Tuesday 20 March 2018

నెల జీతం పది రూపాయలు

పాతముచ్చట్లు - 8

ఎం.వి.ఆర్.శాస్త్రి
.......
   ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది .

   జర్నలిస్టుగా నా మొదటి జీతం నెలకు 10  రూపాయలు !

   నిజానికి అది జీతం కాదు ...   పారితోషికం .... అదికూడా తపాలా ఖర్చుల నిమిత్తం.

   అయితేనేమి ? 'ఆంధ్ర జ్యోతి ' దినపత్రికకు ఆనరరీ కరస్పాండెంటు గా మా ఊళ్ళో నన్ను నియమించినట్టు పత్రిక కార్యాలయం నుంచి నేటికి 44 ఏళ్ళ కింద ( 1974 ఏప్రిల్ లో ) ఉత్తరం అందుకున్నప్పుడు పట్టరాని పరమానందం .జన్మ ధన్యమైందన్న ఫీలింగు.




   అంతకుమునుపూ నేను విలేఖరినే. కాని బినామీని. అసలు విలేఖరి మా నాన్న . ఆంధ్రపత్రిక కు వార్తలు రాసేదీ , ఊళ్ళో కొత్తవాళ్ల చేత విలేఖరిగా గుర్తింపు పొందినదీ నేనే. అయినా సొంతంగా నా పేర విలేఖరిగా విజిటింగ్ కార్డు , లెటర్ హెడ్డు వేయించుకోవాలని , నా పేరు పేపర్లో చూసుకోవాలని మాచెడ్డ కోరిక.

   అప్పట్లో జగ్గయ్యపేట తాలూకా కేంద్రం కూడా కాదు. మేజర్ పంచాయితీ ! డిప్యూటీ తాసిల్దారు చాలా పెద్ద ఆఫీసరు. సబ్ ఇన్స్పెక్టర్ ఆ చుట్టుపట్ల ఊళ్లన్నిటికీ  కలిపి పెద్ద పోలీస్  అధికారి. సర్పంచ్, పంచాయతీ ఈవో , ప్రభుత్వాస్పత్రి డాక్టరు, ఎల్ ఎం బీ చైర్మను, పక్కనే చిల్లకల్లు కేంద్రం లో పంచాయతి సమితి ప్రెసిడెంటు ముఖ్యమైన న్యూస్ సోర్సులు. ఇప్పుడు మూడు మండలాల పెట్టు అయిన సబ్ తాలూకా అంతటికీ కలిపి జగ్గయ్యపేటలో ఇద్దరమే విలేఖరులం. కాబట్టి మాకు మహా గిరాకీ.

  రెండోవాడు పంగనామముల ( పి.వి.ఎం.ఎల్. ) నరసింహారావు. నా బాల్యమిత్రుడు. ఒకటో క్లాసు నుంచీ జిగ్రీ దోస్తు. పూర్వం వాళ్ళ నాన్న హిందూ పత్రికకూ , మా నాన్న ఆంధ్రపత్రికకూ విలేఖరులు. మా జమానాలో నేను ఆంధ్రజ్యోతికీ , వాడు ఆంధ్రప్రభకూ విలేఖరులం. మారం సత్యనారాయణ అని మూడో అయన ఆంధ్రజ్యోతి కి విలేఖరిగా ఉండేవాడు . ఒత్తిళ్లను తట్టుకోవటం తనవల్ల కాదని ఆయన మానుకున్నాడు. ఆ ఖాళీలోకి నేను వచ్చాను.

   నేనూ , మా వాడూ ఉదయమే బయలుదేరి ఊరంతా , ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టి వార్తలు సేకరించేవాళ్ళం. మీటింగులు , నేరాలు లాంటి రొటీన్ వార్తలు కలిసి రాస్తూనే ఎక్స్ క్లూజివ్  వార్తలు ఎక్కడ దొరుకుతాయా అని ఒకరికి చెప్పకుండా ఒకరం తెగ గాలిస్తుండే వాళ్ళం.   ఏమి రాస్తున్నావురా అని అడిగినా మామూలువాటి గురించే తప్ప ఎక్స్ క్లూజివ్ ల  సంగతి రెండోవాడికి వాసన రానిచ్చే వాళ్ళం కాదు. దాన్ని పేపర్లో చూసి అవతలివాడు కుళ్ళుకుంటూంటే చూడటం మజా.


                           
                            నరసింహారావు , సూర్యనారాయణ బాబు ,నేను 

  సమస్య ఏమిటంటే రాసిపంపింది పేపర్లో ఎప్పుడొస్తుందో , అసలు వస్తుందో రాదో తెలియదు. ఇప్పటివలె  రాత్రి పొద్దుపోయాక వార్త పంపినా మర్నాడు పేపర్లో ప్రముఖంగా వచ్చే రోజులు కావవి. ముఖ్యమైన వార్తలైతే ప్రెస్ టెలిగ్రాం ద్వారా పంపేవాళ్ళం. లేదా ఎవరన్నా పుణ్యాత్ములు లేక ఇంటరెస్టెడ్ పార్టీలు ఫోన్ చేసుకోమంటే ( అప్పుడు ఊరు మొత్తం మీద పాతికో ముప్ఫయో ఫోన్లు ఉండేవి. లోకల్ కాల్ మాట్లాడాలన్నా టెలిఫోన్ ఎక్స్చేంజి ని అడిగితే నంబర్ కలిపి ఇచ్చేవారు. మామూలు ట్రంక్ కాల్ అయితే దూరాన్ని బట్టి కనీసం గంట నుంచి పూట వరకూ లేక తేదీ మారే లోగా మన అదృష్టాన్ని బట్టి ఎప్పుడైనా రావచ్చు. దాని కోసం పడిగాపులు ) ట్రంక్ కాల్ లో రిపోర్ట్ పంపేవాళ్ళం. నిజంగా ఇంపార్టెంటు అని పత్రిక ఆఫీసు వాడు అనుకోకపోతే తన టైం వేస్టు చేసినందుకు చికాకు పడతాడు.

   అందుకని సాధారణంగా ఆర్డినరీ పోస్టులోనే రిపోర్టులు పంపేవాళ్ళం. మరునాడో, మూడో నాడో అవి 75 కిలోమీటర్ల దూరం లోని విజయవాడ చేరితే , దాన్ని చూసిన సబ్ ఎడిటర్ మూడ్ ని బట్టి , తత్వాన్ని బట్టి అది పత్రికలో ఎప్పుడు ఎంత ప్రాధాన్యంతో ఎలా అచ్చవుతుంది , లేక బుట్టదాఖలు అవుతుందా అన్నది ఆధారపడేది.  మా ఊరి దగ్గర కంభంపాడు వాడయిన భండారు శ్రీనివాస రావు గారు లాంటి సబ్ ఎడిటర్ ఆ సమయానికి డ్యూటీ లో ఉంటే వార్తలు బాగా వచ్చేవి. పేపర్ రాగానే పరీక్ష రిజల్ట్ కోసం చూసే విద్యార్థిలా వార్త పడిందా లేదా , నలుగురిలో పరువు నిలిచిందా లేదా అని ఆత్రంగా వెతుక్కునే వాళ్ళం. అప్పుడు మనం పంపిన స్పెషల్ స్టొరీ ఏ ఫస్టు పేజీలోనో ప్రముఖంగా వస్తే ఎనుగెక్కినంత సంబరం.  ఆ రోజంతా గాలిలో తేలిపోవటమే!

  ఫస్టు పేజీ దాకా ఎందుకు? మా ఊరి వార్త వారం రోజులు లేటుగా అయినా పేపర్లో వస్తే " జగ్గయ్యపేట పేరు పేపర్లో పడింది "అని నా చిన్నతనంలో జనం గొప్పగా చెప్పుకునే వాళ్ళు. నేను ఆంధ్రజ్యోతి విలేఖరి అయ్యాకే మా వూరి వార్తలు రోజూ రావటం మొదలైంది. అప్పుడు కూడా నాలుగైదు వార్తలు  ఒకే రోజున వస్తే ఆ రోజు ఊరంతా అది పెద్ద విశేషమే.

   కొన్ని రోజులు లేటుగా అయినా తమ వార్త పత్రికలో చూసుకోవాలని ప్రతివాడూ అనుకుంటాడు కాబట్టి ఊళ్ళో మాకు బోలెడు డిమాండు. మమ్మల్ని బతిమిలాడి , వెంటపడి ,   సభలకు సమావేశాలకు పిలిచుకు పోయేవారు. అయ్యవచ్చే దాకా అమావాస్య అగదేమో కానీ విలేఖరి వచ్చేదాకా ఆ రోజుల్లో సభ ఆగేది. ఎం ఎల్ ఏ అయినా మంత్రి అయినా సరే ప్రెస్ వాళ్ళు వచ్చారా అని అడిగి , వచ్చామని ధృవపరుచుకున్నాకే ఉపన్యాసం మొదలెట్టే వాళ్ళు .

  ఊరంతటికీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే హడల్. అతగాడు సాధారణంగా ఎంతటివారినైనా నిలబెట్టే మాట్లాడే వాడు. అలాంటివాడు మేము వెళ్తే గౌరవంగా కూచోబెట్టి మాట్లాడేవాడు. చేతులు కట్టుకుని నిలబడ్డ మోతుబరి ఆసాముల ముందు మేము ఎస్ ఐ గారి ఎదుట కూర్చోగలగటం చూసే వారికి పెద్ద గొప్ప. అది ఊళ్ళో మాకు పెద్ద ఇమేజి తెచ్చిపెట్టేది. పెద్ద బజారులో మమ్మల్ని చూసి ఎస్ ఐ గారు సైకిల్ ఆపి సరదాగా మాట్లాడుతున్నాడు అంటే చుట్టుపక్కలవాళ్ళు అబ్బురంగా చూసేవాళ్ళు. అప్పట్లో పోలీసు సబ్ ఇన్స్పెక్టరుగా వచ్చిన వాళ్ళు ఇంచుమించు మా ఈడువాళ్ళే. ముఖ్యంగా సూర్యనారాయణ బాబు అనే " నిప్పులాంటి మనిషి "  మాకు బాగా ఫ్రెండు. మా ఇంటికి కూడా తరచూ వస్తూండేవాడు. " ఎస్ ఐ గారు అయ్యగారి ఇంటికి వచ్చారట " అని బజారు జనం తెగ చెప్పుకుంటూంటే మా నాన్నకు మహా గర్వం గా ఉండేది.
 
   తరవాత కాలం లో ఐ జీ లు, డిజిపీలు ఎంతోమంది నాకు దగ్గరి మిత్రులయ్యారు. కానీ తొలిరోజుల్లో మా ఊరి సబ్ ఇన్స్పెక్టరు తో స్నేహం  ఇచ్చిన కిక్కు , తెచ్చిన పాప్యులారిటీ వేరు. స్టేట్ గవర్నమెంటు చీఫ్ సెక్రటరీలు చాలామందే నాకు స్నేహితులయ్యారు. కానీ మా ఊళ్ళో డిప్యూటీ తాసిల్దారు ముందు సమాన స్థాయిలో కూచోగలిగినప్పుడు కలిగిన గర్వం వేరు. నా దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళిన మంత్రులు ఎంతోమంది ఉన్నారు. అయినా ఆ రోజుల్లో మా ఊరి ఎం ఎల్ ఏ నా కోసం వచ్చినప్పుడు కలిగిన feeling of importance వేరు.

   అప్పట్లో జగ్గయ్యపేటలో ఫ్యాక్షన్ గొడవలు బాగా ఉండేవి. మా ఊరి సర్పంచ్ కీ , దగ్గరలోని బూదవాడ మునసబుకీ మధ్య హోరాహోరీగా ముఠా ఘర్షణలు  నడుస్తుండేవి. ఏదో సందర్భంలో సర్పంచ్ కీ , వైశ్యులకూ మధ్య చాలా రోజులు పెద్ద యుద్ధం అయింది. పట్టపగలు దొమ్మీలు, షాపుల లూటీలు, ఆస్తుల దహనాలు , ఒక్కోసారి నడివీధిలో మర్డర్లు యధేచ్చగా అవుతుండేవి. అప్పట్లో విజయవాడ రూరల్ డి ఎస్ పి గా ఉన్న రావులపాటి సీతారామారావు గారు లాంటి అధికారులు , ఒంటి చేత్తో ఎంతటి మాబ్ నైనా కంట్రోల్ చేయగలిగిన మా సూర్యనారాయణబాబు లాంటి ఎస్ ఐ లు ఉద్రిక్తత అదుపుచేయటానికి తెగ కష్టపడుతుండే వాళ్ళు.

   అలా గొడవలు బాగా ఉన్నప్పుడు న్యూసు కు కొదవ లేదు. కానీ గొడవలు ఎల్లకాలమూ ఉండవు. మామూలు రోజుల్లో పెద్ద నేరం ఏదీ జరగక... విశేషంగా చెప్పడానికి ఏ అధికారి దగ్గరా ఏమీ లేక ... ఏ సభా జరగక ఒక్కో సారి  వార్తలకు కరువొచ్చేది.  రోజూ ఇన్ని రిపోర్టులు పంపాలని కంపల్సరీ ఏమీ లేదు. రాయకపోతే అడిగే వాళ్ళు లేరు. ఎంత రాసినా నెలకు పది రూపాయలు మించి పత్రిక వాళ్ళు ఏమీ ఇవ్వరు. ఊళ్ళో విలేఖరి అన్న గుర్తింపుతో అడ్డదారిన ఎలా సంపాదించవచ్చు ; నెలసరి , వార్తవారీ మామూళ్ళు ఎలా రాబట్టవచ్చు ; వార్త రాస్తే ఇంత, రాయకపోతే ఇంత అని రుసుము ఎలా వసూలుచేయవచ్చు - అన్న విద్యలు  అప్పట్లో మేము ఎరుగము . జర్నలిజం అప్పటికింకా ఇంత ముందుకు పోలేదు.

    రాయాలన్న నిర్బంధం ఏమీ లేకపోయినా ... వార్త రాసి దాన్ని అచ్చులో చూసుకుంటే కలిగే ఆనందం కోసం ఏదో ఒకటి రాయాలని , రాసి పేరు తెచ్చుకోవాలని తపన.  జగ్గయ్యపేట చిన్న ఊరు. పెద్ద పంచాయతీ . ఉన్న ఆఫీసులు తక్కువ. పక్కన చిల్లకల్లు లో పంచాయతి సమితి ఆఫీసు. అక్కడ మాత్రం రోజూ వార్తలు ఏమి ఉంటాయి ? మామూలు వార్తలు దొరకనప్పుడు "వార్తల ఆకలి " తీర్చుకోవటానికి ప్రత్యేక వార్తలను కనిపెట్టి, లేక వాసన పట్టి వండటమే శరణ్యం.  ఆ రకంగా అదే పనిగా వెతికితే చాలా విషయాలు తెలిసేవి. కొత్త కోణాలను అన్వేషిస్తూ దగ్గరలోని ఊళ్ల వెంబడి తిరిగి హ్యూమన్ ఇంటరెస్టు స్టోరీలు , స్పెషల్ స్టోరీలు చాలా రాసేవాడిని. ఉత్తరోత్తరా నా కెరీర్లో రిపోర్టర్లకు గైడెన్స్ ఇవ్వటానికి అప్పటి అనుభవం , అప్పుడు చేసిన స్వయం కృషి బాగా పనికొచ్చింది.

   అప్పట్లో దినపత్రికల్లో వివిధ కేంద్రాలలోని రిపోర్టర్లు ఎలాంటి వార్తలు ఎలా రాస్తున్నారో చూసి , అలాంటివి మా దగ్గరా ఉన్నాయా అని కూపీ లాగితే   చాలా అక్రమాలు, అవకతవకలు , అధికారుల తప్పుడుపనులు బయటపడేవి. మొహమాటం లేకుండా అవన్నీ రాయగలిగిన మేరకు పత్రికకు రిపోర్ట్ చేసే వాడిని. పంపినవి చాలా వరకూ అచ్చయ్యేవి. తమకు ఇబ్బందికరమైన వార్త రాస్తే సంబంధిత అధికారులో, నాయకులో మొగాలు మాడ్చుకునే వాళ్ళు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు. అయినా   విలేఖరిగా విధినిర్వహణలో  మేము ఎవరినీ లెక్కచేసే వాళ్ళం కాము. లోపల ఎంత మంట ఉన్నా చేయగలిగింది ఏమీ లేక అధికారులు ఉడుక్కుని ఊరుకునే వాళ్ళు.

   ఇలా రోజులు జోరుగా హుషారుగా సాగుతున్నాయని నిశ్చింతగా ఉండగా మొత్తం పత్రికా రంగానికే పెద్ద ఆపద వచ్చింది. దాని సెగ నాకూ తగిలింది. పాత్రికేయ జీవితంలో మొదటి పెద్దసమస్య తరుముకొచ్చింది.

  దానిగురించి తరువాయి భాగంలో.


 



      .

   





 

   

8 comments:

  1. కంటి ముందర జరుగుతున్న సంఘటనల్లా మీరు వివరించిన తీరు చాలా చక్కగా వుంది. అలాగే వీటితో పాటు మీరు గమనించిన సంఘంలోని ముచ్చట్లను చేర్చి తెలియచేస్తే మరింత రంజుగా వుంటుదని భావిస్తున్నాను. అభినందనలు శ్రీశాస్త్రిగారు.

    ReplyDelete
  2. సర్ నేను మీ నుండి ఇంకా మంచి రేపటి యువత కు మంచి పరిణామం తో కూడిన జర్నలిజం కావలి అన్ని కోరుకొంటున్న సర్ అశోకుడు

    ReplyDelete
  3. బాగుంది సార్..మీ తర్వాత 86లో నేను ఈ రంగంలోకి శ్రీకాకుళం గ్రామీణ విలేకరిగా వచ్చా.బినామిగా జ్యోతికి చేశాక ఆంధ్ర ప్రభలో చేరా.నేను ఆంధ్ర ప్రభకు గార,శ్రీకాకుళం రూరల్ కు రాస్తున్నప్పుడు మీరు డిప్యూటీ ఎడిటర్ గా వున్నారు.మీరు శ్రీకాకుళం వచ్చినప్పుడు మిమ్మల్ని శ్రీకూర్మం తోడ్కొని వెళ్లే అదృష్టం చిక్కింది.మీరు రంగాచార్యులు గారు, మా గురువు గారు స్వర్గీయ పత్తి నాగేశ్వరరావు గారు వున్నారు.అయితే మా పీరియడ్ లో కూడా విలేకరిగా కొన్ని మార్పులు వచ్చిన గౌరవం బాగానే ఉండేది.అయితే మీ అంతటి అనుభవం లేదు..కానీ పాత్రకాల creze ఉంది.

    ReplyDelete
  4. సర్ నేను కూడా 2000-2002 మధ్య కాలంలో ఈనాడులో గ్రామీణ విలేకరిగా పనిచేశాను. మీ భావాలను ఏమైతే వ్యక్తపరిచారో సరిగ్గా అలాంటి భావాలే నామనస్సులో ఉండేవి.మళ్ళీ నా గతం గుర్తుకొచ్చింది.మీ తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. విలేఖకుఁడు [permalink]

    విలేఖకుఁడు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004 Report an error about this Word-Meaning
    గ్రంథసంకేత వివరణ పట్టిక
    విణ.

    పత్రికలకై వార్తలు సేకరించి వ్రాయువాఁడు. [ఈ అర్థమున 'విలేఖరి' అను తప్పు పదము వాడుకలో నున్నది.]

    ReplyDelete