Wednesday 25 January 2023

బోసు బాబుకు ‘భారత రత్న’

ఎం.వి.ఆర్. శాస్త్రి

     తాజా బ్లాగులో నేను బ్లాగింది చూసి ఓ మిత్రుడికి పెద్ద డౌటొచ్చింది. ‘అదేమిటండీ బోసు బొమ్మతో  కరెన్సీ నోట్ల గురించీ , బూడిద పేటిక గురించీ అంతంత రాసి అసలైన భారత రత్న సంగతి మరచిపోయారు? ఈ దేశంలో కెల్లా గొప్ప సివిలియన్ పురస్కారమనబడే ఆ మేకతోలును ఇప్పుడైనా మన నేతాజీకి కప్పవద్దా’- అని అతగాడు తెగ ఫీలై పోయాడు. 

      సారీ! నో చాన్స్! సుభాస్ బోసుకు భారతరత్న ఇవ్వటానికి  ఎంతమాత్రం వీలు లేదు. కారణాలు మూడు :

1. దాన్ని తీసుకునేందుకు అతడికి అర్హత లేదు.

2. ఇచ్చేందుకు మనకు యోగ్యత లేదు. 

3. ఈ నాటకం మనం ముఫ్ఫై ఏళ్ల కిందే ఆడేశాం.

‘భారత రత్న’ అనిపించుకోవాలంటే ఎం.జి. రామచంద్రన్ లా రంగు పూసుకుని వేషాలేసే సూపర్ డూపర్ 

 సినిమా యాక్టరైనా కావాలి. సచిన్ టెండుల్కర్ లా డబ్బు దండుకుని కిరికెట్టు ఆడి కోట్లు గడించే లిటిల్ మాస్టరయినా అయ్యుండాలి. లేదా మదర్ తెరెసా లాగా సేవ పేరు చెప్పి డబ్బులు గుంజి కన్వర్షన్లకు వెచ్చించే మిషనరీ టాలెంటు,  రోగాలతో అలమటించే వాళ్లకు మందూ మాకూ ఇవ్వకుండా చంపేసే జాలి గుండె లాంటి లక్షణాలు ఉండాలి. ఆ బాపతు క్వాలిఫికేషన్లు ఏవీ మిస్టర్ సుభాస్ బోసు కు లేవు. 

      అవార్డు పెట్టి ముప్పావు శతాబ్దం గడిచాక , ఇప్పటికే నాలుగు డజన్ల మందికి ఇచ్చేశాక ఒక సుభాస్ చంద్ర బోస్ అనేవాడి పేరు కూడా దానికి కన్సిడర్ చెయ్యవచ్చు. తప్పు లేదు. కాని కొంచెం బోలెడు బావుండదు. ‘భారత రత్న’ అని పేరు పెట్టిన అవార్డును దక్షిణాఫ్రికా లో పుట్టిన నెల్సన్ మండేలాకూ , పాకిస్తాన్ లో మెట్టిన బాద్ షా ఖానుకూ ఉదారంగా పంచిపెట్టిన పుణ్యాత్ములం కాబట్టి మనకు ఏదీ ఎబ్బెట్టు కాదు. స్వతంత్రం అనబడేది వచ్ఛి 75 ఏళ్ళు గిర్రున తిరిగిన తరవాత ఆ అర్ధరాత్రి అమావాశ్య సొతంత్రానికి అసలు కారకుడైన ... మన కోసం తాను చచ్చి మనకు స్వాతంత్ర్యం ఇప్పించిన నేతాజీ అనే బతకనేర్వని వాడు మనకు గుర్తుకు రావటం ఏ జన్మలోనో అతడు చేసుకున్న పుణ్యమే. కాని చిన్న చిక్కొకటి ఉన్నది. నేతాజీ అనేవాడు  మనకోసం జీవించి , దేశం కోసం తపించి , మామూలు  మట్టి మనుషులతో మహా పోరాటాలు చేయించి , సర్వస్వం అర్పించి , ప్రాణాలు ధారపోసి , ఒంటి చేతితో మనకు స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన వెర్రి మారాజు ! అతగాడు విమానప్రమాదంలో 78 ఏళ్ల కింద మరణించిన సంగతే ఈ నాటికీ గుర్తించకుండా ... అతడి ఆస్థికలనూ , చితాభస్మాన్ని పట్టుకొచ్చి గంగలో కలిపి సముచిత స్మారకచిహ్నం కట్టాలన్న ఇంగిత జ్ఞానమైనా లేకుండా పిచ్చి వాగుళ్లతో , వెర్రి వాదాలతో పోచుకోలు కాలక్షేపాలు చేస్తున్న మనకు సూటిగా సింపుల్ గా చెప్పాలంటే నేతాజీ ని తలచే , నేతాజీ పేరు ఉచ్చరించే అర్హత లేదు. 

      ఇక భా.ర. చెప్పుతో మనం నేతాజీని కొట్టిన ట్రాజీ కామెడీ ప్రహసనం కథాక్రమంబెట్టిదనిన ...

      బోసు బాబుకు మరణానంతర పురస్కారంగా భారతరత్న ఇస్తున్నామహో అని పి.వి. నరసింహారావుగారి హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం1991 జనవరి 23 న నేతాజీ జన్మదినం నాడు పత్రికా ప్రకటన దండోరా వేసింది. అది విని అశేష ప్రజలు మురిసి ముప్పందు మవుతారని సర్కారువారు ఆశ పెట్టుకుంటే కథ అడ్డం తిరిగింది. అమాం బాపతుల వాళ్ళకు కూడా ఇచ్చేసిన తరవాత ఇంత కాలానికి మా నాన్న మీకు గుర్తొచ్చాడా? ఇది గౌరవం కాదు.. అపచారం’ అని మొగంమీదే చెప్పి బోసు కూతురు అనిత  అవార్డు తీసుకునేందుకు తిరస్కరించింది. మీరన్నా రండర్రా అంటే బోసు కుటుంబీకులు ఒక్కరూ ముందుకు రాలేదు. అంతలో – మరణించినట్టు సర్కారు వారు నేటికీ ద్రువీకరించని బోసుకు మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారు అంటూ లా పాయింటు తీసి ఉత్సాహవంతుడొకడు కలకత్తా హైకోర్టులో  ఓ పిల్లు పిల్లాడు. హిట్లరు తొత్తు, ముస్సోలినీ బంటు, ఫాసిస్టు, టోజో బూట్లు నాకే కుక్క అని తాము ఏనాడో తేల్చి తీర్పు చెప్పిన బోసు ను భారత రత్న గా గుర్తించటమేమిటి  అని ఈ దేశంలో మేధావులు అనే టాగ్ గుత్తకు తీసుకున్న కమ్యూనిష్టులకు చెడ్డ కోపం వచ్చింది. లెఫ్టిష్టులు ఒంటి కాలి మీద బుస్సున లేచారు. 

      మీడియాలో రచ్చ రచ్చ అయ్యాక  గత్తర  నుంచి  బయటపడటానికి ఏమి చెయ్యాలా  అని సర్కారు వారు  తల పట్టుకున్నారు.  ఇస్తున్నట్టుగా అప్పటికే రాష్ట్రపతి భవన్ ప్రకటించింది కాబట్టి అవార్డును రద్దు చెయ్యటం కుదరదు. అవార్డు తీసుకునేందుకు నేతాజీ తరఫున ఎవరూ పిలిచినా రారు కాబట్టి ఎవరినీ పిలవొద్దు. అవార్డు ఫంక్షనులో అసలు నేతాజీ పేరే ఎత్తవద్దు- అని చక్కని తరణోపాయం కనిపెట్టారు. మరి అప్పటికే నేతాజీకంటూ ఇవ్వటానికి ఓ మెడలు రెడీ అయింది కదా? దానినేమి చెయ్యాలి అని ఇంకో శంక వచ్చింది. ఓస్! దానిదేముంది? హోమ్ మినిస్ట్రీ కచేరీ లో దాచి పెడదాం అని నిర్ణయమయింది. అవార్డు ఇవ్వలేదు; గజిట్ లో ప్రకటించలేదు; రిజిస్టరులో పేరు ఎక్కించలేదు .కాబట్టి రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన కాన్సిల్ అయినట్టే భావించవలెను అని  చెప్పి కలకత్తా హై కోర్టు 1997లో భారతరత్న గొడవకు ఎండ్ కార్డు వేసింది. 

      నేతాజీ బూడిద టోక్యో గుళ్ళో మగ్గుతున్నట్టే నేతాజీకి ఇవ్వబోయిన భారతరత్న మెడలు హోమ్ మినిస్ట్రీ అటకమీదెక్కడో  ముప్ఫై ఏళ్లుగా దుమ్ముకొట్టుకుని పడి ఉండాలి . ఇప్పుడు కాని , కొన్ని తరాల తరవాత గాని సర్కారు వారికి రాజకీయంగా గిట్టుబాటు అనుకుంటే దానికి దుమ్ము దులిపించ వచ్చు. రీమేకులు మనకు అలవాటే కనుక ‘బోసు బాబుకు  భా.ర.’  కామిక్ షో కూ మళ్ళీ ఎప్పుడైనా  క్లాప్ కొట్టవచ్చు. దయచేసి వేచి ఉండండి.




                                    ------------------------

No comments:

Post a Comment