలుగా పాఠశాల దశ నుంచే ఇలా ప్రతిజ్ఞ చేయిస్తున్నాము కదా ? భారతీయులందరూ నా సహోదరులు అన్న అభిమానం దేశవాసుల్లో ఎంతవరకూ కలిగించ గలిగాము? “నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను , సుసంపన్నమైన నా దేశ వారసత్వ సంపదకు గర్వపడుతున్నాను.” అని 140 కోట్ల జనాభాలో ఎంతమంది గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరు? స్వతంత్ర భారతికి 75 ఏళ్ళు నిండిన తరవాతైనా “ఇది నా దేశం ; నా జాతి” అన్న అత్మీయ భావన మన జాతీయులు అనుకుంటున్న అన్ని వర్గాల వారిలో నాటుకునేట్టు చెయ్యగలిగామా? చెయ్యలేకపోతే అసలు లోపం ఎక్కడుంది?

      ఇంతకీ ఏది మన జాతి? ఏమిటి మన జాతీయత?

      ఈ మాటంటే – “ఓస్! అది కూడా తెలియదా? మనది భారత జాతి. మనం భారత జాతీయులం” అని బడి పిల్లవాడు కూడా ఠక్కున చెపుతాడు. ఔనా? నిజమేనా?

      చదువుల నుంచి కొలువుల దాకా..

       ఆధార్ కార్డు, గాస్ కనెక్షన్ ల  నుంచి  బ్యాంకు ఎకౌంటు ,పాస్ పోర్టు ల వరకూ...

      ఏ అవసరానికి   ఏ ఫారం నింపాలన్నా మన ‘నేషనాలిటీ’ ఏమిటో తప్పనిసరిగా పేర్కొనాలి. ఎవరైనా తడుముకోకుండా దానికి “ఇండియన్” అని బదులిస్తారు. పాతకాలంలో అయితే చేతితో రాయవలసి వచ్చేది. ఆన్ లైన్లూ, డ్రాప్ డౌన్లూ వచ్చాక “ఇండియన్” ఆప్షన్ ఎంచుకోవటం మినహా పౌరులకు గత్యంతరం లేదు. భారత పౌరులుగా నమోదు అయిన వారు ప్రతి ఒక్కరినీ భారత జాతీయులుగా పరిగణించటం కరెక్టేనా? పౌరసత్వానికీ , జాతీయతకూ తేడా లేదా? రెండూ ఒకటేనా?

      అసలు జాతీయత అంటే ఏది? జాతి అని దేనిని అంటాం?

      ఈ సందర్భంలో ముందుగా ఒక వివరణ ఇవ్వాలి. చాలా ఇంగ్లిషు మాటలకు తెలుగులో సరైన సమానార్థక పదాలు లేవు. వాడుకలోకి వచ్చిన చాలా పదాలు స్థూలంగా విషయాన్ని పోల్చుకోవటానికే తప్ప మూలంలో ఉద్దేశించిన భావాన్ని కచ్చితంగా convey చెయ్యలేవు. ఉదాహరణకు ఇంగ్లిషులో nation వేరు. race వేరు. రెండిటినీ మనం “జాతి” అనే  అంటాం. ఇంచుమించు ‘నేషన్’కు దగ్గరగా “రాష్ట్ర” అనే సంస్కృత పదం లేకపోలేదు. ‘నేషనల్’ ను హిందీలో ‘రాష్ట్రీయ” గా వ్యవహరించటం తెలిసిందే. కానీ ‘రాష్ట్రం’ అంటే ‘state’ అని మనభాషలో ముద్రపడింది. ‘Hindu Rashtra’ అంటే  ‘హిందూ నేషన్’ అని ఉత్తరాదివారికి చప్పున  అర్థమవుతుంది . కాని- భారత రిపబ్లిక్ లో ఇప్పుడున్న 29 రాష్ట్రాలకు తోడు కొత్తగా ‘హిందూ రాష్ట్రం’ అనేది కోరుతున్నారేమోనని తెలుగువారు కొంతమందైనా  పొరపడగలరు. ఈ ఇబ్బందుల దృష్ట్యా ఒరిజినల్ అర్థం స్ఫురింపజేయటం కోసం ‘అవసరమనుకున్నప్పుడు ‘నేషన్’, ‘రేస్’ వంటి ఆంగ్లపదాలనే ప్రస్తుతానికి మనం ఉపయోగిద్దాం.

      సాధారణంగా ప్రపంచ పటంలో కనపడే దేశాలను “నేషన్స్” అని కూడా వ్యవహరించటం కద్దు. దాన్ని బట్టి ఒక దేశం, లేదా భూఖండం , దానికి ప్రపంచ పటంలో స్థానం ఉండటమే ‘నేషన్” అనిపించుకోవటానికి అర్హత అని చాలామంది భావిస్తారు. నిర్దిష్టమైన సరిహద్దుల నడుమ తనకంటూ ప్రత్యేక భూభాగం ఏ నేషన్ కైనా తప్పక అవసరమే. అలాగని సొంత గడ్డ మాత్రమే ‘నేషన్’ కు ఏకైక ప్రాతిపదిక కాదు. మట్టి ఎంత ముఖ్యమో మనుషులు కూడా అంతే ముఖ్యం. సొంత నేలపై నివసించి , ఆ నేలను ప్రేమించి , అక్కడ ఉన్నవారితో అత్మీయానుబంధం పెంచుకుని , కష్టసుఖాలలో కలిసిమెలిసి పాలుపంచుకునేవారు ...  ఇతరజాతులకు లేని, తమకు మాత్రమే సొంతమైన ప్రత్యేకతకు, ఉమ్మడి వారసత్వానికి , విలక్షణ సంస్కృతికి   గర్వపడే వారు మాత్రమే ఆ నేలతల్లి బిడ్డలు, ఆ జాతి (నేషన్) కి  వారసులు, హక్కుదారులు అయిన జాతీయులు అనబడతారు.

     అంటే ఏ జాతికైనా తనకంటూ నిర్దిష్టమైన భూఖండం ఉండాలి . అందులో చిరకాలంగా నివసిస్తున్న ప్రజల నడుమ ఏదో ఒక సమానాంశం, ఒక ఉమ్మడి అనుబంధం  ఉండి ఉండాలి. ఆ ఏక సూత్రత జాతి(Race)పరమైనది కావచ్చు. మతానికి సంబంధించినది కావచ్చు. లేదా భాష రీత్యా కావచ్చు. ఇతరేతరమైన విభేదాలు, వైరుధ్యాలు ఎన్నిఉన్నా ఎమోషనల్ గా అందరినీ దగ్గర చేసే  సాంస్కృతిక , సామాజిక బంధం ఎదో ఒకటి ఉండాలి. చారిత్రక ప్రస్థానంలో .  దీర్ఘకాలం కలసి నడిచాము ;  విజయాలను , పరాజయాలను కలిసి అనుభవించాము ; తీపి, చేదు  జ్ఞాపకాలను  కలిసి పంచుకుంటున్నాము - అన్న ఆత్మీయభావం వారి నడుమ ఉండాలి.    మాతృభూమి పట్ల భక్తి, దాని  చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ,విశ్వాసాలు, ఆదర్శాలు  అంటే గౌరవం వారికి పరిపూర్ణంగా  ఉండాలి. తాము ఆ నేల తల్లి సంతానమన్న, ఘన సంస్కృతికి వారసులమన్న మమకారం వారికి సహజంగా కలగాలి . జాతి అభ్యున్నతికి కలిసి పాటుపడాలన్న సంఘీభావం వారికి ఉండాలి.

      ఈ లక్షణాలన్నీ హిందూ జాతికి ఉన్నాయి.  ప్రపంచంలో మహా మేధావులెందరో అంగీకరించిన , ఈ నాటికీ దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ అనుసరిస్తున్న ఏ  కొలమానం ప్రకారం చూసినా  హిందువులు వారికి వారే ప్రత్యేక జాతి అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. 

      దేశ విభజనకు ముందు ముస్లిం లీగు లేవనెత్తిన పాకిస్తాన్ డిమాండు మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సమయాన 1946లో మహమ్మదాలీ జిన్నాను ‘ఎందువల్ల మీరు పాకిస్తాన్ కావాలంటున్నారో’ చెప్పగలరా?’ అని ఎవరో సవాలు చేశారు. ‘చెపుతాను ఐదే ఐదు మాటల్లో! ‘We Muslims are a nation’ అని జిన్నా ప్రసిద్ధమైన జవాబు ఇచ్చాడు. అతడి వాదం లో పస ఎంతన్న వివరాలలోకి ఇక్కడ వెళ్ళనవసరం లేదు. కానీ అందులో ‘ముస్లింలు’ అన్న పదం స్థానంలో ‘హిందువులు’ అని మార్చి మనం కూడా ఐదే ఐదు మాటల్లో ‘We Hindus are a nation’ అని   గర్వంగా , ధైర్యంగా ,అచంచల ఆత్మవిశ్వాసంతో లోకానికి చాటగలం. చాటాలి కూడా.     

      ఉత్తర దిశన హిమాలయాలు. మిగిలిన మూడు దిక్కులా మూడు సముద్రాలు . వాటి నడుమ దేవుడు ఏరికోరి ప్రత్యేకంగా అమర్చిపెట్టినట్టు మనది ప్రత్యేక దేశం . ప్రకృతి ప్రసాదం వలె ఇంత సహజసిద్ధమైన ఎల్లలు కలిగిన దేశాలు ప్రపంచంలో అరుదు. నివసించే భూమి ఎలా ప్రకృతి వరమో  , ఈ జాతి చరిత్ర , దాని సాంస్కృతిక భూమిక అంతే ఘనమైనవి.

       తెలిసీ తెలియని విదేశీ మిషనరీలూ , వారి కిరాయి చరిత్రకారులూ , మెకాలే మానస పుత్రులైన కొక్కిరాయి మేధావులూ , జాతివ్యతిరేక జాతీయ నాయకులూ, వారి తైతక్కల తైనాతీలూ తరాల తరబడి బొంకులాడుతున్నట్టు –

      ఈ దేశం అడ్డదిడ్డపు నానాజాతి సమితి కాదు. విదేశీ దురాక్రమణ దారుల విహారభూమి అసలు కాదు. విదేశీ అవశేషాల , విజాతీయ శక్తుల ఇష్టారాజ్యం అంతకంటే కాదు. ఇది ప్రపంచంలోకెల్లా పురాతనమైన హైందవ జాతి. అది లోకానికి విద్య, విజ్ఞానాల వెలుగు పంచిన దివ్యధాత్రి. దానికున్నది మానవ నాగరికతకు మకుటాయమానమైన సంస్కృతి. మనకు తెలిసినంతలో పది వేల ఏళ్లకు పైనుంచీ అవిచ్ఛిన్నం గా వర్ధిల్లుతూ ,ప్రపంచమంతటా విస్తరించి , సమస్త మానవాళికి సంస్కారాన్ని, సమభావనను, సామరస్యాన్ని, పరమత సహనాన్ని బోధించిన  ఘనచరిత్ర దానికున్నది. కల్పాలూ, మన్వంతరాలూ , మహాయుగాల లెక్కన అనాదిగా , అవ్యాహతంగా ఈ నాటి వరకూ విలసిల్లుతున్న అమోఘ చైతన్య వాహినికి  కాస్తాకూస్తా కాదు ... కనీసం శతకోటి వారసులు!! అనంత జీవన ప్రస్థానంలో చవిచూసిన ఎన్నో దిగ్విజయాల , ఘోర పరాజయాల జ్ఞాపకాలు హిందూ జాతికి ఉద్వేగం కలిగిస్తాయి. ఉత్తేజం రగిలిస్తాయి.  ప్రపంచంలో తమకు మాత్రమే ప్రత్యేకమైన ఉత్తమ విలువలు, మహోన్నత ఆదర్శాలు , మత భేదాలకు అతీతమైన ధార్మిక మూల బంధాలు, సున్నితమైన సెంటిమెంట్లు హిందూ జాతిని విశ్వమంతటిలో విలక్షణంగా , అనితర సాధ్యంగా నిలబెడతాయి. మునుముందుకు నడిపిస్తాయి. లోకంలోని మరే జాతితో, దేశంలోని మరే సమూహంతో, ఇంకే సముదాయంతో పోల్చలేని, కలపలేని, ఇంకే గాటనా కట్ట సాధ్యం కాని జాతి హిందూ జాతి. దాని ప్రాణం , ప్రణవం సనాతన ధర్మం . అదే దాని జీవన విధానం .

     అనుమానం అక్కర్లేదు. హైందవం మతమే! కాని  దేశంలోని అనేకానేక మత సముదాయాలలో అదీ ఒకటి కానే కాదు. అమాం బాపతు మతాల పద్దులో దాన్నీ చేర్చటం కంటే దుర్మార్గం మరొకటి ఉండదు. దేశంలో నూటికి 70 మందికి ప్రాతినిథ్యం వహించే హైందవం మతపరంగా దేశానికి మహారాణి. నిస్సందేహంగా ప్రపంచంలోకెల్లా అత్యుత్కృష్టమైన , మహోదాత్తమైన మతం .

      మతం మాత్రమే కాదు . హైందవం భారతావనికి , దానికి ప్రాణశక్తి లాంటి సనాతన ధర్మానికి సంపూర్ణ హక్కుదారు అయిన జాతి కూడా! అలాగే మతాలకు, తెగలకు , భావధారలకు, రాజకీయ ,సామాజిక దృక్కోణాలకు అతీతంగా మొత్తం దేశానికి బాధ్యతవహించే ధార్మిక శక్తి కూడా!!



      ఈ సత్యాన్ని ఆధునిక కాలంలో అందరికంటే ముందు గ్రహించిన మహనీయుడు స్వామి వివేకానంద. హైందవ యథార్థ తత్వాన్ని ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. కాబట్టే మతానికి , దేశానికి , జాతికి పర్యాయపదంగా , సమానార్థకంగా ఆయన చారిత్రాత్మక ప్రబోధాల్లో హిందూ పదాన్ని ధారాళంగా వాడాడు. చికాగోలో 1893 సెప్టెంబరు 11న ప్రపంచ మతాల సమ్మేళనం లో చేసిన చిరస్మరణీయ ప్రసంగంలో వివేకానంద స్వామి పలికిన ఈ మాటలను మచ్చుకు చూడండి:

      I thank you in the name of the mother of religions, and I thank you in the name of millions and millions of Hindu people of all classes and sects… I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance....I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth.

      (మతాల మహామాత పేరుమీద మీకు నా ధన్యవాదాలు. అన్ని తరగతులకు, అన్ని తెగలకు చెందిన కోటానుకోట్ల హిందూ ప్రజల తరఫున నా ధన్యవాదాలు ... ప్రపంచానికి పరమత సహనాన్ని, సార్వజనీన ఆమోదాన్ని బోధించిన   మతానికి చెందినందుకు నేను గర్విస్తున్నాను...భూమి మీది అన్ని మతాలకు, అన్ని జాతులకు సంబంధించిన పీడితులకు, శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన  జాతికి చెందినవాడిని అయినందుకు నేను గర్వపడుతున్నాను.)

     మా ప్రజలు హిందువులు , మాది హిందూ జాతి , మాది హిందూ మతం అని ఐదు నిమిషాల క్లుప్త ప్రసంగంలో ముచ్చటగా మూడే మూడు వాక్యాల్లో ప్రపంచ వేదిక మీద చాటిన మహాపురుషుడు , మహా ద్రష్ట స్వామి వివేకానంద. ‘హిందూ ప్రజలు’ అన్నాడు కాబట్టి హిందూ మతాన్ని అనుసరించే ఒక వర్గం ప్రజలను మాత్రమే వివేకానందుడు ఉద్దేశించాడేమో? భారతీయులందరూ అన్న అర్థంలోనే ఆయన ‘హిందూ’ పదాన్ని వాడాడని ఎలా చెప్పగలం? అలాగే స్వామీజీ దృష్టిలో ‘జాతి’ అంటే హిందూ జాతే అని ఎందుకు అనుకోవాలి ? ముస్లిములూ , క్రైస్తవులూ, ఇతర మతాలవారూ , మరియు హిందువులతో కూడిన కలగూరగంపనే ఆయన ‘జాతి’ అని పేర్కొని ఉండొచ్చు కదా?

      పాయింటే! సంకర సెక్యులరిజం దుష్ప్రభావం వల్ల మతి చెడ్డ మేధావులకు అలా అనిపించటం సానుభూతితో అర్థం చేసుకోదగ్గదే. కాని ఆ సందేహమూ తర్కానికి నిలబడదు. జీవించినది కొద్దికాలమే అయినా ఎన్నో జీవితకాలాలకు సరిపడిన మహా కార్యాలను అనితర సాధ్యంగా నెరవేర్చిన వివేకానంద స్వామి దేశ దేశాల్లో ప్రభంజనంలా సాగించిన హిందూ ధర్మ ప్రచారంలో , దేశవాసులకు చెర్నాకోలతో కొట్టినట్టు చేసిన ప్రబోధాలలో ‘హిందూ జాతి పునరుత్థానం”, ‘హిందూ జాతి పునరుజ్జీవనం’ , ‘హిందూ జాతి జాగృతి’  గురించి పలుమార్లు ప్రస్తావించాడు. ‘హిందువుల జాతీయ దృక్పథం’ , ‘హిందువుల జాతీయ సంప్రదాయాలు’ , ‘హిందువుల జాతీయ సారస్వతం’,  ‘హిందువుల జాతీయ వైభవం’ , ‘హిందువుల జాతీయ చైతన్యం’ , ‘హిందువుల జాతి లక్షణాలు’ , ‘హిందువుల జాతీయ విధిలిఖితం’  (destiny) , ‘హిందువుల జాతీయ నౌక’ , ‘హిందూ జాతీయ పరమార్థం’ వగైరా ప్రస్తావనలు స్వామీజీ మాటల్లో , రాతల్లో విరివిగా కనపడతాయి.

      జాతీయ జీవనానికి మూలకందమైన ధర్మాన్ని విడనాడలేదు కాబట్టే వెయ్యి ఏళ్ల బానిసత్వం తరవాత కూడా హిందూ జాతి ఇంకా బతికి ఉన్నదని వివేకానందులు ఒక చోట అంటారు. హిందూ మతం, ‘సనాతన ధర్మం హిందూ జాతీయతకు ఆత్మ .దానిని ఎవరూ నాశనం చెయ్యలేక పోయారు కనుకే  హిందూ జాతి ఇప్పటిదాకా మనగలిగింది’ అని ఇంకో సందర్భంలో చెపుతారు. ప్రపంచచరిత్రలో వేరొక జాతికి చెందిన భూమిని ఎన్నడూ ఆక్రమించని వారు హిందువులు మాత్రమే’ అంటారు వేరొకమారు. ఆయన దృష్టిలో హిందూ మతం, హిందూ నేషన్ , హిందూ రేస్ (Race) , ఇండియా అన్నీ ఒక్కటే. అన్నీ సమానార్థకాలే. అందుకే వివేకానంద చాలాచోట్ల ‘ఇండియా’, ‘హిందూ’ పదాలను ఒకే వాక్యంలో పర్యాయపదాలుగా ఉపయోగించేవాడు. ఉదాహరణకు 1899 మార్చి లో  ‘Modern India’ శీర్షికతో ఆయన రాసిన పత్రికా వ్యాసం ముగింపులో సుప్రసిద్ధమైన ఈ వాక్యాలను గమనించండి:

      Oh India! Forget not that the ideal of thy womanhood is Sita, Savitri, Damayanti; forget not that the God thou worshippest is the great ascetic of ascetics, the all-renouncing Shankara, the lord of Uma; ... forget not that thy social order is but the reflex of the infinite Mahamaya; forget not that the lower classes, the ignorant, the poor, the illiterate, the cobbler, the sweeper, are thy flesh and blood, thy brothers. Thou brave one, be bold, take courage, be proud that thou art an Indian (Bhāratavāsī), and proudly proclaim, “I am an Indian, every Indian is my brother. Say, the ignorant Indian, the poor and destitute Indian, the Brahmin Indian, the Pariah Indian is my brother.” Thou, too, clad with a rag round thy loins proudly proclaim at the top of thy voice: ”The Indian is my brother, the Indian is my life. India’s gods and goddesses are my God. India’s society is the cradle of my infancy, the pleasure-garden of my youth, the sacred heaven, the Varanasi of my old age,  Say brother,The soil of India is my highest heaven, the good of India is my good,” and repeat and pray day and night, ”O Gaurinath, O Jagdambe, bestow manliness unto me! O thou Mother of Strength, take away my weakness, take away my unmanliness, and make me a Man!”

[Complete Works of Swami Vivekananda , vol.4, pp.479-480]

      (ఓ ఇండియా! నీ స్త్రీత్వానికి ఆదర్శం సీత, సావిత్రి, దమయంతి అన్న సంగతి మరచిపోకు. నువ్వు పూజించే దేవుడు సన్యాసులలోకెల్లా మహా సన్యాసి, అన్నీ వదిలిపెట్టిన ఉమానాథ శంకరుడు అన్న విషయం మరవకు. నీ సాంఘిక వ్యవస్థ అనంత మహామాయ ప్రతిబింబమని మరచిపోకు. దిగువ తరగతులవారు, అజ్ఞానులు, పేదలు, అక్షరజ్ఞానం లేనివారు , చెప్పులు కుట్టేవారు, వీధులు ఊడ్చేవారు నీ రక్తంలో రక్తం. మాంసంలో మాంసం . వారు నీ సోదరులు. ఓ ధైర్య శాలీ! ధీమాగా ధైర్యం చూపు. భారతవాసి అయినందుకు గర్వించు. “నేను భారతీయుడిని. ప్రతి భారతీయుడు నా సోదరుడు. పామర భారతీయుడు, పేద భారతీయుడు, దరిద్ర భారతీయుడు, బ్రాహ్మణ భారతీయుడు, చండాల భారతీయుడు నా సహోదరుల”ని  సగర్వంగా చాటు. నడుముకు గుడ్డపీలికే కట్టుకుంటేనేమి – గొంతెత్తి గర్వంగా ప్రకటించు : “భారతీయుడు నా సహోదరుడు . భారతీయత నా జీవితం . ఇండియా దేవీ దేవతలే నా దైవం. భారత సమాజమే నా పసితనపు ఊయల. నా యౌవన నందనవనం. పవిత్ర స్వర్గం. నా వార్ధక్యపు వారణాసి.” చెప్పు సోదరా! “ఇండియా నేల  నా పరంధామం . ఇండియా హితమే నా హితం” అని  మళ్ళీ చెప్పు. “ఓ! గౌరీనాథా! ఓ జగదంబా! నాకు మగటిమి ప్రసాదించండి. ఓ శక్తి మాతా! నా బలహీనతను తొలగించు! నా నపుంసకత్వాన్ని తొలగించు. నన్ను మనీషిని చెయ్యి   అని పగలూ రాత్రీ ప్రార్థించు.” )  

     పైన ఉటంకించిన పాసేజి లో వివేకానంద స్వామి ‘ఇండియా’ పదాన్ని 5 సార్లు , ‘ఇండియన్’ పదాన్ని 8 సార్లు ఉపయోగించాడు. ‘హిందూ’ అనే పదం ఎక్కడా లేదు.  కానీ ఆయన చెప్పిందంతా హిందువుల గురించే. చేసిన అద్భుత ప్రబోధం మొత్తమూ  హిందువులను  ఉద్దేశించే! అలా ఎలా చెప్పగలమంటారా? ఈ దేశంలో సీతను, సావిత్రిని, దమయంతిని స్త్రీత్వానికి ఆదర్శంగా పరిగణించేవారు హిందువులు కాక ఇంకెవరు? ఉమానాథ శంకరుడి సర్వ పరిత్యాగ తత్వాన్ని , మహామాయ అనంతత్వాన్ని సమర్చించేవారు హిందువులు కాకపొతే వేరెవరు? అలాగే దేవీ దేవతలందరినీ దైవంగా ఎడారి మతాలవారు పూజిస్తారా? తురకలకూ , కిరస్తానీలకూ ముసలితనంలో వారణాసి గుర్తుకొస్తుందా?!

       విజాతీయ , విధర్మ మతాలకు చెందినవారు అందరినీ కలగలిపి స్వామీజీ ఆ బోధ చేసి ఉంటే ‘ప్రతి హిందువు, ప్రతి ముసల్మాను , ప్రతి క్రైస్తవుడు నా సహోదరులేనని సగర్వంగా ప్రకటించు’ అని ఏదో ఒక చోట తప్పక పేర్కొనేవాడు . కాని ఆయన పరాయి మతాల ఊసే ఎత్తలేదు.  హిందూ సామాజిక వ్యవస్థ అగ్రాసనం వేసిన బ్రాహ్మణుడినీ, అట్టడుగుకు నెట్టిన చండాలుడినీ సహోదరుల వరసలో పక్కపక్కన పేర్కొనటాన్నిబట్టే... హిందూ సమాజంలో దారుణ దుర్వివక్షకు  గురి అయిన చర్మకారులను , సఫాయి పనివారిని ప్రత్యేకంగా ప్రస్తావించటం చూస్తేనే స్వామీజీ చెప్పిందంతా హిందువులను ఉద్దేశించే అని మెడ మీద తల ఉన్న ఏ మానవుడికైనా అర్థమవుతుంది.   ‘హిందువులు’ , ‘హిందూ మతం’ , హిందూ సమాజం’ , హిందూ మతం’  లాంటి  విశేషణాలు పై ఉపదేశంలో  ప్రత్యేకంగా ఎక్కడా ఎందుకు లేదంటే- అసలు అలాంటి అవసరమే లేదు కాబట్టి! స్వామి వివేకానంద దృష్టిలో ‘ఇండియా’ అంటే హిందూ దేశమే కాబట్టి. ‘ఇండియన్’ అంటే హైందవ  జాతీయుడే , హైందవ విశ్వాసాలను, విలువలను గౌరవించే వాడే కాబట్టి.

     ఇండియాను, భారతీయతను ఇంత స్పష్టంగా , స్ఫుటంగా అర్థం చేసుకుని , అంత నిష్కర్షగా  దివ్య ప్రబోధం చేశాడు కాబట్టే వివేకానంద స్వామి హిందూ జాతికి ప్రాతః స్మరణీయుడు.



                                    ……………………………………………………….


                                                  ................

No comments:

Post a Comment