Friday 1 June 2018

టిటిడి రాష్ట్ర ప్రభుత్వ జాగీరా ?

ఉన్నమాట

ఎం‌.వి.ఆర్‌.శాస్త్రి

..........

    రెండు దశాబ్దాల కిందటి మాట.

    రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'అన్నమయ్య' సినిమా తీస్తున్నారు. దాని షూటింగ్ను తిరుమల కొండల మీద జరుపుకోవటానికి ఎగ్జిక్యూటివ్ఆఫీసరు అనుమతి కోరారు. .. విషయం ట్రస్టు బోర్డు ముందు పెట్టారు. కమర్షియల్కార్యకలాపాలను కొండమీద అనుమతించేది లేదని టిటిడి బోర్డు కరాఖండిగా తిరస్కరించింది. ఇంకోసారి ఆలోచించమని సినిమా వాళ్లు అడిగారు. ఇంకోసారి బోర్డు అదే సమాధానం చెప్పి ససేమిరా అంది.

    దాంతో నిర్మాత తెలివి తెచ్చుకుని 'కరెక్ట్రూట్‌'లో వెళ్లాడు. చెప్పవలసిన వారికి చెప్పవలసిన రీతిలో చెప్పాడు. అప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. 'వీళ్లేదో అడుగుతున్నారు, దీని సంగతి కాస్త చూడండి. వీరి అర్జీని మళ్లీ బోర్డు ముందు పెట్టి 'పునఃపరిశీలించండి' అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ..కు ఆదేశం వెళ్లింది. అంతే! బోర్డు తోకముడిచి, షూటింగ్కు 'సరే' అంది.

    దానిమీద ఒళ్లు మండిన ఒక మిరాసీదారు సంబంధీకుడు హైకోర్టులో దావా వేశాడు. ప్రధాన న్యాయమూర్తి ప్రభాశంకర మిశ్రా, జస్టిస్వి.ఆర్‌.రెడ్డిలతో కూడిన డివిజన్బెంచి సినిమా షూటింగ్కు .. ఇచ్చిన పర్మిషన్చట్టవిరుద్ధమని ప్రకటించి రద్దుపరిచింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రభావంలో పడి బోర్డు చట్టప్రకారం తన విచక్షణాధికారాన్ని వినియోగించలేకపోయిందని తప్పుపట్టింది.

    1997లో ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పు (Tallapakam Raghavan Vs State of A.P. 1997 (2) ALT (DB)) లో కోర్డు చేసిన న్యాయ నిర్ణయాన్ని చిత్తగించండి.

     1. The Board of Trustees, the committee or the Executive officer are only administrators of the property of Lord Venkateswara. They can have no right of ownership in themselves and they can not decide to do anything against the interest of the right of the owner (i.e.) Lord Venkateswara.
    2. No Administrator can take liberty to destroy the sanctity and Holiness of the Thirumala Tirupathi Devasthanams, and domain of Lord Venkateswara.
    3. The Governement’s interference in the affairs of the Devasthanam or the administration, is beyond the law and without jurisdiction.

    (1.ట్రస్టీల బోర్డు అయినా మేనేజింగ్కమిటీ అయినా ఎగ్జిక్యూటివ్ఆఫీసరయినా వెంకటేశ్వరస్వామి ఆస్తికి అడ్మినిస్ట్రేటర్లు మాత్రమే. వారికి యాజమాన్యపు హక్కు లేదు. అసలు యజమాని శ్రీ వేంకటేశ్వరస్వామి. ఆయన హక్కు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాళ్లు నిర్ణయం చేయజాలరు.
    2.శ్రీ వేంకటేశ్వరస్వామి సంస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను నాశనం చేసే స్వేచ్ఛ అడ్మినిస్ట్రేటర్కూ లేదు.
    3.దేవస్థానం వ్యవహారాలలో గాని, దాని నిర్వహణలో గాని ప్రభుత్వ జోక్యం చట్టవిరుద్ధం. దాని పరిధికి మించిన పని.)

    ఉన్నత న్యాయస్థానం అలా కుండబద్దలు కొట్టినట్టు న్యాయాన్యాయాలను స్పష్టంగా తేల్చి చెప్పిన తరువాత కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు టిటిడి తమ తాహతుకు మించి అతిచేయడం ఇప్పుడు ముదిరిన వివాదాలకు మూలకారణం.

    టిటిడిని పరిపాలించేది ఎగ్జిక్యూటివ్ఆఫీసర్‌, ధర్మకర్తల బోర్డు. ..నూ బోర్డునూ ఇష్టానుసారం నియమించేది రాష్ట్ర ప్రభుత్వం. అంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం టిటిడికి సూపర్బాస్అయిపోదు. అసలు యజమాని శ్రీవారు. ఆయన హక్కులకు, ఆయన సంస్థానం పవిత్రతకూ భంగం కలిగించే నిర్ణయాన్నీ కార్యనిర్వాహకుడు తీసుకోవటానికి వీల్లేదు. ఇదే గదా హైకోర్టు మొహం మీద గుద్దినట్టు తీర్పులో చెప్పింది ?

     మరి, సనాతన ధర్మానికి నెలవు అయిన, ధర్మాన్ని ఆచరించే శతకోటి హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలోని శ్రీవారి సంస్థానంలో ధర్మాన్ని బొత్తిగా విశ్వసించని, శ్రీవారిని కనీసం గౌరవించని అన్యమతస్తులను కొలువులో పెట్టటం వల్ల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి యాజమాన్య హక్కును, ఆయన ప్రయోజనాలను కాపాడినట్టా ? తుంగలో తొక్కినట్టా ?

    వేరే మతానికి చెందిన పూజాదికాల్లో, పవిత్ర క్షేత్రాల్లో వేలు పెట్టేందుకు, కనీసం క్రీగంట చూసేందుకు దమ్ముల్లేని ప్రభుత్వం హిందువుల అలసత్వాన్ని అలుసుగా తీసుకొని, ఒక్క హిందూమతానికి చెందిన దేవాలయాల మీద జబర్దస్తీగా కర్రపెత్తనం చేస్తున్నదే తప్ప దేవాలయాల్లో ఒక్కదానిమీద తన జేబులో నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టదు. కళకళలాడే దేవస్థానాల సొమ్మును సొంత అవసరాలకు, దిక్కుమాలిన రాజకీయ మెహర్బానీలకు ఎలా కాజేద్దామా అనే చూస్తుంది తప్ప వెలవెలపోయిన గుడులను ఆదుకోవటానికి దమ్మిడీ విదల్చదు. కలియుగ వైకుంఠంలా వెలిగిపోయిన తిరుమల దేవస్థానానికి జమపడే ప్రతి రూపాయీ తమ ఇలవేల్పు మీద భక్తితో హిందువులు సమర్పించుకున్నదే. హిందూమతాన్ని విశ్వసించే హిందువులు హైందవ దేవస్థానంలో సమర్పించే కానుకలతో నడిచే టిటిడిలో మతాన్ని ద్వేషించే, దేవుడిని కన్నెత్తి చూడటానికి, కనీసం బొట్టు పెట్టుకోవటానికి కూడా నిరాకరించే అన్యమతస్తులను మేపటం దేవస్థాన పవిత్రతను, దాని ప్రయోజనాలను రక్షించటమా? భక్షించటమా?

    తుది తీర్పు వెలువడేంతవరకూ అన్యమస్తులెవరినీ ఉద్యోగంలోంచి తొలగించరాదని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఇంటెరిం ఆదేశాన్ని సాకుగా చూపెట్టి, హిందూ ప్రజానీకపు ఒత్తిడిపై తలపెట్టిన పాలనాపరమైన చర్యలన్నిటినీ కట్టిపెట్టి, బాహాటంగా చర్చిలకు వెళ్లివస్తూండే ఉద్యోగులకు అభయమిచ్చి, కడుపులో పెట్టుకొని కాపాడుతున్న టిటిడి పెద్దలు వారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిన ప్రధానార్చకుడిపై ఉన్న పళాన వేటువేయడం న్యాయమేనా?

    టిటిడి అనేది రాష్ట్ర ప్రభుత్వం సొంత జాగీరు కాదు. తరతరాలుగా స్వామిని సేవిస్తూ ఆగమ శాస్త్రోక్తంగా పూజాదికాలు జరుపుతున్న వంశపారంపర్య అర్చకులు గవర్నమెంట్నౌకర్లు కారు. అధికారుల అనుచిత జోక్యాల వల్ల, రాజకీయ మెహర్బానీల కారణంగా స్వామి వారి కైంకర్యాలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నామని, తెల్లవారు ఝామున చేయాల్సిన సుప్రభాత సేవను అర్థరాత్రే కానిచ్చిన సందర్భాలున్నాయని ప్రధానార్చకుడు మీడియా ముందు చెప్పిన సంగతి ఏడుకొండల స్వామికి భక్తులైన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంత పరచింది. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన బాధ్యత టిటిడి పాలకవర్గం మీద ఉంది.

    అదేమంత కష్టమైన పని కాదు. సుప్రభాతసేవ, తోమాల సేవ వగైరాలు రోజున సమయంలో ఎంత సేపు జరిగిందన్న రికార్డు దేవస్థానం వారి దగ్గర ఉంటుంది. దానికి సంబంధించి గడచిన అర్థ సంవత్సరం వివరాలనో ప్రజల ముందు పెడితే రమణ దీక్షితులు అన్నది నిజమో అబద్ధమో అక్కడిక్కడే తెలిపోతుంది.

    అలాగే, ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పాకశాలలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగాయని ప్రధానార్చకుడు చెప్పారు. ఆయన చెప్పింది తప్పు అయిన పక్షంలో 'పోటు'కు ఎలాంటి తవ్వకాల పోటూ లేదని నిరూపించే వాస్తవ చిత్రాల సాక్ష్యాలను బహిర్గత పరిస్తే భక్తకోటికి ఆందోళన తగ్గుతుంది. శ్రీవారి తిరువాభరణాలు తమ అధీనంలో ఉన్నంతవరకూ సజావుగా నడిచిన వార్షిక తనిఖీకి తరువాత దిక్కు లేకుండా పోయిందని, మైసూర్మహారాజా సమర్పించిన అపురూప వజ్రం లాంటివి మాయమయ్యాయని ప్రధానార్చకుడు చేసిన అభియోగంలో పస ఎంతన్నదీ సరైన దర్యాప్తు ద్వారా తేల్చివేయవచ్చు.

    ఈ రాజమార్గాన్ని వదిలిపెట్టి, ఫిర్యాదు చేసిన ప్రధానార్చకుడి మీద విరుచుకుపడి, 24 గంటలు తిరగకుండా కొలువునుంచి తొలగించటం తెంపరితనం. కన్నూ మిన్నూ కానని దురహంకారం. హద్దుమీరిన నియంతృత్వం.

    ప్రధానార్చకుడు రమణదీక్షితులులో పుట్టెడు లోపాలు ఉండవచ్చు. బోలెడు తప్పులు అతడు చేసి ఉండవచ్చు. ఇప్పుడు తీరి కూర్చుని లోపాలు, తప్పులు ఏకరువు పెడుతున్న వారు అవన్నీ ఎరిగి కూడా ఇన్ని దశాబ్దాల పాటు అతడిని ప్రధానార్చకుడిగా ఎందుకు కొనసాగనిచ్చారో మొదట చెప్పాలి. తమకు తందానా అన్నంతకాలమూ అతడు ఎలాంటివాడయినా సహిస్తారు; తమకు ఎదురు తిరిగితేనేమో మరుక్షణం అతడి మెడకాయ కోస్తారా? రమణ దీక్షితులపై పగబట్టినట్టు ఆయనపై ఇప్పుడు ఎవరు ఎన్ని నిందలు వేసినా, వాటిలో నిజానిజాలు ఎలా ఉన్నా నిన్నటిదాకా అతడు శ్రీవారిని అనుదినం స్వయంగా సేవించిన ప్రధానార్చకుడు. పైగా దేవస్థానం వారే గుర్తించిన ఆగమ సలహాదారు.  హోదాలో అతడు ఆగమపరమైన అనాచారాలకు, అపచారాలకు సంబంధించి ఏమి చెప్పినా, దానికి ఒక ప్రాముఖ్యం ఉంటుంది.

    స్వామికి అపచారం జరిగిందో లేదో సాధికారకంగా చెప్పగలిగినవాడు అర్చకుడు. అర్చకుడే తప్పు జరిగిపోయిందని మొత్తుకున్నప్పుడు, దానిపై భక్తులకు కలిగిన మనస్తాపాన్ని గుర్తించి, సరైన విచారణ ద్వారా అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత దేవస్థాన పాలకవర్గానిది. పని సజావుగా జరిగిన తరువాత, అర్చకుడు నిష్కారణంగా అభాండాలు వేశాడని విచారణలో రుజువైతే, అతడికి ఎలాంటి శిక్ష విధించినా ఎవరూ ఆక్షేపించరు. ఆపాటి వివేకం లేకుండా, అసలు నోరెత్తటమే మహా నేరమైనట్టు అహంకరించి, తలచిందే తడవుగా ఫిర్యాది తలతీయటం రకమైన ఫ్యూడల్కండకావరం ? శ్రీవారి దేవస్థానానికి తాము ఆఫ్టరాల్ధర్మకర్తలమే తప్ప సొంతదారులము కామనీ, దేవస్థానాన్ని పోషించే భక్తకోటికి కలిగే ప్రతి అనుమానానికీ జవాబు చెప్పవలసిన విధి తమపై ఉన్నదనీ మరిచి, గళమెత్తిన వాడిని నిర్బంధ ఉద్యోగ విరమణతో ఇంటికి పంపటాన్ని చట్టం అనుమతిస్తుందా ?

    అసలే టిటిడి కొంతకాలంగా తట్టెడు వివాదాల్లో కూరుకుపోయింది. దేవస్థానం ప్రభుత్వ కబ్జాలోకి వెళ్లినప్పటి నుంచీ ఎగ్జిక్యూటివ్ఆఫీసరుగా తెలుగువాడిని నియమించటం ఆనవాయితీ. దానిని తోసిరాజని, అభ్యంతరాలన్నిటినీ పెడచెవిన పెట్టి తెలుగువాడు కాని అనిల్సింఘాల్ను ..గా నియమించటం ఒక వివాదం. విధాన నిర్ణయాలు చేసే ట్రస్ట్బోర్డుకు ఛైర్మన్గా క్రైస్తవ పక్షపాతి అని ఆరోపణకు గురైన సుధాకర యాదవ్ని హైందవ వర్గాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను లెక్కచేయకుండా ఛైర్మన్గా నియమించటం మరో పెద్ద వివాదం. హిందూమతాన్ని ఆచరించే వారిని మాత్రమే బోర్డు సభ్యులుగా నియమించాలన్న చట్ట నిబంధనను కాలరాసి, తాను క్రైస్తవురాలిననీ, తన బ్యాగులో ఎప్పుడూ బైబిల్ఉంటుందనీ బాహాటంగా ప్రకటించిన ఉత్తమురాలిని ఏరికోరి బోర్డు మెంబర్ను చేయటం ఇంకా అల్లరిపాలైంది. సోషల్మీడియాలో బండారం బట్టబయలయ్యాక నాలిక కరచుకొని నియామకాన్ని రద్దుపరచినా, కొత్త బోర్డులోని ఇంకో మెంబర్కు  క్రైస్తవంతో సంబంధం ఉందన్న ఆరోపణ కొత్తగా రావటం విశేషం.

    హైందవ భక్తులు ఇచ్చే సొమ్ముతో నడిచే దేవస్థానం కొలువులో అన్యమతస్తులు పెరిగిపోవటం, అన్యమత ప్రచారం ఉధృతంగా సాగటం ప్రతి హిందువుకూ గుండెలో ముల్లు అయిన తరుణంలో కొత్తగా ఏర్పడ్డ ట్రస్టు బోర్డులో కూడా క్రైస్తవ పక్షపాతులు ఉండటం హిందూ సమాజానికి మరీ దుస్సహమైంది.

     ఈ పరిస్థితుల్లో భక్త జనానికి కలిగిన తీవ్ర మనఃక్లేశాన్ని ఉపశమింప జేయటం ఎలాగా అన్నది కొత్త పాలకవర్గానికి ప్రప్రథమ ప్రాధాన్యం అయి ఉండాల్సింది. దిశగా దృష్టి సారించాల్సిందిపోయి, కొత్త ఛైర్మన్వచ్చీరాగానే దేవస్థానంలోని హైందవేతర సిబ్బంది ప్రయోజనాలను కాపాడుతానని ప్రకటించటం పుండుమీద కారం చల్లటమే. హిందూ దేవస్థానంలో అన్యమతస్తులైన సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుతామనే వారు కొత్త బోర్డు మొట్టమొదటి సమావేశంలోనే అపచారాలను వ్యతిరేకించిన ప్రధానార్చకుడికి ఆగమేఘాల మీద ఉద్వాసన చెప్పటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ.

     తమకు కంటగింపు అయిన రమణ దీక్షితులను అర్జంటుగా వదిలించుకోవటానికి టిటిడి బోర్డు ప్రయోగించిన అస్త్రం 65 ఏళ్లకు అర్చకులు విధిగా రిటైర్డు కావాలన్నది ! ఇది ఇంకో పెద్ద అక్రమం. అర్చకుల జీత భత్యాలు, సర్వీసు నియమాలకు సంబంధించి ఏదైనా పథకాన్ని రూపొందించే అధికారాన్ని 2007లో సవరించిన రాష్ట్ర ఎండోమెంట్స్చట్టంలోని 144 సెక్షన్ఎండోమెంట్స్కమీషనర్కి ఇచ్చింది. అలాంటి పథకం ఏదైనా ధార్మిక పరిషత్తు ఆమోదిస్తేనే అమలు కావాలనీ అదే సెక్షన్నిర్దేశించింది. దీనికింద టిటిడిలో అనువంశిక అర్చకత్వం నెరపుతున్న వారికి సంబంధించి ఒక పథకాన్ని అప్పటి .. .వై.ఆర్‌.కృష్ణారావు తయారు చేశారు. కమీషనర్దానిని అంగీకరించారు. ధార్మిక పరిషత్తు ఆమోదం తెలిపింది. ఆనువంశిక అర్చకులకు రిటైర్మెంట్ఉండదన్నది పథకంలోని ఒక ముఖ్యాంశమట. అన్నివిధాల తమకు అనుకూలంగా ఉండటం వల్ల పూర్వపు అర్చక మిరాసీదారులు పథకానికి అంగీకారం తెలిపి, అంతకుముందు సుప్రీంకోర్టులో తాము వేసిన దావాను కోర్టు అనుమతితో ఉపసంహరించుకున్నారు.


     మరి ఇలాంటి పరిస్థితిలో 65 ఏళ్ళు నిండిన అర్చకులు తప్పుకొని తీరాలంటూ బోర్డు ఎవరికీ చెప్పా పెట్టకుండా మెరుపు వేగంతో చేసిన నిర్ణయం చట్ట పరీక్షకు నిలబడుతుందా ? సెక్షన్‌ 144లో పేర్కొన్న విధివిధానాలకు విరుద్ధంగా అర్చకుల సర్వీసు నియమాలను ఏకపక్షంగా మార్చే అధికారం బోర్డుకు ఉన్నదా ? అర్చకులకు సంబంధించిన పథకానికి ఆమోద ముద్ర వేయవలసిన ధార్మిక పరిషత్తుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అతీ గతీ లేనప్పుడు బోర్డు చేసిన నిర్బంధ రిటైర్మెంటు నిర్ణయం ఎంతవరకు న్యాయబద్ధం?

      65 ఏళ్లు నిండిన అర్చకులు రిటైర్కావాలన్న నిబంధన రాష్ట్రంలోని దేవాలయాల్లో ముందునుంచీ ఉన్నమాట నిజం. కాని దాన్ని ఒక విధానంగా కాకుండా అర్చకుల మెడమీద కత్తిలా పెట్టి, తమ మాట వినని, ఆడించినట్టల్లా ఆడని అర్చకులను సాగనంపడానికి మాత్రమే ఇష్టానుసారంగా అధికారులు ప్రయోగిస్తున్నారు. తిరుమలలో కూడా 65 ఏళ్ళ రిటైర్మెంట్నిబంధన ఎప్పటినుంచో అమల్లో ఉన్నదని అధికారులు దబాయిస్తున్నారు కదా ? మరి రమణ దీక్షితులకు 70 ఏళ్లు దాటినా ఇప్పటిదాకా అతడిని ఎలా కొనసాగనిచ్చారు ? అతడికి 65 ఏళ్లు నిండాయన్న సంగతి ఇన్నేళ్లు లేటుగా ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది ?

      అన్నమయ్య సినిమా షూటింగ్కు అనుమతి ఇవ్వవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం టిటిడి బోర్డుకు ఉత్తరం రాయటమే దాని పరిధిని అతిక్రమించిన అధికార దుర్వినియోగం, చట్ట విరుద్ధం అని హైకోర్టు మొట్టికాయ వేసింది కదా? దేవస్థానంలో జరుగుతున్న అపచారాల గురించి ప్రధానార్చకుడు నోరెత్తినదే తడవుగా ..ను, బోర్డు ఛైర్మన్నూ హుటాహుటిన ముఖ్యమంత్రి తన దగ్గరికి పిలిపించుకొని మంతనాలడటం, అతడి అభియోగాలన్నీ అబద్ధాలని ముఖ్యమంత్రే బహిరంగ యాగీ చెయ్యటం మాత్రం అధికార దుర్వినియోగం కాదా? ప్రధానార్చకుడు ఆగమ నియమాలకు, కైంకర్యాలకు, దేవుడి నగల భద్రతకు సంబంధించి లేవనెత్తిన అంశాలలో విధమైన సంబంధం లేని టిటిడి సిబ్బందిని అతడి మీదికి ఉసికొలపటం, వారి చేత నల్లబాడ్జిలు పెట్టించి, అమంగళ సూచకమైన నలుపురంగును స్వామివారి దివ్యమంగళ సన్నిధిలో ప్రదర్శింపజేయటం ఆలయ పవిత్రతకు భంగకరం కాదా? అసలు యజమాని అయిన వెంకటేశ్వరుడికి నడమంత్రపు పెత్తందారులు చేసినది తీవ్రాప్రచారమే కాదా? ప్రధానార్చకుడు అన్న కనీస గౌరం కూడా లేకుండా 'రమణ దీక్షితులును బొక్కలో వేసి నాలుగు తగిలించాలి' అని బాధ్యత గల రాష్ట్ర మంత్రి చంద్రమోహన్రెడ్డి నోరు పారేసుకోవటం రకమైన రాజకీయ సంస్కృతి ?


      అలాగే.. పంచతంత్రం కథలో ఇనుమును ఎలుకలు తినేశాయని ఎవడో చెప్పినట్టు, నాణేలు విసిరితే వజ్రం పగిలిపోయిందని తి.తి.దేవరలు చెప్పటం ఎవరిని మోసగిద్దామని ? పింక్డైమండ్అనేదే లేదని, లేనిదాన్ని ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలమని అడుగుతున్న ..సింఘాలుడు మైసూర్మహారాజా సమర్పించిన 'రాజ్పింక్' వజ్రం ఏమైందంటే ఏమి చెబుతాడు ?

      హిందూ సమాజం ముక్తకంఠంతో కోరుతున్నట్టు, సుబ్రహ్మణ్య స్వామి డిమాండు చేస్తున్నట్టు కోర్టు పర్యవేక్షణ కింద సిబిఐ ఎంక్వయిరీ జరిపిస్తే అన్ని విషయాలూ బయట పడతాయి కదా ? కేంద్రంలోని మోదీ సర్కారు సిబిఐని అడ్డంగా వాడేసుకుంటుందేమోనన్న భయానికీ ఆస్కారం ఉండదు కదా ? రాష్ట్రాన్నేలే వారికి, వారి తైనాతీలకు దాచిపుచ్చుకోవలసింది ఏమీ లేకపోతే సిబిఐ విచారణకు వెరపెందుకు ?

      ఏడుకొండల స్వామి పవిత్ర దేవస్థానాలకు దుష్ట రాజకీయ గ్రహణం, ప్రభుత్వ పెత్తనపు పీడాకారం తొలగేదెప్పుడు ?



No comments:

Post a Comment