Friday 5 January 2024

మనకు స్వతంత్రం రాలేదు

హిందూ నేషన్- 8



      నిజాన్ని అంగీకరించే ధైర్యం ఉండాలే గాని  హిందూ జాతి దీనావస్థకు  మూల కారణం కనపడుతూనే ఉంది. సూక్ష్మంగా చెప్పాలంటే-

      నేతాజీ సుభాస్ చంద్ర బోస్ సింగపూర్ కేంద్రంగా స్వతంత్ర భారత (ప్రవాస) ప్రభుత్వాన్ని 
స్థాపించి, ఆజాద్ హింద్ ఫౌజ్ను కూడగట్టి భారత సరిహద్దులో సాగించిన భీకర సాయుధ సంగ్రామపు 
ప్రకంపనాలకు తాళలేక  తెల్లదొరతనం బెంబేలెత్తి ఆదరాబాదరా సామాన్లు సర్దుకుని ఇండియా నుంచి దౌడు 
తీసింది. ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికన అవిభక్త భారత దేశం లోని  ముస్లిములు  తమది ప్రత్యేకజాతిగా 
అంతర్జాతీయ గుర్తింపు, స్వతంత్ర రాజ్య ప్రతిపత్తి పొందగలిగారు. పాకిస్తాన్ అనే నేషనల్ హోమ్ లాండ్ లో 
ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి తమ మత సిద్ధాంతాలకూ , విశ్వాసాలకూ తగ్గట్టుగా రాజ్యాంగాన్ని తయారుచేసుకుని
 తమ మతాన్నీ ,తమ సంస్కృతినీ  తమకు కావలసినరీతిలో అభివృద్ధి చేసుకోగలిగారు.
      రెండు జాతుల సిద్ధాంతానికి  బ్రిటిష్ కలోనియల్ పాలకులూ , భారత నాయకులూ కూడా
 ఆమోదం తెలిపాక ...దేశాన్ని చీల్చి ముస్లిం రాజ్యాన్ని ముస్లిములకు పంచేశాక మిగిలేది హిందూ రాజ్యమే కదా? 
అక్కడ హిందూ మతానికి, దాని జీవనాడి అయిన సనాతన ధర్మానికీ , హిందువుల  జాతీయ సంస్కృతికీ , 
హిందువులకే కదా ప్రథమ ప్రాధాన్యం, ప్రాముఖ్యం , అత్యంత గౌరవ స్థానం దక్కవలసింది? 
      కాదు. అలా కుదరదు. హిందూ మెజారిటీ స్వతంత్ర దేశంలో హిందువులకు , వారి మత,
 సంస్కృతులకురాజపూజ్యత ,అన్నింటిలో పెద్దపీట ఉండాలనటం మహాపాపం; అనాగరిక, సంకుచిత, 
అప్రజాస్వామిక పాపిష్టి ఆలోచనావిధానం ! పక్కా మతతత్త్వం  ; నీచ ధూర్త మతోన్మాదం ! అలా అయితే
మైనారిటీలు నొచ్చుకుంటారు ;ఇబ్బంది పడతారు.కాబట్టి హిందూ దేశంలో హిందూ మతానికి గౌరవ స్థానం 
కుదరదు. అలాగని మైనారిటీలతో మీరూ సమానం కూడా కాదు. ఎప్పుడూ వారు అన్నివిధాల పైన ఉండ
వలసిందే . మీరు కింద పడిఉండవలసిందే. రాజ్యాంగ రక్షణలు,ప్రత్యేక హక్కులు, విద్యలో, ఉద్యోగాలలో 
ప్రోత్సాహకాలు, స్కాలర్ షిప్పులు ,పెన్షన్లు అన్నీ మత ప్రాతిపదికన మైనారిటీలకు మాత్రమే!  అవన్నీ
 మీకూ కావాలంటే హిందూ మతం వదిలేసి ఏదైనా మైనారిటీ మతంలోకిమారాల్సిందే అని చెప్పకనే
 చెప్పారు  కాంగ్రెసు మార్కు  “పెద్ద మనుషులు” . నెహ్రూ ప్రవక్త పూనికతో అందరూ కలిసి దానికి
 ఇండియన్ బ్రాండ్ “సెక్యులరిజం” అనే పవిత్ర నామం తగిలించారు. 
     అంటే- 1947 లో  అవిభక్త భారత దేశంలోని  ముస్లిం జాతికి స్వాతంత్ర్యం వచ్చింది. హిందూ
 జాతి ఇంకా స్వాతంత్ర్యం పొందలేదు. స్వరాజ్యాన్ని చవిచూడలేదు. 1947 లో ముస్లిముల విషయంలో
 జరిగినట్టు  హిందువులకు ఒక జాతిగా గుర్తింపు దక్కలేదు. సొంత హిందూ రాష్ట్రం అంటూ ఏర్పడలేదు. 
వారి నేషనల్హోమ్ లాండు మీద  వారికి , వారి ధర్మానికి కంట్రోలు ఏదీ చిక్కలేదు.
 ( పుట్టుక రీత్యా, పేరును బట్టి ,తల్లితండ్రులను బట్టి హిందువులైనప్పటికీ , ఆచరణలో హిందూ మత 
ప్రయోజనాలకు బద్ధ వ్యతిరేకంగా నాయకులు, పాలకులు  హిందువులకు పగవాళ్లే తప్ప తమవాళ్ళు కారు
. వారి సోకాల్డ్  సెక్యులర్ ఏలుబడి  హైందవ ధర్మబద్ధ పరిపాలన అనటానికి వీల్లేదు.  
      దారితప్పటం అలా మొదలైంది. కాంగ్రెసు మాయావుల సెక్యులర్ మాయలో పడి లక్ష్యానికి,
 గమ్యానికి చాలా దూరమయ్యాం.  ఆ వైనాలు ఇంకోసారి వివరంగా చెప్పుకుందాం. 
      నెహ్రూ అండ్ కో తమ కళ్ళకు కట్టిన మాయ సెక్యులర్ పట్టీలు  తీసి పారేయనంతవరకూ సెక్యులర్ 
పద్మవ్యూహం నుంచిహిందూ జాతి బయటపడదు. హిందూ వ్యతిరేక రాజ్యాంగ వ్యవస్థను మార్చనంత 
వరకూ బ్రహ్మదేవుడు వచ్చి  ప్రధానమంత్రి కుర్చీలో కూచున్నాపరిస్థితి సమూలంగా మారదు. తామే 
దేశంలోకెల్లా పెద్ద వోటు బ్యాంకు అన్న తెలివిడి , సంఖ్యాబలంతో ఎవరినైనా శాసించి, ఆదేశించి, తమకు  
కావలసిన రీతిలో  రాజ్యవ్యవస్థను  తాము మలుచుకోగలమన్న విశ్వాసం మునుముందు  జాతీయ హిందూ 
సమాజానికి గట్టిపడాలి.  మనుషుల మీద భ్రమలను వదిలించుకుని, అనుభవాలనుంచి  గుణ పాఠం
 నేర్వాలి . మతానికి , ధర్మానికి, దేశానికి  చుట్టుముట్టిన ఆపదల తీవ్రతను గుర్తించి రెండో  
స్వాతంత్ర్య సంగ్రామానికి వ్యూహాత్మకంగా, సంఘటితంగా  ముందుకు సాగితే హిందూ జాతి వేల సంవత్సరాల 
పర్యంతం ,మత సహిష్ణుతతో , సకల జనశ్రేయోదాయకంగా వర్ధిల్లగలిగిన హైందవ రాజ్య వ్యవస్థను దేశంలో 
కాలానుగుణంగా మళ్ళీ ప్రతిష్ఠించగలదు.  నైతిక బలంతో మరోమారు   ప్రపంచాన్ని జయించగలదు. హిందూ
 నేషన్ కీర్తి, ప్రశస్తి ఇండియా దటీజ్ భారత్ కు గర్వకారణం కాగలదు. 
                   “తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః” 


 
 



No comments:

Post a Comment