Friday, 16 January 2026

మీడియా తప్పేమిటి?

 మూడు రోజులుగా మీడియాలో, అన్ సోషల్ మీడియాలో మోత మోగిపోతున్న ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వార్త, బరితెగించిన మీడియా అంటూ సమాజంలో బహు నీతిమంతుల ధర్మాగ్రహాల ఫెళ ఫెళార్భాటానికి బిత్తరపోయి ఇంతకీ ఏమిటా వార్త అని ఇప్పుడే చూశాను. అరడజనుకుపైగా సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ల టైము వేస్టు చేసి, సిట్టు వేసి, విమానాశ్రయం లో మాటువేసి ఫ్లైటెక్కబోతున్న జర్నలిస్టును అంతర్జాతీయ టెర్రరిస్టు లెవెల్లో అవమానకరంగా పట్టుకొచ్చి, ఇళ్లమీదపడి జర్నలిస్టులను మానసికంగా హింసించి, బాధ్యత గల మీడియా సంస్థ కార్యాలయం ఆగమాగం చేయాల్సినంత మహానేరం, మహాపాపం ఇందులో ఏముందో నాకైతే అర్థం కాలేదు.

 జర్నలిజంలో అర్ధ శతాబ్ది అనుభవం గడించి...  బాధ్యతా యుతమైన దిన పత్రికకు 23 ఏళ్లు బాధ్యతాయుతంగా సంపాదకత్వం వహించి...ప్రభుత్వాల మీద, అధికార మదాంధుల పవరుకావరం మీద ఎన్నో యుద్ధాలు చేసి సమాజంలోని అన్ని వర్గాల సుహృద్భావం, గౌరవం చూరగొన్న ఎడిటర్ గా నాకు ఎన్టీవీ వారి కథనంలో తప్పు పట్టాల్సింది ఏమీ కనిపించటం లేదు.

 నేను ఎడిటర్ గా ఉండగా ఇదే స్టోరీని నా రిపోర్టర్ పట్టుకొచ్చి ఉంటే నిరభ్యంతరంగా క్లియర్ చేసే వాడిని. మరీ ఎన్టీవీ పిల్లలు వేేసినంత పచ్చిగా, కచ్చగా కాదుగాని, కాస్త శుభ్రమైన భాషలో, ఎవరి చేతికీ చిక్కని రీతిలో సంస్కరించి ఆ స్టోరీని తప్పక బయటపెట్టే వాడిని. దాని మీద ఏ ఆక్షేపణలు, నేరారోపణలు వచ్చినా, ఎన్ని కేసులు, దాడులు ఎదురైనా నా రిపోర్టర్లకు, సంపాదకీయ సిబ్బందికి రక్షణగా నిలబడి ప్రభుత్వ, పోలీసు దురాగతాన్ని నా పత్రిక ఫ్రంట్ పేజిలో చీల్చి చెండాడేవాడిని.మేము చేసింది ఎలా సబబో, మాపై జరిగింది ప్రజాప్రయోజనాలకు,  పత్రికా స్వాతంత్ర్యానికి ఏరకంగా భంగకరమో పౌర సమాజానికి సహేతుకంగా, తార్కికంగా వివరించి, ప్రజాస్వామ్య హితైషులందరినీ ఒప్పించేవాడిని. మళ్లీ ఇంకొకసారి ఇలాంటి ఆగడానికి పాల్పడకుండా పౌర సమాజపరంగా గట్టి గర్జన చేయించి ఉండేవాడిని. 

తాజా ఉదంతంలో నేను షాక్ అయింది పోలీసుల ఓవరాక్షనుకు కాదు.  పౌర సమాజం అన్నా, మీడియా అంకుశమన్నా భయమనేది లేకపోతే ప్రభుత్వాలూ, పోలీసు శాఖలూ ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే వ్యవహరిస్తాయి. ఆశ్చర్యపోవలసిందీ, అసహ్యించుకోవలసిందీ ఆ మీడియా సంస్థలోని ఎడిటోరియల్ హెడ్ల,   యాజమాన్య ప్రతినిధుల నిష్క్రియాపరత్వం చూసి! తాము చేసిన దానిని సభ్య సమాజం ముందు తమకు తాముగా బహిరంగంగా డిఫెండ్ చేసుకోలేక... మీడియా వ్యవస్థ గౌరవాన్ని, జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేక -కలుగులో దాక్కున్న- వారి పిరికితనాన్ని చూసి!

జర్నలిస్టులకు, ఎడిటర్లకు విలువ అనేది పోయి మీడియా అనేది యజమానుల ఇష్టారాజ్యంగా, మేనేజిమెంట్ల నీచ నికృష్ట స్వార్థాల స్వైర విహారంగా, రాజకీయ, వ్యాపార లావాదేవీల సెటిల్మెంటు రంగస్థలిగా మారినప్పుడు మీడియా దౌర్భాగ్యం ఇలాగే ఉంటుంది.

Thursday, 2 October 2025

నమస్తే సదావత్సలే మాతృభూమే !

ఎం.వి.ఆర్.శాస్త్రి

1925 సంవత్సరంలో సిద్ధాంతపరంగా , విధాన పరంగా, ఆలోచన పరంగా ఉత్తర, దక్షిణ ధ్రువాలైన రెండు ప్రజా సంస్థలు ప్రస్థానం  ప్రారంభించాయి. 

1. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

2. భారత కమ్యూనిస్టు పార్టీ

రెండిటికీ గొప్ప చరిత్రే ఉన్నది. రెండు సంస్థలూ మేధో పరంగా, సామాజికంగా , సాంస్కృతికంగా తమదైన ముద్రను జాతి జీవనంలో బలంగా వేశాయి. కాని కాలక్రమంలో చీలికలు పేలికలయి, మూల సిద్ధాంతం చచ్చి ,  నైతిక ధ్రుతి సడలి, రాజకీయంగా దిగజారి , ప్రజల చేత తిరస్కరింపబడి భారత కమ్యూనిస్టు పార్టీ దాదాపుగా దివాలా తీసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖండంగా, అప్రతిహతంగా  ముందుకు సాగి , శాఖోపశాఖలుగా మహా వట వృక్షం వలె విస్తరించి , నిత్య నూతనంగా వర్ధిల్లుతున్నది. ఇన్ని కోట్ల కార్య కర్తల తో , ఇన్నిన్ని క్షేత్రాల్లో ఇన్నిన్ని బృహత్ వ్యవస్థలతో , ఇంత ఏకశిలాసదృశంగా , ఇంత క్రమశిక్షణా యుతంగా , ఇంత నిస్వార్థంగా ,నిరాడంబరంగా,  వంకపెట్టలేనంత పకడ్బందీగా నూరేళ్లుగా  నడుస్తున్న సాంస్కృతిక, సాంఘిక సేవా సంస్థ మొత్తం ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. 

 ఆర్.ఎస్.ఎస్. ఏమి చేస్తుంది , దాని విజయరహస్యమేమిటి అన్నది ఆ సంస్థ గిట్టనివారికి ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు. ఆరెస్సెస్ గర్జించదు. క్షాత్రం ప్రదర్శించదు. ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోదు. ఎవరెంత దుమ్మెత్తి పోసినా చలించదు. ఎవరెంత మొత్తుకున్నా తాను ఎంచుకున్న దారి నుంచి అరంగుళం బెసగదు. తన ప్రభావం  ఎంత ఘనమైనదైనా ఆరెస్సెస్ బహిరంగంగా చెప్పుకోదు. తన ప్రతాపాన్ని ఒప్పుకోదు.

సంఘ నిర్మాణానికి మనుషులను తయారుచేయటం, సహస్ర బాహువులతో వారి చేత పనిచేయించటమే సంఘ్ పని. అది తానుగా లైమ్ లైట్ లో ఎక్కడా కనపడదు. సంఘ్ జస్ట్ ఉంటుంది. అంతే. అది ఉన్నది కాబట్టే హిందూ సమాజం క్షేమంగా ఉన్నది.  సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని, హైందవ సంస్కృతిని,  హిందువుల ఉనికిని నిర్మూలించటానికి ప్రపంచ వ్యాప్తంగా రాక్షస , పైశాచిక అక్షౌహిణులు  ఉమ్మడిగా విరుచుకుపడుతున్న ఈ విపత్కాలంలో ఆరెస్సెస్ లేని హిందూ సమాజాన్ని తలచుకుంటే భయం వేస్తుంది. 

నేను స్వయం సేవక్ ను కాను. సంఘ్ శాఖకు ఏనాడూ హాజరుకాలేదు. ఆరెస్సెస్ తో కాని, దాని అనుబంధ సంస్థలతో కాని నాకు  ఎలాంటి ప్రమేయం లేదు. అయినా అర్ధ శతాబ్దిగా సంఘ్ కార్యకలాపాలను నిశితంగా, సన్నిహితంగా గమనిస్తున్న మేధావిగా నాకు ఆరెస్సెస్ మీద అపార గౌరవం ఉంది. అచంచల విశ్వాసం ఉన్నది. కొన్ని తరాలుగా సంఘ్ వరిష్ఠ నాయకులతో నాకు ఆత్మీయ అనుబంధం ఉన్నది. పూజ్య సర్ సంఘ్ చాలక్‌మోహన్ జీ తో , సర్ కార్యవాహ్ దత్తాజీతో పరిచయ భాగ్యం కూడా కలిగింది.



 




నాకు ఆరెస్సెస్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా కరడుగట్టిన ఆరెస్సెస్ వాడిగానే నాకు హిందూ వ్యతిరేకుల దృష్టిలో గుర్తింపు. అందుకు నాకు సంతోషమే తప్ప సంతాపం లేదు. దిగ్విజయంగా , సగర్వంగా శతవసంతోత్సవం చేసుకుంటున్న వేళ హిందూ సమాజానికి కొండంత అండ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ అనే మేరునగానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, వినమ్ర ప్రణామాలు, మనసారా కృతజ్ఞతలు.  "నమస్తే సదావత్సలే మాతృభూమే"  అని  దిగంతాలకు నినదిస్తూ  తొలి శతాబ్దిలాగే సహస్రాబ్ది మైలురాయినీ మన "సంఘం" జయప్రదంగా చేరుకోవాలని నా శుభకామన. 


Friday, 28 June 2024

సామవేదం : నిశ్శబ్ద ధార్మిక విప్లవం

 

 ఎం.వి.ఆర్.శాస్త్రి

https://youtu.be/0hyPgJ3JtGA?si=p8u4UN4CacIs5IKC

     “హిందువులకు దేవుడే దిక్కు" అని నేను చేసిన కొత్త వీడియోను ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న "ఋషిపీఠం" వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు చూసి మెచ్చుకుంటూ  ఆడియో సందేశం పంపారు. ధన్యోస్మి. మేమిద్దరం ఒకే గురువు నుంచి స్ఫూర్తి ని, శక్తినీ పొంది , గురు ఉపదేశాన్ని దివ్యాదేశంగా తలచి ఎవరి క్షేత్రంలో వారు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్లం. ధర్మ వీరుడు, ధర్మ ప్రచారకుడు, ధర్మ మూర్తి అయిన షణ్ముఖశర్మ  గారి మెచ్చుకోలును  సద్గురు శివానందమూర్తి గురుదేవులు పలికించిన దీవెనగా భావిస్తాను




      షణ్ముఖ శర్మగారు నాకు కనీసం 30 ఏళ్లుగా తెలుసు. స్వాతి వారపత్రికలో జర్నలిస్టుగా , సినిమా కవిగా జీవయాత్ర సాగించిన కాలం మొదలుకుని ... ఋషిపీఠం  పెట్టి బాలారిష్టాల నుంచి దానిని ఒడ్డున పడవేయటానికి సతమతమైన వామన దశ నుంచి ... ప్రవచన రంగంలో ఇంతింతై బ్రహ్మాండమంతగా ఎదిగి దేశ దేశాలలో లక్షల అభిమానుల  అక్షౌహిణులను సమకూర్చుకుని నిశ్శబ్ద ధర్మయుద్ధంలో  నిమగ్నమైన నేటి అవక్ర త్రివిక్రమత్వం వరకూ- సామవేదంవారి  ప్రస్థానాన్ని నేను దూరం నుంచే సన్నిహితంగా గమనిస్తున్నాను. ధర్మపీఠం ముందు నిలబడి సత్య నిష్ఠ తో దేనినైనా ప్రశ్నించి, ఎవరినైనా నిలదీసి , అక్షరాయుధంతో  అధర్మాన్ని చీల్చి చెండాడటంలో ఎవరికీ తీసిపోను- అని  కొంచెం ఎక్కువే గర్వించే నేను కూడా క్రోధం లేకుండా శుద్ధ సత్వాన్ని వీడకుండా మెత్తటి మాటలలోనే వజ్ర సదృశ కాఠిన్యాన్ని, ధర్మాగ్రహ ప్రచండత్వాన్ని  భాసింపజేయగల సామవేదం వారి సంపాదకీయ ప్రజ్ఞకు ఆశ్చర్యపోతుంటాను.  ఉదాహరణకు  కాశీ కారిడార్ నిమిత్తం వారణాసి క్షేత్రం లోని ప్రాచీన దేవతామూర్తులను పెకలించినప్పుడు “క్షేత్రాపచారం జరగరాదు” శీర్షికతో 2021 జూలై లో శర్మగారు రాసిన ఈ పలుకుల ములుకులను చిత్తగించండి:




     “ప్రాచీన క్షేత్రాలను, ఆలయాలను అభివృద్ధిపరచడం హర్షణీయమే.కానీ ఆ క్రమంలో వాటి ప్రాచీనతనీ , చరిత్రనీ , పౌరాణిక ఐతిహాసిక ప్రాధాన్యాన్నీ పావనత్వాన్నీ దెబ్బతీయకుండా వాటిని పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయాలి. కాశీ కేవలం కట్టడాల క్షేత్రం కాదు. దానికి లెక్కలకందని కాలాల ఘనేతిహాస నేపథ్యం  ఉంది. ఏ లింగం, ఏ ప్రతిమ ఏ స్థానంలో ఉందో పురాణాలు వర్ణించాయి. వాటిని తొలగిస్తే ఆ స్థానాల పురాణ నేపథ్యం తెలిసి చేసే శాస్త్ర విధానాలు , యాత్రలు ఏమవుతాయి? మనకు చిన్నప్రతిమలుగా , గూడుల్లాంటి గుడులుగా కనపడుతున్నవి విశ్వ చైతన్య శక్తిబిందువులు . COSMIC ENERGY POINTS గా వైజ్ఞానిక పరిశోధనలతో తేల్చారు. ఆ చోటు నుండి వాటిని కదల్చినా ఒక శక్తి కేంద్రాన్ని భంగ పరచినట్టే కదా? ఇళ్ళూ, దుకాణాలు  కూల్చినట్టు గుడులనూ, ప్రతిమలను తొలగించటం దైవాపచారం, క్షేత్రాపచారం అవుతాయి కదా!

     “కాశీ పునర్నిర్మాణంలో ద్వాదశాదిత్య మందిరాలు , పంచ వినాయకులు, కొన్ని స్వయంభూ లింగాలు, మూర్తులు తొలగిపోయాయనీ, ముక్తిమండపం కూడా పోతోందనీ, ఒక ప్రాచీన అక్షయ మహావృక్షం ఖండించబడిందనీ ఎందరో వేదన పడుతున్నారు. విశ్వనాథాలయాన్ని మరింత శోభాయమానం చేస్తూ చక్కని కారిడార్ కట్టడం మంచిదే కానీ , ఆ మందిర శోభ కోసం ఎన్నో ప్రాచీన మందిరాలను, దేవతామూర్తులను, ప్రాచీన వృక్షాలను ధ్వంసం చేయటం సమంజసమా? ఈ క్షేత్ర దైవాపరాధం దేశానికి క్షోభకరం  కాదా? దేశాన్నీ, ధర్మాన్నీ దెబ్బతీయాలని చూస్తున్న విపక్షాల మూక దీనిని అవకాశంగా తీసుకుని హిందువులను చీల్చవచ్ఛు కూడా. “

      ఆ ఋషివాక్కే నిజమయింది. కాశీక్షేత్ర దైవాపరాధమే ఇప్పుడు ఈ  దేశానికి క్షోభకరం అయింది. దేశాన్నీ ధర్మాన్నీ దెబ్బతీయాలనుకునే విపక్షాల మూక ఇలాంటి దైవాపరాధాలను , అనేకానేక ధర్మాపచారాలను అవకాశంగా తీసుకుని హిందువులను చీల్చనే చీల్చింది. 400 కు తగ్గేదే లేదని తొడకొట్టిన భాజపేయ గండర గండలు ధర్మదేవత చాచికొట్టిన దెబ్బకు ఎన్నికల గోదాలో కుదేలై సింపిల్ మెజారిటీకే తెరువులేక అలయెన్సు ఊతకర్రల సాయంతో సర్కారును నెట్టుకు రావాల్సిన దుస్థితికి చేరారు.

      ఆ సంగతి అలా ఉంచండి. తెలుగులో -ఆ మాట కొస్తే దేశంలోనే ఎన్నో వందల, వేల  పత్రికలు ఉన్నాయి కదా? ప్రాచీన కాశీ క్షేత్రంలో సౌకర్యాల అభివృద్ధి పేర పరమ పవిత్రమైన దేవతా మూర్తుల , దైవ ప్రతీకల మహా విధ్వంసం జరిగితే ఋషిపీఠం వలె గొంతెత్తి అపచారాన్ని నిష్కర్షగా ఖండించిన పత్రిక వేరొకటి ఉన్నదా అంటే నాకైతే సందేహమే.  

     సద్గురు శివానంద మూర్తి గారి దివ్య స్ఫూర్తితో వేల మందిని కదిలించి ధర్మరక్షణకు కార్యోన్ముఖం చేయించి దేశంలోనే ఒక గొప్ప ధార్మిక ఉద్యమానికి చోదకశక్తి కాగలిగిన యోగ్యత, దక్షత షణ్ముఖశర్మగారికి ఉన్నాయి.ఆ మాట నేను ఆయనతోనే పలుమార్లు అన్నాను. కాని పట్టించుకున్నట్టు కనిపించలేదు. వయసు, వనరులు, శక్తి, సామర్ధ్యం , అవకాశం అన్నీ ఉండి కూడా ఆయన విసుగు , విరామం లేకుండా నిరంతర ప్రవచనాలకే సమయమంతా వెచ్చిస్తూ అసలైన, హిందూసమాజానికి జీవన్మరణ సమస్య వంటి  ధర్మ పోరాటం మీద శ్రద్ధ పెట్టటం లేదు. ప్రవచనాలు ఎన్ని చెప్పినా మన మొద్దు జనాలు మారతారా, కదులుతారా అని నాకు లోలోన ఒకింత అసంతృప్తి ఉండేది. అదికూడా ఒక నెలకింద పోయింది. అదీ ఆశ్చర్యకరంగా .



1999 జూలై లో సంస్థాపన నుంచి ఈ జూన్ వరకు పాతికేళ్లలో రాసిన 209 “ఋషిపీఠం సంపాదకీయాలు” ను అదే పేరిట ప్రచురించామనీ , నా అభిప్రాయం కోసం దాన్ని నాకు పంపుతామనీ శర్మగారు ఆ మధ్య  నాకు ఫోన్లో చెప్పారు. ఆ సందర్భంలోనే ఋషిపీఠం రజతోత్సవ వేడుకలు మూడు రోజులుగా భాగ్యనగరం లో జరుగుతున్నాయని , ఆహ్వాన పత్రిక ప్రత్యేకంగా మా ఇంటికి పంపించామని  గుర్తు చేసి ఆ సాయంత్రం  ముగింపు సభకు స్వయంగా ఆహ్వానించారు. వెళ్లకపోవటం మర్యాద కాదు కనుక 6-30లోగా తప్పక వస్తానని చెప్పాను.

బషీర్ బాగ్ లోని భారతీయ విద్యాభవన్ పెద్ద ఆడిటోరియం లో సభ.  6 గంటలకు మొదలు అని చెప్పినా అతిథులు, ఆహూతులు వచ్చి సీట్లలో సెటిలై కార్యక్రమం మొదలెట్టేసరికి మామూలు ఆనవాయితీ ప్రకారం ఆరున్నర పైమాటే. అయినా  శర్మగారిని ముందుగా కలిసి కాసేపు మాట్లాడుదాం అనుకుని 6-10 కల్లా సభాస్థలికి చేరాను. వెయ్యి మంది పట్టే ఆ ఆడిటోరియం అంతా నిశ్శబ్దంగా ఉన్నది. గేటు దగ్గర నిలబడి గౌరవ అతిథుల కోసం ఎదురు చూసేవారు లేరు. ఎక్కడా ఏ రకమైన అలికిడీ లేదు. అనుమానం వచ్చి ఇంకోసారి ఆహ్వాన పత్రిక చూశాను. సరైన  టైముకు సరైన స్థలానికే  వచ్చాను. మరి ఒక్క కార్యకర్తా కనపడడేమిటి ? ఒక  వేళ ప్రోగ్రాం కాన్సిల్ అయిందేమో కనుక్కో అని నా అసిస్టెంటుకు చెప్పాను. అతడు లోపలికి వెళ్లి కనుక్కుంటే   మీటింగు అప్పటికే మొదలైందని చెప్పారట.



      ఎవరూ లేకుండా మీటింగు ఏమిటి అని ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్లి చూద్దును గదా ఆడిటోరియం కిటకిటడుతున్నది. ముందు వరసలో నా కోసమే అన్నట్టు ఒక్క సీటు ఖాళీగా ఉన్నది. ఎక్స్ ట్రా చెయిర్లు కూడా వేసి ఉన్నాయి. అవిగాక కొంతమంది వరసలలో నెల మీద కూచుని ఉన్నారు. హౌస్ ఫుల్ అయినా హాలంతా నిశ్సబ్దంగా ఉన్నది. ఎవరూ ఎవరినీ పట్టించుకునే స్థితి  లో లేరు. అందరి దృష్టీ నడుస్తున్న కార్యక్రమం మీద  లగ్నమై ఉన్నది. పెద్ద వేదిక . దాన్ని మధ్య మూడే మూడు కుర్చీలు. మధ్యలో మెగా మాగ్నెట్ సామవేదం వారు. అటూ ఇటూ ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు ; కంచి పీఠం చల్లా విశ్వనాథ శాస్త్రిగారు , ఇద్దరూ పది పదిహేను నిమిషాలు క్లుప్తంగా మాట్లాడారు. షణ్ముఖ శర్మగారూ 40నిమిషాలకంటే ఎక్కువ సమయం తీసుకోలేదు.




      అమెరికా నుంచి , ఇతర దేశాలనుంచి సకుటుంబంగా వచ్చిన ఎంతో మంది    శిష్యులు-  గొప్ప గొప్పఎం.ఎన్.సీ .లలో చాలా పెద్ద హోదాలో ఉన్న చిన్నవయసు దిగ్గజాలు సంప్రదాయ వైదిక దుస్తుల్లో నేలమీద భక్తిశ్రద్ధలతో నిష్టగా కూచోవటం, పిల్లాజెల్లా ఉన్నా చప్పుళ్ళు , కేకలు లేకపోవటం, వాలంటీర్ల హడావుడి లేకుండా సుదీర్ఘ  కార్యక్రమం మిలిటరీ క్రమశిక్షణతో చకచకా నడిచిపోవటం చూసి ముచ్చట వేసింది. సామవేదం షణ్ముఖ శర్మగారు ఊళ్లు, దేశాలు పట్టుకుని ప్రవచనాలు చేయటం, ఋషిపీఠం పత్రిక నడపటం మాత్రమే కాదు -వారి ట్రస్టు సనాతన ధర్మ సంరక్షణకు, ఆర్ష విద్య, సంస్కృతి, కళల అభ్యున్నతికి దేశంలోనూ, దేశాంతరాలలోనూ వేలమందిని సమీకరించి బృహత్ వ్యూహంతో నిశ్శబ్ద ధార్మిక విప్లవానికి తనవంతు కృషి పటాటోపం లేకుండా సాగిస్తున్నదని నాకు అర్థమయింది. నేను లోపలికి వెళ్ళటం లాగే రెండుగంటల తరవాత బయటికి రావటమూ ఎవరూ గమనించలేదు. నేనా సభలో ఉన్నట్టు శర్మగారికి కూడా బహుశా ఇప్పటికీ తెలియదు.

      ధర్మం గురించి గావుకేకలు పెట్టి, సొంత లాభానికి ధర్మాన్ని అడ్డంగా వాడుకునే ఆధ్యాత్మిక ఆషాఢభూతుల కంటే మౌనంగా వేగంగా ప్రణాళికాబద్దంగా ధర్మవిజయానికి వేలమందిని నిమగ్నం చేయిస్తున్న సామవేదం వంటి వారి వల్లే ధర్మం నిలబడుతుంది. హిందూ దేశంలోనే హిందువుల మనుగడ ప్రశ్నార్థకమై , రకరకాల మానసిక , సామాజిక , రాజకీయ వైకల్యాలతో హిందూ సమాజం నిస్తేజం, నిర్వీర్యం అయిన ప్రస్తుత దురవస్థనుంచి బయటపడి హిందూ దేశంలో హిందూ రాజ్యం సర్వమతాలకు శ్రేయోదాయకంగా సుప్రతిష్ఠితమవటానికి తాజా వీడియోలో నేను చేసిన సూచన షణ్ముఖశర్మ గారికి నచ్చి తాను సైతం ఆదిశగా అడుగువేస్తానని చెప్పటం చాలా సంతోషం. ధార్మిక , ఆధ్యాత్మిక రంగాలలో దిగ్దంతులైన ఆయన వంటి మహానుభావులు పూనుకుని సమష్టి కార్యాచరణకు ఆయత్తం కాగలిగితే అంతకంటే కావలసింది ఏముంది?    

https://youtu.be/7dtjLr8xQTk?si=1pp96gpDFoIit48m

     సామవేదం వారితో ఇంతకు ముందు ఒకసారి నేను ధర్మ సంబంధమైన వీడియో సంభాషణ చేశాను. యు ట్యూబ్  లో దాన్ని చాలామంది చూశారు. దానికి కొనసాగింపుగా సమకాలిక ధర్మ సంకటాలు, హిందుత్వ అస్తిత్వ సమస్యలపై ఆయనతో ఇంకో సంవాదం చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నా ఇప్పటి దాకా కుదరలేదు. ఆ సంగతే ఇవాళ ఫోన్లో మాట్లాడగా జూలై చివరి వారంలో అమెరికా నుంచి తిరిగి వచ్చాక వీలైనంత త్వరలో ఒక పూట సావకాశంగా కలుద్దామని శర్మ గారు అన్నారు. శుభం.

                                                ---------------------------------