Sunday, 20 September 2026

మా ఇంటి మహాలక్ష్మి

  "ఆమె మరణించలేదు. విశ్వశక్తిలో విలీనమయింది. ఆమె మీ నుంచి ఏమీ కోరటం లేదు. ఏ కర్మకాండా ఆమెకు చేయనవసరంలేదు."

                        - శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్

"ఆ తల్లి తాను వచ్చిన పని పూర్తి చేసుకొని సద్గతి పొందినది."

                         - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

రెణ్నెల్ల కింద (జూలై 15 వేకువన) గోదావరి ఎక్స్ ప్రెస్ లో తన్మయి, నేను విశాఖపట్నం చేరాము. మధ్యాహ్నం  అక్షయ్ హాస్పిటల్ లో డాక్టర్ పెద్దపల్లి అప్పారావుగారిని మేము కలవాలి. "చాలా టైముంది. కనకమహాలక్ష్మి గుడికి వెళతావా?" అని అడిగాను. "భీమిలి అమ్మవారి గుడికి పోదాం" అంది మా అమ్మాయి. 

భీమునిపట్నం లోని తమ ఆనందవనంలో పూజ్యసద్గురు శివానందమూర్తి గారు ప్రతిష్ఠించిన, దేశంలోకెల్లా అరుదైన ఆద్యాది మహాలక్ష్మి దేవాలయం లో నిబంధనలు స్ట్రిక్టు. అర్చకుడు మనోహర్ కి ఫోన్ చేస్తే 10-30 లోగా రండి అన్నాడు. కారులో మేము చేరేసరికే 10-45 దాటింది. అయినా గుడి తెరిచే ఉంది. భక్తులు వేరెవరూ లేరు. మా అమ్మాయిని మహాలక్ష్మి మరకత విగ్రహం ఎదుట కూర్చోబెట్టి సహస్రనామార్చన చేశారు. అమ్మవారికి కట్టిన చీరను తన్మయికి ఇచ్చారు. అది అరుదైన ప్రాప్తం.  

తరవాత గురువుగారి ఆశ్రమానికి వెళ్లాము. ముప్ఫై ఏళ్లుగా అక్కడికి వెళుతున్నా మేము ఎన్నడూ చూడని గురువుగారి పడక గదిలో  పాన్పు దగ్గరా, ఆయన పూజచేసి తీర్థం ఇచ్చిన గది లోనూ కూర్చుని చాలాసేపు తన్మయి ధ్యానం చేసింది.  వెలిగిపోతున్న ముఖంతో కారెక్కింది. 

ఇది గొప్ప శుభసూచకం; అమ్మవారు, గురువుగారు పిలిచి ఆశీస్సులిచ్చి డాక్టర్ అప్పారావుగారి దగ్గరికి పంపారు కనుక అమ్మాయికి జబ్బు నయమవుతుంది. తప్పక కోలుకుంటుంది- అని మేము ఆనందపడ్డాము. కాని తన్మయి చేసుకున్న ప్రార్థన వేరు. అమ్మవారే పిలిపించి చీర, గాజుల సారె పెట్టి ఆమెను సాగనంపిందన్న సంగతి ఆ తరవాత కానీ నాకు అర్థంకాలేదు.

"ఇది మెడికల్ కేసు కాదు. ఈ అమ్మాయి అన్నీ, అందరినీ, ఏకంగా ప్రపంచాన్నే మనసునుంచి వదిలేసింది. ఆ స్థితిలో,  కోలుకోవాలన్న కోరికే లేక మైండు నంబ్ అయినప్పుడు ఏ మందూ, ప్రపంచంలోని ఏ వైద్యమూ ఆమె మీద పనిచేయదు" అని హైదరాబాద్ పంజాగుట్టలోని "మహా సిద్ధ వైద్య చికిత్సాలయ" అధిపతి, అపర ధన్వంతరి డాక్టర్ కె. వి. ప్రసాద్ గారు జూలైలోనే తన్మయి నాడి చూసి చెప్పారు. ఆయన పల్సును బట్టి మొత్తం శరీరాన్ని స్కాన్ చేయటమే కాదు- అనేక జన్మల కర్మప్రభావాలను కూడా పట్టెయ్యగలరు. అక్కడికీ  బ్లడ్, ఓజోన్, మాగ్నెటిక్ థెరపీలు చేసి, జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక యంత్రాల మీద ఆమె ఒళ్లంతా శోధించి , ఎన్నో మందులిచ్చి శాయశక్తులా ప్రయత్నించారు. ఏదీ ఫలించదని నాడి చూసిన ప్రతి సారీ ఆయనకు తెలుస్తూనే ఉంది. మాకే అర్థం కాలేదు. 

"విజయవాడలోని ఆమె అత్తవారు, కట్టుకున్నవాడు  తన్మయి సర్వనాశనానికి భయానక క్షుద్రశక్తిని కొన్నేళ్లకిందటే ప్రయోగించారు. అది అడుగడుగునా అడ్డుపడుతున్నా పదకొండు రాత్రులు వారాహి జపం చేసి ఆమెను కాపాడాను. ఆమెను నా ఆరాధ్యదైవమైన ఉచ్చిష్ట గణపతికి అప్పగించాను. ఆమెలో ఏమీ లేదని మా అయ్యగారు చెబుతున్నాడు. ఏదో ఉందని ఏ డాక్టరు చెప్పినా నేను నమ్మను" అన్నారు పటాన్ చెరు లోని పాదుకాంత పూర్ణదీక్షాపరులు, మా అమ్మాయికి మంత్రగురువులు జివికె రావు గారు.

 నిజమే! ఆమెలో ఏమీ లేదు. బంధమేదీ మిగలలేదు. ఆమె రోజూ పూజించే ఇష్టదైవమైన గణపతికే రావుగారు ఆమెను అప్పగించారు. ఆయన స్వీకరించాడు. వినాయక చవితి (2026 సెప్టెంబర్ 14) రాత్రి ఆమెని తన దగ్గరికి చేర్చుకున్నాడు. 

శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ కు నేనంటే మహా ప్రేమ. మా కుటుంబంలో ఎవరికి ఏ ప్రాణగండం వచ్చినా ఆయనకు చెబుతాను. ఏ దేశాన ఉన్నా ఆయన వెంటనే అభయమిస్తారు. తన భక్తులలోని సంబంధిత వైద్యనిపుణులతో మాట్లాడి, పలుమార్లు శ్రద్ధగా చర్చించి, నయమయ్యేంత వరకూ ఫోన్లు చేస్తూ కుశలం కనుక్కుంటుంటారు. అలాంటిది నా ప్రియాతిప్రియమైన కూతురుకు బ్రెయిన్ ట్యూమర్  ప్రాణాంతకంగా మళ్లీ ప్రకోపిస్తే స్వామి అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఆమెరికాలోని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారితో ఒకమారు మాత్రం మాట్లాడి ఊరుకున్నారు. "సర్జరీ చేయించాలా? వేరే ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? " అని గుచ్చిగుచ్చి అడిగినా " నీకు వివేకం ఉంది. ఏదైనా ఆలోచించి సరైన నిర్ణయమే చేస్తావు. నువ్వు, నీ శ్రీమతి ఎలా నిర్ణయించినా నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి" అనేవారు. ఎందుకంత ఉదాసీనత అని మేము నొచ్చుకున్నాము. "ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. ఆమె స్థితి నాకు ముందే తెలుసు. విశ్వశక్తిలో తను కలిసి పోయింది. ఇక ఆమెకు జన్మ ఉండదు. ఏ కర్మకాండా ఆమెకు చేయనవసరం లేదు" అని విశ్వంజీ స్వామి అంతా అయిపోయాక మాకు రహస్యం వెల్లడించారు. 

"మీ వంటి ప్రజ్ఞానిధులకు ధైర్యం చేకూరాలని స్వామిని ప్రార్థిస్తున్నాను . ఆ తల్లి తాను వచ్చిన పని పూర్తి చేసుకొని సద్గతి పొందినది ."అన్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.

చెన్నై లోని అపోలో హాస్పిటల్ వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయక తప్పదని తేల్చాక ఆగమేఘాలమీద హైదరాబాద్ కిమ్స్ కు మావాళ్లు పరుగెట్టారు. అక్కడి న్యూరో సర్జన్ మానస్ పాణిగ్రాహి గారు చాలా గంటలు వెయిట్ చేయించి, పది రోజుల తరవాత కాని సర్జరీ చేయటానికి తనకు ఖాళీ లేదని సెలవిచ్చారు. వెంటనే చేయకపోతే ప్రాణానికి ముప్పు కాదా అని అడిగితే "ఫర్వాలేదు. అమ్మాయి ఇప్పుడు చక్కగా ఉన్నది కదా?" అన్నారట. ఆ విధంగా నిరర్థకమైన సర్జరీ బాధ ఆఖరి నిమిషంలో దైవికంగా తన్మయికి తప్పింది. 

వెళ్లపోవటానికి పన్నెండు రోజులముందు ఇలా కనపడింది




వెళ్లపోవటానికి ఆరు రోజులముందు  ( సెప్టెంబర్ 8న) ఉదయం ఐదింటికి వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి మధ్యాహ్నం రెండింటికి విశాఖపట్నంలో దిగింది. ఎకాఎకి కారులో రెండు గంటలు ప్రయాణం చేసి చోడవరం దగ్గరిలోని ఆశ్రమ వైద్యశాలలో డాక్టర్ పెద్దపల్లి అప్పారావు గారిని కలిసి ఖరీదైన టీకా వేయించుకుంది. మళ్ళీ అదే రాత్రి దురంతో ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారేసరికి తిరిగి సికింద్రాబాద్ చేరింది.  (అప్పారావుగారు ముచ్చటపడి తీయించుకున్న ఫోటోచూడండి.)

ఆరేళ్లకింద బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు మా అమ్మాయి భరించలేని తలనెప్పితో యమయాతన పడింది. ఈ సారి ట్యూమర్ అంతకంటే ఉద్ధృతంగా పెరిగినా పిసరంత కూడా తలనెప్పిలేదు. శరీరానికి ఏ బాధా లేదు. ఏనాడూ జ్వరం లేదు. ఎలాంటి సమస్యా లేదనే ప్రతి పూటా చెప్పేది. ఎప్పుడు చూసినా ముఖం నిర్మలంగా కళకళలాడేది. చివరి రోజు కూడా జపం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంది. పిల్లల సంగతి కూడా నీకు అక్కర్లేదా అంటే "లేదు" అన్నట్టు నిర్విచారంగా తల ఊపింది. తల్లి ఇచ్చిన పళ్లరసం తాగి రాత్రి 8 గంటలకు హాస్పిటల్ కు వెళ్లింది. 11 గంటలకు వరసగా ఫిట్లు వచ్చాయి. శరీరం ఎడమవైపు పెరాలసిస్ రానున్నదని ఐసియు డాక్టర్ అంటుండగానే హార్ట్ బీట్ 200 నుంచి అధాటున 0 కి పడిపోయింది. ప్రాణం పోయాక కూడా  ఏ యాతన చాయలూ లేకుండా  వదనం కళగా ఉంది. 

ట్యూమర్, కాన్సర్ అంటూ మేము హడలిపోయాము.   ప్రతి వైద్యుడూ తన ముందే అన్నీ చెబుతున్నా అది తన విషయం కానట్టు నిర్లిప్తంగా విన్నదే తప్ప తన్మయిలో భయమూ లేదు. ఆందోళనా లేదు. . చివరి వరకూ స్పృహలోనే ఉంది. ప్రతిదీ గుర్తున్నది. అవసరమైతే చక్కగా మాట్లాడగలిగేది. లలితా సహస్రాన్ని గొంతెత్తి పారాయణ చేయగలిగేది. 

పిల్లలే ప్రాణంగా బతికిన మనిషి చివరి దశలో వారి మీద మమకారాన్ని కూడా వదిలేసింది. మురిపెంగా చూసేదే తప్ప పిల్లల గురించి  బెంగపడలేదు.ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుమొగంతో ఉండేది.  భవబంధాలను స్వచ్ఛందంగా, నిశ్చింతగా వదిలేసుకుని...  కర్మ, ఋణం తీరగానే అనాయాసంగా వెళ్లిపోయింది.

 నా ఇంట్లో నా దగ్గరే ఉన్నా ఆమె ఎవరో, తన ఆధ్యాత్మిక స్థితి, కాలక్రమంలో చెందిన పరిణతి ఎలాంటివో నేను గుర్తించలేక పోయాను. ఆ పుణ్యాత్మురాలిని కని పెంచినందుకు మేము ధన్యులమయ్యాము. 










(ఇది వరంగల్ గురుధామ్ లో ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారిని అక్క పల్లవితో కలిసి తన్మయి ఇంటర్వ్యూ చేసినప్పటి చిత్రం. )

































Thursday, 17 September 2026

మా తన్మయి మరిలేదు

 మా మూడో అమ్మాయి తన్మయి. బంగారం లాంటి పిల్ల. నలభై దాటకుండానే దానికి నూరేళ్లూ నిండాయి. వినాయకచవితి (14వతేది) రాత్రి 12-55న కాచిగూడ లోని దైహిక ఆస్పత్రిలో మా ముద్దుల కూతురు బ్రెయిన్ ట్యూమరు, ఇతరేతర దుష్ప్రభావాల మూలాన అనాయాసంగా ఇహలోకం వదిలివెళ్లింది.

మా ముగ్గురు అమ్మాయిలలో  తన్మయి చిన్నది. కాని అదే ఎక్కువ ధైర్యస్థురాలు. 1987లో పుట్టింది. బిటెక్ తరవాత బి-స్కూలులో ఎంబిఎ ఫైనాన్స్ చేసింది. 2011 లో  ముంబయి Capgemini లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం తెచ్చుకుంది.  అందులోని యాంత్రికత నచ్చక కొద్దినెలలకే దాన్ని స్వచ్ఛందంగా వదిలేసి, తనను తాను స్వతంత్రంగా ప్రూవ్ చేసుకోవటం కోసం పట్టుబట్టి హైదరాబాద్ తిరిగొచ్చింది. అప్పటి వరకూ నేను, నా భార్య దుర్గ కిందామీదా అవస్థపడుతూ నడుపుకుంటున్న "దుర్గా పబ్లికేషన్స్" ను సొంతంగా, సమర్థంగా డెవలప్ చేసింది. నా రచనలేకాక వేరే పుస్తకాలనూ విరివిగా ప్రచురించింది. బుక్ ఫెయిర్ లలో   తానే కూర్చుని స్టాల్ నడిపేది. నేను చేపట్టిన ప్రతి సమాజసేవా కార్యం లోనూ నాకు కుడిభుజంలా  పని చక్కబెట్టేది. 


ఇవన్నీ చేస్తూనే ఈ సంవత్సరం కొత్తగా SAP కోర్సు బహుకష్టపడి చేసింది. నా పేరు, పలుకుబడి నీడ కూడా పడకుండా, నాకు తెలియకుండా జాగ్రత్త పడి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాలుకు ₹14 లక్షల జీతం మీద ఉద్యోగం స్వశక్తితో సాధించింది. ఇద్దరు పిల్లల సంగతి చూసుకుంటూ, హైటెక్ సిటీకి సొంతంగా కారు డ్రయివ్ చేసుకుంటూ వెళ్లి ఈ జూలై మొదటివారం వరకూ చక్కగా పనిచేసింది. దాని కెరీర్ గొప్పగా పైకి వెళుతున్నదని అందరం ఆనందపడుతుండగా ఎవరూ కలనైనా ఊహించని రీతిలో విధి మాపై పగబట్టినట్టు ఏకంగా దాన్నే పైకి తీసుకుపోయింది. 

ఇంటా బయటా, చిన్నా పెద్దా అందరికీ తన్మయి అంటే చాలా ఇష్టం.  ప్రపంచంలో అదంటే గిట్టనిది కట్టుకున్నవాడికి, మెట్టినింటి వారికి మాత్రమే. శాయశక్తులా కష్టపడి జయప్రదంగా దానిని కాటికి పంపినది కూడా వారే. 

మా గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారి అనుమతి, ఆమోదం లేకుండా మేము ఏ ముఖ్య నిర్ణయమూ చేయము. వచ్చిన సంబంధాన్ని వారి ముందు పెట్టి, అనిష్టంగా, వ్యాకుల పడుతూ ఆయన సరే అన్న మీదట ప్రసిద్ధ జ్యోతిషులు పసుమర్తి కామేశ్వర శర్మ గారు ముందుండి నడిపించగా... బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, పలువురు యతీశ్వరులు స్వయానా విచ్చేసి ఆశీర్వదించగా 2014 లో తన్మయిని విజయవాడ గుంటుపల్లి వాస్తవ్యులైన తూములూరి గోవర్ధన రావు, గిరిజల సుపుత్రుడు, IBM ఉద్యోగి దిలీప్ కుమార్ కి ఇచ్చి 2014 డిసెంబరులో ( ఒక నివేశన స్థలం అమ్ముకుని) వైభవంగా పెళ్లి చేశాము. ఆ తరవాత అది ఏనాడూ సుఖపడింది లేదు. పిండుకోవటం, పీడించటమే తప్ప భార్యాబిడ్డలను సుఖపెట్టటం దాని మగడు ఎరగడు. 

మైలు దూరంలోనే ఉన్నప్పటికీ నాకు కూడా తెలియకుండా,పడిన శారీరక, మానసిక గృహహింస కారణంగా 2020 ఆగస్టులో తన్మయికి బ్రెయిన్ ట్యూమర్ దాపురించింది. లక్షలు ఖర్చుపెట్టి వెంటనే  సర్జరీ, రేడియేషన్ చేయించాను. అదేరోజుల్లో దాన్ని, ఇద్దరు పిల్లలను వదిలేసి మగడు చేతులు దులుపుకున్నాడు. గురుకృపతో తెప్పరిల్లిన తన్మయి గృహ హింస, కట్నం వేధింపు, ఫోర్జరీ వగైరా క్రిమినల్ కేసులు పెట్టింది. పిల్లల పోషణ కోసం మెయింటెనెన్సు కోరుతూ ఫామిలీకోర్టుకెళ్లింది. నాలుగేళ్లకు పైగా కోర్టులచుట్టూ తెగ తిరిగినా ఏకేసూ అంగుళం ముందుకు కదలలేదు. నేరస్థులను కడుపులో పెట్టుకుని కాపాడి, న్యాయార్తులను శతవిధాల సతాయించటాన్నే మనం నెత్తికెక్కించుకున్న దిక్కుమాలిన (అ)వ్యవస్థలో  న్యాయపాలన లేక రూల్ ఆఫ్ లా అందురు. 

తపస్సులా కోర్సుచేసి, కోరుకున్న ఉద్యోగాన్ని సాధించిన ఆనందంతో కళకళలాడవలసిన స్థితిలో తన్మయి ప్రవర్తన అనూహ్యంగా మారింది. పిల్లలు సహా ఎవరినీ, దేనినీ పట్టించుకోవటం మానేసింది. దానికి ఏదో అయింది. జులై లో MRI తీయిస్తే బ్రెయిన్ ట్యూమర్  మెదడుకు రెండు వైపులా మళ్లీ ఉద్ధృతంగా వచ్చిందన్నారు. అర్జంటుగా ఆపరేషన్  చేయాలి : కాని- వ్రణాన్ని సగం మాత్రమే తొలగించగలం. ఆపైన రేడియేషన్, కెమో థెరపీ చికిత్సలు షరా మామూలే. పక్షవాతం, చూపు, మాట, మెమరీ పోవటం వంటి సైడ్ ఎఫెక్టులు తప్పవు. కాని మరికొంతకాలం బతకాలంటే ఇంతకుమించి గత్యంతరం లేదు అని హైదరాబాద్, చెన్నై లలో పేరుమోసిన ఆస్పత్రుల ఘనవైద్యులు అన్నారు. సర్జరీ వద్దే వద్దు, రేడియేషనే గతి అని మరికొందరు స్పెషలిస్టులు చెప్పారు. వీటిలో ఏదారి ఎంచుకున్నా బతికేది మహా అయితే సగటున ఒకటి రెండేళ్లేనన్న సంగతి మాత్రం దాటేశారు. పులి, సింహం, చిరుతపులి వంటి సర్జరీ, రేడియేషన్, కెమోథెరపీలతో మా అమ్మాయిని వికృతాకారంలో జీవచ్ఛవాన్ని చేయటానికీ ప్రాణం ఒప్పక ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆశ్రయించాము. 


విశ్వవిఖ్యాత ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, ఇమ్యునాలజీలో సూపర్  స్పెషలిస్టు,  మాకు అత్యంత ఆప్తులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు,  ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపును తొలగించి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచటం ద్వారా సకల వ్యాధులను  నయంచేయగల ఇంజెక్షన్, టీకాలను సొంతంగా కనుగొన్న ప్రపంచ ప్రసిద్ధ ఇమ్యునాలజిస్టు, మైక్రో బయాలజిస్టు డాక్టర్ పెద్దపల్లి అప్పారావు గారు, మహా సిద్ధ వైద్య చికిత్సాలయ వైద్యులు డాక్టర్ నిర్లేప, ప్రసాద్ గార్లు, కోయంబత్తూరు లోని ప్రముఖ కాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ రాధేశ్యామ్ గారు, న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీనాధ్ శివరాజు గారు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ధనంజయ్, డాక్టర్ ఎస్. ఎస్. శాస్త్రి, ఆయర్వేద నిపుణులు డాక్టర్ ప్రదీప్ గారు, హోమియో వైద్యులు డాక్టర్ నాగ హరిత గారు తన్మయి మీద అభిమానంతో  శాయశక్తులా ప్రయత్నించారు. అమ్మాయిని చూసిన ప్రతి డాక్టరూ ఆమె తలనెప్పి, శరీర బాధ ఏదీ లేకుండా జీవకళతో చక్కగా ఉన్నందుకు ఆశ్చర్య పడ్డారు. 

కంచి కామకోటి సర్వజ్ఞ పిఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి, కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి, విశ్వయోగి విశ్వంజీ మహారాజ్, పెద్దముత్తేవి శ్రీకృష్ణాశ్రమ గురువు శ్రీ గౌరా గారు,  తన్మయిని విశేష వాత్సల్యంతో ఆశీర్వదించారు. కంచి కామాక్షి, స్కందగిరి, చిల్కూరు బాలాజీ, ఎల్లారమ్మ దేవాలయాల నుంచి ప్రసాదాలు వచ్చాయి. చివరి రోజు వరకూ మా అమ్మాయి  హనుమాన్ చాలీసా, లలితా సహస్రం, నవగ్రహ స్తోత్రాదులు పారాయణం, మంత్ర జపం ప్రతి నిత్యం చేసింది. రోజూ గురువుగారి ఫోటో కళ్లకద్దుకునే మంచం దిగేది. గంటముందు వరకూ మామూలుగానే కనిపించింది. నిర్విచారంగా, నిర్వికారంగా, ప్రశాంతంగా వెళ్లి పోయింది. 

దానికి పక్షం రోజుల ముందు కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేశ్వరానంధ భారతి స్వామి స్వయంగా ఫోన్ చేసి అమ్మాయి మీద క్షుద్ర పీడ ఉన్నదని చెప్పి, చేయవలసింది తెలిపారు. మాకు చిరకాలంగా ఆప్తులు, పాదుకాంత పూర్ణ దీక్షాపరులు శ్రీ జి. వి. కె. రావు గారు అత్తింటి వారు కొన్నేళ్లకిందటే ఆమెను నిర్వీర్యంచేసి, ప్రాణం తీసేందుకు తీవ్ర ప్రయోగం చేసినట్టు ధ్రువీకరించారు. పదకొండు రాత్రులు ఆయన వారాహి మంత్ర జపం, తార, ఉచ్చిష్ట గణపతుల పూజ చేసి తీర్థం ఇచ్చారు. ఆయన చెప్పిన దానినే చెన్నై తాంత్రిక నిపుణులు రోచిష్మాన్ గారు కూడా ధ్రువపరిచారు. నల్లగొండలోని రుద్రాంశ శక్తిపీఠం హనుమత్ ఉపాసకులు తన్మయి ఫోటో చూడగానే ఆమె మారణానికి తీవ్ర ప్రయోగం జరిగిందని చెప్పారు. పాండిచ్చేరి దగ్గరి కారైక్కల్ లోని ఉచ్చిష్ట గణపతి, శివారాధకులు కేవలం ఆమె ఫోటోను చూసీ ఏఏ సంవత్సరాలలో, ఎక్కడెక్కడ ఏఏ  విధాలుగా ఆమె మీద పగతో భర్త, అత్త ఏ వస్తువులను ఉపయోగించి ఎటువంటి  ప్రయోగం చేయించారో కళ్లతో చూసినట్టు వివరించారు. దాని విరుగుడుకు ఆయన ప్రయత్నం చేసేలోపే అమ్మాయి వెళ్లిపోయింది. 

ఈ ఫిబ్రవరిలో తన్మయి పట్టుబట్టి, తానే అన్నీ ఆర్గనైజ్ చేసి పదేళ్ల కుమారుడికి ఉపనయనం చేయించింది. అత్త మామలు మేము రమ్మన్నా రాలేదు. బిడ్డలిద్దరితో కలిసి స్వయంగా వెళ్లి అడిగినా భర్త పట్టించుకోలేదు. ఈ 15 న మరణవార్త తెలిపినా, ఎంతమంది ఫోన్ చేసినా వారెవరూ వచ్చి చూసిన పాపాన పోలేదు. అంత్యక్రియల మరుసటి రోజు రాత్రి అతడు "హాయ్ శాస్త్రి గారూ, విషాద వార్త విని దిగ్భ్రాంతి చెందాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని మెసేజ్ పంపాడు. 

బన్సీలాల్ పేట శ్శశాన వాటికలో నిత్య కర్మలు చిక్కడపల్లి లోని మా స్వగృహంలో 23 నుంచి 25 వరకు 10,11,12 రోజుల కర్మలు తన్మయి కుమారుడు చి. రుత్విక్ చేస్తున్నాడు. మొత్తం కుటుంబ సభ్యులం, బంధువర్గం ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. కేవలం సన్నిహిత బంధుమిత్రులకు పరిమితమైన ప్రైవేటు కార్యక్రమంగా దీనిని దుఃఖ భారంతో నిర్వహిస్తున్నాము. అందరితో అన్నీ ఏకరువుపెట్టి, పరామర్శలు, సాంత్వనపూర్వక హితబోధలు అందుకునే ఓపిక, సత్తువ నాకు గాని, వాళ్లమ్మకు గాని లేవు. కొద్ది రోజులపాటు మా మానాన మమ్మల్ని వదిలేయటమే మాకు చేయగలిగిన మేలు. నేను బాగానే ఉన్నాను. విధి లీల, ప్రారబ్ధం, వైరాగ్యం, వేదాంతాల గురించి అనర్గళంగా పరోపదేశం చేయగలిగిన స్థితిలోనే ఉన్నాను. 

నా హితైషి పవన్ కల్యాణ్ గారి సంతాప ప్రకటన ద్వారా విషయం తెలిసి, తల్లడిల్లి, సానుతాపంతో ఫోన్లు, మెసేజ్ లు చేసిన, ఇంటికి వచ్చి పరామర్శించిన నా మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, పూజ్యులు అందరికీ వందనాలు. మూడునెలలుగా సమయమంతా మా అమ్మాయి కోసమే వెచ్చించాను. నా ధర్మ నిరతి, ఉద్యమ దీక్ష పూర్వం లాగే ఉన్నాయి. త్వరలో కలుద్దాం. ఆలోచించ వలసింది, చేయవలసింది చాలా ఉన్నాయి. 🙏